Hyderabad: మెట్రో టికెట్ ధరల పెంపును వెనక్కు తీసుకోవాలి
ABN , Publish Date - May 18 , 2025 | 04:07 AM
హైదరాబాద్ మెట్రో రైల్ టికెట్ ధరల పెంపును వెనక్కు తీసుకోవాలని నగర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ పంపారు.

సీఎం రేవంత్రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల లేఖ
హైదరాబాద్, మే 17 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ మెట్రో రైల్ టికెట్ ధరల పెంపును వెనక్కు తీసుకోవాలని నగర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ పంపారు. మెట్రో టికెట్ ధరల పెంపు వల్ల లక్షలాది పేద, మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో ప్రజల అవసరాలకనుగుణంగా పనిచేయాలని, ప్రైవేట్ కంపెనీల లాభాల కోసం కాదనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని కోరారు.
టికెట్ ధరల పెంపు వల్ల ప్రయాణికులు ఇతర రవాణా మార్గాలకు మారే పరిస్థితి ఉందని, దీని వల్ల ట్రాఫిక్, కాలుష్య సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశముందని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితాఇంద్రారెడ్డి, టి.పద్మారావు గౌడ్, మాగంటి గోపినాథ్, కేపీ వివేకానంద గౌడ్, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, బండారు లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డిలు సంయుక్తంగా సీఎంకు లేఖ పంపారు. కాగా, కేసీఆర్ హయాంలో మెట్రో టికెట్ ధరలు పెంచలేదని ఎమ్మెల్యే సుధీర్రెడ్డి తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.