Share News

Etala Rajender: కాళేశ్వరంపై బాధ్యత అంతా కేసీఆర్‌దే!

ABN , Publish Date - May 27 , 2025 | 04:32 AM

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఏర్పాటైన జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఎదుట మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ జూన్‌ 6న హాజరు కానున్నారు. విచారణ కమిషన్‌ జారీ చేసిన నోటీసులకు సమాధానం ఇవ్వనున్నారు.

Etala Rajender: కాళేశ్వరంపై బాధ్యత అంతా కేసీఆర్‌దే!

  • కమిషన్‌ ఎదుట చెప్పనున్న ఈటల

హైదరాబాద్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఏర్పాటైన జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఎదుట మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ జూన్‌ 6న హాజరు కానున్నారు. విచారణ కమిషన్‌ జారీ చేసిన నోటీసులకు సమాధానం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా అప్పటి పాలనా పరిస్థితులను కమిషన్‌కు ఈటల తెలిజేయనున్నారని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఈటల రాజేందర్‌ ఆర్థిక మంత్రిగా పనిచేసిన నేపథ్యంలో ఆయనకు కమిషన్‌ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధుల సేకరణ కోసం నాటి కేసీఆర్‌ ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. ఆర్థికశాఖతో సంబంధం లేకుండానే ఆ కార్పొరేషన్‌ ద్వారా రుణాలు సేకరించింది. పేరుకు ఈటల ఆర్థిక మంత్రిగా ఉన్నా.. మొత్తం వ్యవహారాన్నంతా అప్పటి సీఎం కేసీఆరే నడిపించారని, ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు కూడా ఆయనే చేశారని, ప్రాజెక్టు ఎక్కడ కట్టాలో ఆయనే నిర్ణయించారనే ప్రచారం ఉంది.


ప్రాజెక్టు ఎక్కడ కట్టవద్దో ఇంజినీర్లు సూచించినా కేసీఆర్‌ బేఖాతరు చేశారని, అలాంటిది.. ఆర్థిక మంత్రిని ఆయన పట్టించుకుంటారా? అనే అభిప్రాయాలున్నాయి. పైగా, కాళేశ్వరం ప్రాజెక్టు తన మానసపుత్రిక అని, తన మేధస్సునంతా రంగరించి కడుతున్నామని, అది ప్రపంచంలో ఒక అద్భుతమని కేసీఆర్‌ ప్రచారం చేసుకున్నారు. సాధారణంగా బడ్జెట్‌ రూపకల్పన సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి జరిగిన ఖర్చులపై ఆర్థిక మంత్రి సమీక్ష నిర్వహించి.. కొత్త బడ్జెట్‌లో కేటాయింపులు ప్రతిపాదిస్తారు. కానీ, బీఆర్‌ఎస్‌ హయాంలో బడ్జెట్‌ రూపకల్పన ఆర్థిక మంత్రితో సంబంధం లేకుండానే జరిగిపోయిందనే ఆరోపణలున్నాయి. ‘‘సంప్రదాయం ప్రకారం బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి సమాధానం చెప్పాల్సి ఉన్నా.. అది కూడా జరగలేదు. బడ్జెట్‌ కూర్పు కూడా ఆర్థిక మంత్రితో సంబంధం లేకుండానే జరిగిపోయిన సందర్భాలున్నాయి. అందువల్ల ప్రాజెక్టు అవినీతితో మా నేతకు సంబంధం లేదు’’ అని ఈటల సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి. ఇదే అంశాన్ని విచారణ కమిషన్‌ ఎదుట ఈటల తన వాదనగా వివరించే అవకాశాలున్నాయని పేర్కొన్నాయి.


Also Read:

సైంటిస్టులు అద్భుత ఆవిష్కరణ.. 'సూపర్-విజన్' లెన్స్‌తో చీకట్లోనూ చూసేయచ్చు..

సన్నగా, బలహీనంగా ఉన్నారా? ఫిట్‌నెస్ మంత్ర ఇదే..

For More Health News and Telugu News..

Updated Date - May 27 , 2025 | 04:32 AM