Erregadda Hospital: డైట్ కాంట్రాక్టర్ తొలగింపు
ABN , Publish Date - Jun 05 , 2025 | 03:35 AM
ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో కలుషితాహార ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. అందుకు బాఽధ్యులైన వారిపై చర్యలు తీసుకుంది.

కేసు నమోదు.. ఆస్పత్రి ఆర్ఎంవోపైనా వేటు
‘ఎర్రగడ్డ’ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్
ఆస్పత్రికి మంత్రి దామోదర.. అధికారులపై ఆగ్రహం
ఘటనపై విచారణ కమిటీని నియమించినట్లు వెల్లడి
92కు చేరిన కలుషితాహార బాధితుల సంఖ్య
హైదరాబాద్/సిటీ, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో కలుషితాహార ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. అందుకు బాఽధ్యులైన వారిపై చర్యలు తీసుకుంది. ఆస్పత్రిలో ఆహారాన్ని సరఫరా చేసే కాంట్రాక్టర్ జి.జైపాల్రెడ్డి డైట్ కాంట్రాక్ట్ను తక్షణమే రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ అనిత తెలిపారు. రోగులకు ఇబ్బంది కలగకుండా డైట్ బాధ్యతలను ఛాతీ ఆస్పత్రి డైట్ కాంట్రాక్టర్కు అప్పగించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆర్ఎంవో పద్మజారెడ్డిని బాధ్యతల నుంచి తప్పించారు. ఆమెను ప్రజారోగ్య సంచాలకుడికి రిపోర్టు చేయాలని వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా ఆదేశించారు. పద్మజ స్థానంలో ఉస్మానియాలో ఇన్చార్జి సివిల్ సర్జన్ ఆర్ఎంవోగా పనిచేస్తున్న బి.శంకర్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో కలుషిత ఆహారం తిని, ఒక రోగి మృతి చెందడంతోపాటు 92 మంది అస్వస్థతకు గురవడంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ఆస్పత్రిని సందర్శించారు. వంట గదిని, వార్డుల్లో బాధిత రోగులను పరిశీలించారు. డీఎంఈ నరేంద్రకుమార్, సూపరింటెండెంట్ అనితను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రజారోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఏ స్థాయి ఉద్యోగులైనా చర్యలు తీసుకుంటామని, ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నామని ప్రకటించారు. ఆస్పత్రి వైద్యాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఘటనపై విచారణకు కమిటీని నియమించామని, నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం సచివాలయంలో మంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
డైట్ కాంట్రాక్టర్పై కేసు నమోదు
ఈ నెల 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎర్రగడ్డ ఆస్పత్రిలో రోగులకు పరమాన్నం చేసి పెట్టారు. అలాగే అన్నం, కూర, గుడ్లు, అరటిపండ్లు ఇచ్చారు. సాయంత్రం డిశ్చార్జి వార్డులో 71 మందికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. ఆ వార్డులో ఉన్న కరణ్ జ్వరం, ఇతర సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయాడు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన సర్కారు డైట్ కాంట్రాక్టర్ జైపాల్రెడ్డిపై చర్యలకు ఆదేశించింది. ఆయనపై బోరబండ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇటీవల సర్కారీ దవాఖానాల్లో రోగులకు ఇస్తున్న ఆహార నాణ్యతను తనిఖీ చేసేందుకు విజిలెన్స్ బృందాలు హైదరాబాద్లో అన్ని ఆస్పత్రులకూ వెళ్లాయి. నగరంలో డైట్ సక్రమంగా ఇవ్వడంతో పాటు నాణ్యమైన ఆహారం అందించే ఆస్పత్రులు రెండే ఉన్నట్లు తెలిపాయి. అందులో ఒకటి ఎర్రగడ్డ ఆస్పత్రి కాగా, మరొకటి ఛాతీ ఆస్పత్రి. కానీ, ఎర్రగడ్డ ఆస్పత్రిలో కలుషితాహార ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఎర్రగడ్డ ఆస్పత్రిలో రోగులు తాగిన నీటి నమూనాలను పరీక్షలకు పంపారు. అస్వస్థతకు కారణమైన ఆహార నమూనాలను కూడా పరీక్షించాలని అనుకున్నా.. అవి లేకపోవడంతో రోగుల మలం సేకరించి టెస్టులు చేశారు. అందులో క్లోస్ట్రిడియంతో పాటు ఈకోలి బ్యాక్టీరియాను గుర్తించినట్లు సమాచారం. ఈ బ్యాక్టీరియా కలుషితాహార కేసుల్లోనే మలంలో కనిపిస్తుంటుందని వైద్యవర్గాలు వెల్లడించాయి. మరింత కచ్చితత్వం కోసం నిమ్స్ ఆస్పత్రిల్లోనూ నమూనాలకు మరోమారు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నాయి. గురువారం వరకు మలపరీక్ష నివేదికలు వచ్చే అవకాశం ఉందని తెలిపాయి.
ఉస్మానియాలో 18 మందికి చికిత్స
కలుషిత ఆహార ఘటనలో బాధితుల సంఖ్య బుధవారం 92కు చేరింది. తీవ్ర అస్వస్థతకు గురైన 18 మందికి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితులకు ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి, చికిత్స అందిస్తున్నట్లు ఉస్మానియా సూపరింటెండెంట్ రాకేశ్ సహాయ్ తెలిపారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. రెండు రోజుల్లో పూర్తిగా కోలుకుంటారన్నారు. మిగతా 74 మందికి ఎర్రగడ్డ ఆస్పత్రిలోనే ఉస్మానియా, గాంధీ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. అందరి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి. కాగా, మరణించిన కరణ్(35)కి గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేశారు. అతని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కలుషిత ఆహార ఘటన తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసింది: పొన్నం
ఎర్రగడ్డ ఆస్పత్రిలో కలుషిత ఆహార ఘటన తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసిందని మంత్రి, హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ ఘటనపై కలెక్టర్ అనుదీప్ పర్యవేక్షణలో విచారణ జరిపించామని, ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కలెక్టర్ చెప్పడంతోనే తేలిన సంఖ్య
హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి చెప్పడంతోనే ఎర్రగడ్డ ఆస్పత్రి ఘటనలో బాధితుల సంఖ్య బయట పడింది. సోమవారం ఆస్పత్రిలో ఓ రోగి మృతి చెందడంతో విషయం బయటకొచ్చింది. ఆస్పత్రిలో మంగళవారం 30-40 మంది మాత్రమే బాధితులు ఉన్నారని, కలుషిత ఆహారం వల్ల ఎవరూ చనిపోలేదని, అనారోగ్య కారణంగానే మృతి చెందాడని అధికారులు వివరించారు. మంగళవారం రాత్రి కలెక్టర్ అనుదీప్ ఆస్పత్రిని పరిశీలించి, బాధితుల సంఖ్య 71 అని చెప్పారు. అంతకుముందు ఆస్పత్రి అధికారులు ఈ ఘటనను చిన్నదిగా భావించి, నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మీడియాకు కూడా వివరాలు వెల్లడించలేదు. మరోవైపు బుధవారానికి బాధితుల సంఖ్య 92కు చేరింది. కాగా, ఎర్రగడ్డ ఆస్పత్రిలో కలుషితాహారం కారణంగా ఓ రోగి చనిపోవడం బాధాకరమని ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. చికిత్స పొందుతున్న రోగులను బుధవారం ఆయన పరామర్శించారు.
ఇవీ చదవండి:
రైల్వే టిక్కెట్ల వెనుక బిగ్ స్కాం.. మోసపోయిన లక్షల మంది..
జూన్ నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి