CM Revanth Reddy: మోదీని ఎన్నిసార్లయినా కలుస్తా
ABN , Publish Date - May 24 , 2025 | 03:41 AM
ఎన్నికల సమయంలోనే రాజకీయాలు మాట్లాడతానని, ఆ తర్వాత అందరినీ కలుపుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే తన పని అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు.

రాష్ట్రాభివృద్ధికి సహకారం తప్పక తీసుకుంటా
ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు
ప్రతిపక్ష పదవి ఫామ్హౌ్సలో పడుకోవడానికి కాదు
అసెంబ్లీకి హాజరై తప్పొప్పులు చెబితే దిద్దుకుంటాం
మహిళలకు ఈ ఏడాది 21 వేల కోట్ల రుణాలు
అదానీ, అంబానీలతో పోటీపడి వ్యాపారం చేయాలి
5612 నిమ్జ్ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్లు
పట్టాలిప్పించే బాధ్యత జగ్గారెడ్డికి అప్పగిస్తున్నా
450 ఎకరాల్లో హ్యుందాయ్ కార్ల కంపెనీ
జహీరాబాద్ బహిరంగ సభలో సీఎం రేవంత్రెడ్డి
సంగారెడ్డి, మే 23 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సమయంలోనే రాజకీయాలు మాట్లాడతానని, ఆ తర్వాత అందరినీ కలుపుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే తన పని అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటానని చెప్పారు. నిధుల కోసం ప్రధాని నరేంద్రమోదీని ఎన్నిసార్లయినా కలుస్తానని, రావాల్సిన నిధులు తెచ్చుకుంటామని స్పష్టం చేశారు. చెరువు మీద అలిగితే ఏమవుతుందో తెలుసునని, గత ముఖ్యమంత్రి చెరువు మీద అలిగి ఫామ్హౌ్సలో పడుకుంటే ఏమైందో అందరూ చూశారని వ్యాఖ్యానించారు. అందుకే సోనియా, రాహుల్, ఖర్గే సూచనలు పాటిస్తూ రాష్ట్ర ఆదాయాన్ని పెంచేలా ప్రయత్నిస్తున్నానన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి, కేంద్రీయ విద్యాలయం, నిమ్జ్ ఫోర్ లేన్ రహదారితోపాటు, బసవేశ్వర విగ్రహాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇండస్ట్రీలు, ఫార్మా, ఐటీ రంగాల్లో ప్రగతి సాధించాల్సి ఉందన్నారు. ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలి అనే సంక్షేమ నినాదంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిననే అహంభావం తనకు ఏమాత్రం లేదని రేవంత్ అన్నారు. ఎప్పటిలాగే పేదోడు, పెద్దోడు అనే తేడా లేకుండా ఎవరినైనా కలుస్తున్నానన్నారు. జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎంపీగా 20 ఏళ్లపాటు రాజకీయంలో ఉన్నా.. గతంలో ఏనాడూ అధికారంలో లేనని, అయినా ప్రజల్లో ఉన్నందునే ఈరోజు ముఖ్యమంత్రిగా అందరి ముందుకు వచ్చానని పేర్కొన్నారు. ప్రతిపక్షంలోనూ, అధికార పక్షంలోనూ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని తెలిపారు.
ప్రతిపక్ష నేత ఫాంహౌ్సకే పరిమితమా..?
ప్రశ్నించే గొంతుకగా ఉండాల్సిన ప్రతిపక్ష నేత ఫాంహౌ్సలో పడుకుంటారా? అధికారం ఉంటేనే అసెంబ్లీలో అడుగుపెడతారా? అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. శాసనసభకు వచ్చి ఆయన అనుభవంతో తమ తప్పొప్పులు చెబితే సరిదిద్దుకుంటామని అన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలోని మహిళా సంఘాలకు రూ.21 వేల కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ నిధులతో అదానీ, అంబానీలతో పోటీపడేలా ఆడబిడ్డలు వ్యాపారం చేయాలని ఆకాంక్షించారు. మెదక్ అంటేనే ఇందిరమ్మ అని, ఆమె మెదక్ ఎంపీగా గెలిచి ప్రధానమంత్రి అయ్యారని రేవంత్ గుర్తు చేశారు. బీడీఎల్, బీహెచ్ఈఎల్, ఇక్రిశాట్ సంస్థలు ఇందిరమ్మ చొరవతోనే ఏర్పాటయ్యాయన్నారు. కాగా, జహీరాబాద్ ప్రాంతంలోని నిమ్జ్ పారిశ్రామిక కారిడార్లో 450 ఎకరాలను హ్యుందాయ్ కార్ల పరిశ్రమకు కేటాయించినట్లు సీఎం వెల్లడించారు. హ్యుందాయ్ పరిశ్రమతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ ప్రాంతంలో చెరుకు పండించే రైతులు ఒక సహకార సంఘంగా ఏర్పాటైతే వారి కోసం 100 ఎకరాలను కేటాయిస్తామని అన్నారు. చక్కెర పరిశ్రమను వారి ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహించుకోవచ్చని సూచించారు. ఇక దేశంలోనే నంబర్వన్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చదిద్దడమే కాకుండా న్యూయార్క్, టోక్యో నగరాలతో పోటీపడే విధంగా హైదరాబాద్ మారుతుందని చెప్పారు. మంజీరా జలాలతో హైదరాబాద్ దాహార్తిని తీరుస్తున్న సింగూరు రిజర్వాయర్ను ఎకో టూరిజంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. వార్డుమెంబరు నుంచి పార్లమెంటు మెంబరు వరకు కాంగ్రెస్ కార్యకర్తలను గెలిపించుకోవడానికి తన శాయశక్తులా కష్టపడతానన్నారు. కాగా, జహీరాబాద్లో బసవేశ్వర విగ్రహాన్ని సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బసవేశ్వరుడు గొప్ప నాయకుడని, సమాజంలో అణచివేతకు గురైన బలహీనవర్గాల తరఫున నిలబడ్డాడని కొనియాడారు. ఆ రోజుల్లో అనుభవ మంటపాలను ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు పరిష్కరించేవారని తెలిపారు. ఆ అనుభవ మంటపాల ఆధారంగానే నేడు అసెంబ్లీ పార్లమెంటులో సమస్యల పరిష్కారం కోసం మాట్లాడుతున్నామని చెప్పారు.
విద్యార్థులతో ముఖ్యమంత్రి మాటామంతీ
ఝరాసంగం: దేశ, రాష్ట్ర భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని సీఎం రేవంత్ అన్నారు. చదువుల్లో రాణించాలని. తల్లింద్రడులు గర్వపడేలా సమాజంలో మంచి పేరు తేవాలని సూచించారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధి మాచనూరు సమీపంలో రూ.26 కోట్లతో నిర్మించిన కేంద్రీయ విద్యాలయం భవనాన్ని శుక్రవారం సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులను సీఎం ఆత్మీయంగా పలకరించారు. ‘‘ఏ తరగతి చదువుతున్నారు? ఇక్కడ చదువు బాగా చెబుతున్నారా?’’ అని ప్రశ్నించారు.బాగా చదువుకోవాలని సూచించారు.
నిమ్జ్ నిర్వాసితుల బాధ్యత జగ్గారెడ్డికి: సీఎం రేవంత్
జహీరాబాద్ ప్రాంతాన్ని పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేయడానికి గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే నిమ్జ్కు శ్రీకారం చుట్టారని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఇప్పటికే జరిగిన భూసేకరణలో నిర్వాసితులైన వారికి నష్టపరిహారం చెల్లించారని, పెండింగ్లో ఉన్న పరిహారం చెల్లింపు కూడా పూర్తవుతుందని అన్నారు. నిర్వాసితులైన 5,612 కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ బాధ్యతను సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి అప్పగిస్తున్నట్లు తెలిపారు. నిర్వాసితులకు మంచి భోజనం పెట్టించి వారికి ప్రభుత్వపరంగా పట్టాలు ఇప్పించే బాధ్యతను జగ్గారెడ్డి తీసుకోవాలని సూచించారు.
ఇవి కూడా చదవండి
Genelia D Souza: డ్రైవర్ తొందరపాటు.. జెనీలియాకు తప్పిన పెను ప్రమాదం
Viral Video: ఇండియన్ ఆక్వామ్యాన్.. ఉప్పొంగుతున్న మ్యాన్ హోల్లోంచి..