Share News

Cadaver Crisis: మృతదేహాలు కొంటాం

ABN , Publish Date - May 14 , 2025 | 02:02 AM

ప్రైవేట్ మెడికల్‌ కాలేజీల్లో మృతదేహాల కొరత తీవ్రంగా ఉంది. నిరుపేదల మృతదేహాలను లక్ష రూపాయలకూ కొనుగోలు చేస్తూ దందా జరుగుతోంది.

Cadaver Crisis: మృతదేహాలు కొంటాం

  • ప్రైవేటు వైద్య కళాశాలల్లో ‘అనాటమీ’కి శవాల కొరత

  • ఒక్కో మృతదేహానికి లక్ష ఇచ్చేందుకూ కాలేజీలు సిద్ధం

  • నిరుపేద కుటుంబాలే టార్గెట్‌.. దళారుల ద్వారా దందా

  • కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి కొనుగోలు

హైదరాబాద్‌, మే 13 (ఆంధ్రజ్యోతి): ప్రైవేటు వైద్య కళాశాలల్లో మృతదేహాలకు కొరత నెలకొంది. వైద్య విద్యలో భాగంగా శరీర నిర్మాణం, అవయవాల పనితీరుపై విద్యార్థులకు అభ్యసనం (అనాటమీ) కోసం మృతదేహాలు దొరకడం లేదు. ఫలితంగా ఆ కాలేజీలు అడ్డదారులు తొక్కుతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో.. అలాగే రాష్ట్రంలోని సరిహద్దు గ్రామాల్లో నిరుపేదల కుటుంబాలనే లక్ష్యంగా చేసుకొని శవాల కొనుగోలు దందాకు తెరలేపినట్లుగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. భారీగా డబ్బిచ్చి.. మృతదేహాలు కొంటున్నాయని, ఒక్కోసారి మృతదేహానికి రూ.లక్ష దాకా ఇచ్చేందుకు సిద్ధపడుతున్నాయని ఆరోపణలున్నాయి. ఇందుకు సదరు కాలేజీలు దళారులను రంగంలోకి దింపుతున్నాయని చెబుతున్నారు. మృతదేహాన్ని ఖననం చేసే బదులు పరిశోధనల కోసం వైద్య కళాశాలలకు ఇస్తే ఉపయోగం ఉంటుందని.. అంత్యక్రియల ఖర్చు తప్పడమే కాకుండా, ఉల్టా చేతికి డబ్బులొస్తాయని దళారులు నచ్చజెబుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ వైద్య కళాశాలలకైతే రెండు రకాలుగా డెడ్‌బాడీలు వస్తాయి. అనాథల మృతదేహాలు, రోడ్డు ప్రమాదాల్లో గుర్తుపట్టలేని విధంగా మారిపోయి.. కుటుంబసభ్యులూ వాకబు చేయకపోతే ఆ మృతదేహాలు వస్తాయి. కొందరు తాము చనిపోయాక మృతదేహాలను వైద్య కళాశాలలకు ఇవ్వాలని వీలునామా రాస్తే అవీ వస్తాయి. ఈ రెండోరకం మృతదేహాలు కొన్ని పేరొందిన ప్రైవేటు కాలేజీలకూ వస్తాయి కాబట్టి వాటికి కొరత ఉండదు. అయితే కొత్తగా ప్రైవేటు కాలేజీలు బాగా పెరగడంతో వాటికి మృతదేహాల కొరత నెలకొంది. ఇలాంటి కాలేజీలు తమకు మృతదేహాలు కావాలని ఏకంగా వైద్యవిద్య సంచాలకుడికే లేఖలు రాస్తున్నాయి. నిరుడు హైదరాబాద్‌-విజయవాడ రహదారికి సమీపంలో నగరానికి దగ్గరగా ఉండే ఓ కొత్త మెడికల్‌ కాలేజీ తమకు 15 డెడ్‌బాడీలు కావాలని ప్రభుత్వానికి లేఖ రాసింది. సర్కారు దాన్ని తిరస్కరించింది.


ఇలాంటి మెడికల్‌ కాలేజీలు దొడ్డి దారిన డెడ్‌బాడీలు కొనుక్కుంటున్నట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి. కాగా, జాతీయ వైద్య కమిషన్‌ నిబంధనల మేరకు ప్రతి వైద్య కళాశాలో ఉండే ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య ఆధారంగా అనాటమీ విభాగానికి మృతదేహాలు కావాల్సివుంటుంది.ప్రతి 25 సీట్లకు ఒక మృతదేహం అవసరం. అంటే 250 సీట్లుండే ఒక మెడికల్‌ కాలేజీకి ఏడాదికి సగటున 10 శవాలు కావాలి. వైద్యవిద్యార్థులు ఎంబీబీఎ్‌సలో చేరిన మొదటి సంవత్సరంలోనే అనాటమీ ఒక సబ్జెక్టుగా ఉంటుంది. వైద్య విద్య బోధనలో భాగంగా మృతదేహాలను కోసి.. శరీర నిర్మాణం గురించి విద్యార్థులకు చెబుతారు. అనంతరం ఆ కోసిన శవాలను ప్రత్యేక రసాయనాలతో నింపిన ఫార్ములిన్‌ ట్యాంకులలో భద్రపరుస్తారు. అలా ఒక శవాన్ని ఒక్కో భాగాన్ని కోసి విద్యార్థులకు శరీర నిర్మాణం గురించి వివరిస్తారు. దాంతో మెడికోలకు మానవ శరీరంపై అనుభవపూర్వకమైన జ్ఞానం వస్తుంది.

శవాలు లేకుండానే పాఠాలు

సాధారణంగా మెడికల్‌ కాలేజీలకు డోనేషన్‌ ద్వారా వచ్చిన శవాలనే తీసుకొని, వాటిని డిసెక్షన్‌ చేయాలి. అన్‌ క్లెయిమ్డ్‌ బాడీస్‌ను వైద్య పరిశోధనల కోసం వినియోగించకూడదన్న నైతిక నియమం ఉంది. ఈ కారణంతో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే అన్‌క్లెయిమ్డ్‌ బాడీ్‌సను వినియోగించుకునే పరిస్థితి లేకపోవడం, కొత్త మెడికల్‌ కాలేజీ సంఖ్య పెరగడంతో గత బీఆర్‌ఎస్‌ సర్కారు ఒక ఉత్తర్వ్యు తీసుకొచ్చింది అన్‌క్లెయిమ్డ్‌ బాడీస్‌ గురించి నిర్ణీత సమయంలో ఎవ్వరూ రాకుంటే వాటిని మెడికల్‌ కాలేజీల కోసం వినియోగించుకోవచ్చన్నది ఆ జీవో సారాంశం. దాంతో ప్రభుత్వ వైద్య కళాశాలలకు ప్రస్తుతం డెడ్‌ బాడీస్‌ కొరత పెద్దగా లేదనే చెప్పాలి. ఇటీవల కాలంలో మృతదేహాల దానం చేసే వారి సంఖ్య కూడా పెరిగింది. ఇక ప్రైవేటు వైద్య కళాశాలల అనుబంధ ఆస్పత్రులకు ప్రమాదవశాత్తు అక్కడ చేరి మరణించే కేసులు తక్కువగా ఉంటున్నాయి. ఒకవేళ వచ్చినా.. వాటిని పోస్టుమార్టం నిమిత్తం మళ్లీ ప్రభుత్వ ఆస్పత్రులకే పంపుతారు.


ఇలా ప్రైవేటులో శవాలు అందుబాటులో లేక వైద్యవిద్యార్ధులు మానవ శరీర నిర్మాణం గురించి నేర్చుకోలేకపోతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని మార్చురీల్లో ఉండే అన్‌క్లెయిమ్డ్‌ బాడీస్‌ను ఒక్కొ దానికి రూ.60 వేల చొప్పున చెల్లిస్తే వైద్య పరిశోధనల నిమిత్తం ప్రైవేటు వైద్య కళాశాలలకు అమ్ముకోవచ్చన్న జీవో ఒకటి ఉంది. ఆ జీవో ఆధారంగా ఇటీవల కొన్ని ప్రైవేటు వైద్య కళాశాలలు శవాలు కావాలని వైద్యవిద్య సంచాలకులకు దరఖాస్తు చేసుకున్నాయి.

రబ్బరు బొమ్మలతో...

కొన్ని మెడికల్‌ కాలేజీలు ఇతర దేశాల్లో మాదిరిగా రబ్బరు బొమ్మలను తీసుకువచ్చి విద్యార్థులకు అనాటమీ పాఠాలు బోధిస్తున్నాయి. శరీర నిర్మాణం గురించి తెలిస్తేనే మానవ దేహం, రోగాలపై అవగాహన ఉంటుందని, రబ్బరు బొమ్మలపై అంత లోతైన అవగాహన రాదని నిపుణులు చెబుతున్నారు.

Updated Date - May 14 , 2025 | 05:59 AM