Congress TPCC: బదులు చెప్పలేకే ఈటలపై ఎదురుదాడి
ABN , First Publish Date - 2025-05-14T04:28:08+05:30 IST
ఈటల రాజేందర్ పేదల ఇళ్ల కూల్చివేతపై కాంగ్రెస్ నేతలకు ప్రశ్నలు వేయగా, బీజేపీ ఎమ్మెల్యేలు ఆయనపై చేసిన ప్రతిస్పందనకు తీవ్ర విమర్శలు చేసినట్లు తెలుస్తుంది. టీపీసీసీ అధికార ప్రతినిధి ఈటలను "నకిలీ బీసీ" అని ఆరోపించారు.

కాంగ్రెస్ నేతలపై బీజేపీ ఎమ్మెల్యేల ఫైర్
హైదరాబాద్, మే 13 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి పేరిట గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పేదల ఇళ్లను కూల్చివేస్తున్న అంశంపై ఎంపీ ఈటల రాజేందర్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ నేతలు ఎదురుదాడి చేయడంపై బీజేపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి చేతకానీతనానికి ఇదే నిదర్శనమని విమర్శించారు. ఈ మేరకు బీజేపీ ఎమ్మెల్యేలు ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, రామారావు పవర్, పైడి రాకేష్ రెడ్డి, పాల్వాయి హరీష్ బాబు ఓ ప్రకటన విడుదల చేశారు. ఎంపీ ఈటల రాజేందర్ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో ఎదురుదాడి చేయించడం సరికాదన్నారు. పేదలకు ఎలాంటి పునరావాసం కల్పించకుండా వారి నివాసాలను హైడ్రా కూల్చివేస్తుందని ఈ అంశంపై సీఎం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.
ఈటల.. నకిలీ బీసీ: టీపీసీసీ
ఈటల రాజేందర్ నకిలీ బీసీ అని, ఓట్ల కోసమే ఆయన బీసీ కార్డు వాడుతున్నాడని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్గౌడ్ ఆరోపించారు. బీజేపీలో అధ్యక్ష పదవి రాలేదన్న మానసిక క్షోభలో ఉన్న ఈటల.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై నోరు జారుతున్నారని విమర్శించారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్ల కోసం హైడ్రాను విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు.