Jagga Reddy: అవును.. అంబేడ్కర్ భగవంతుడే!
ABN , Publish Date - Apr 19 , 2025 | 05:22 AM
అంబేడ్కర్ ఏమైనా భగవంతుడా అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయన్ను కించపరిచాడు. అవును అంబేడ్కర్ ముమ్మాటికీ భగవంతుడే.

రాముడు, అల్లా, యేసు తర్వాత ఈ దేశ ప్రజలకు అంబేడ్కర్, మహాత్మాగాంధీ, నెహ్రూ దేవుళ్లే
అంబేడ్కర్ వల్లే ప్రధానిగా మోదీ, హోంమంత్రిగా షా ఉన్నారు
రాహుల్ రాజ్యాంగాన్ని ఆరాధిస్తే.. మోదీ, షా అవమానిస్తున్నారు
త్వరలోనే సంగారెడ్డికి సీఎం రేవంత్రెడ్డిని ఆహ్వానిస్తా
జైబాపు, జైభీమ్, జైసంవిధాన్ ర్యాలీలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
సంగారెడ్డి ప్రతినిధి, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): ‘‘అంబేడ్కర్ ఏమైనా భగవంతుడా అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయన్ను కించపరిచాడు. అవును అంబేడ్కర్ ముమ్మాటికీ భగవంతుడే. శ్రీరాముడు, అల్లా, యేసు తర్వాత ఈ దేశ ప్రజలకు అంబేడ్కర్, మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ దేవుళ్లే’’ అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డిలో శుక్రవారం ఆయన జైబాపు, జైభీమ్, జైసంవిధాన్ పేరిట భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జగ్గారెడ్డి మాట్లాడుతూ.. రాజ్యాంగంలో అంబేడ్కర్ కల్పించిన ఓటు హక్కుతోనే ఇప్పుడు ప్రధానిగా మోదీ, హోంమంత్రిగా అమిత్ షా పని చేస్తున్నారని చెప్పారు.
వీరిద్దరూ రాజ్యాంగాన్ని అవమానిస్తుండగా.. రాహుల్గాంధీ రాజ్యాంగాన్ని ఆరాధిస్తున్నారని గుర్తుచేశారు. అంబేడ్కర్పై చేసిన వ్యాఖ్యలకు అమిత్ షా, బీజేపీ నేతలు బేషరతుగా క్షమాపణలు చెప్పేదాకా కాంగ్రెస్ పోరాటం ఆగదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని త్వరలోనే సంగారెడ్డికి ఆహ్వానిస్తానని జగ్గారెడ్డి చెప్పారు. సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల అవసరాలు నెరవేరేలా సమావేశం ఏర్పాటు ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. జైబాపు, జైభీమ్, జైసంవిధాన్ ర్యాలీలో టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, పెద్దసంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.