Share News

Kavitha Comments: అన్నింటినీ భరించుకుంటూ వచ్చా.. సిన్సియర్‌గా పనిచేశా.. అయినప్పటికీ

ABN , Publish Date - May 30 , 2025 | 01:47 PM

Kavitha Comments: పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడ్డానని ఎమ్మెల్సీ కవిత అన్నారు. పదేళ్లుగా ఎంతో ఆవేదనను అనుభవించానని.. అన్నింటినీ భరించుకుంటూ వచ్చానని చెప్పారు. పార్టీలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు.

Kavitha Comments: అన్నింటినీ భరించుకుంటూ వచ్చా.. సిన్సియర్‌గా పనిచేశా.. అయినప్పటికీ
Kavitha Comments

మంచిర్యాల, మే 30: జిల్లాలో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) పర్యటన కొనసాగుతోంది. భారీ కాన్వాయ్‌తో శ్రీరాంపూర్ చేరుకున్న కవితకు జాగృతి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కవిత పర్యటనకు బీఆర్‌ఎస్ నేతలు దూరంగా ఉన్నారు. ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లాలోకు వచ్చిన ఎమ్మెల్సీ.. పలువురు జాగృతి నాయకులను పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియా నిర్వహించిన చిట్‌చాట్‌లో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు కవిత. తాను రాసిన లేఖకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆవేదన చెందే లేఖ రాశానని.. పార్టీ బాగు కోసమే లెటర్ రాసినట్లు తెలిపారు.


సామాన్య కార్యకర్తలు ఏమి కోరుకుంటున్నారో అదే విషయాన్ని లేఖ ద్వారా పార్టీ చీఫ్ కేసీఆర్‌కు (BRS Chief KCR) వివరించానని తెలిపారు. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడ్డానని అన్నారు. పదేళ్లుగా ఎంతో ఆవేదనను అనుభవించానని.. అన్నింటినీ భరించుకుంటూ వచ్చానని చెప్పారు. పార్టీలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ బలోపేతం కోసం ఎంతగానో కృషి చేశానన్నారు. ఉద్యమం నుంచి మొదలు బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక కూడా పార్టీ కోసం సిన్సియర్‌గా పనిచేశానని.. అయినప్పటికీ కొన్ని అంశాలు తనను బాధించాయన్నారు. అంతేకాకుండా.. తనను జైలు పాలు చేసిన బీజేపీలో బీఆర్‌ఎస్‌ను విలీనం చేయాలని చూశారని, బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని అనుకున్నారని చెప్పారు. తాను జైల్లో ఉంటే బీజేపీతో పొత్తు ప్రస్తావన తేవడంతో ఆవేదన చెందానని ఎమ్మెల్సీ అన్నారు.


బీజేపీతో కలవడం అనవసరమని.. ఆ పార్టీతో కలిసిన ఏ పార్టీ కూడా బతికి బట్ట కట్టలేదని వ్యాఖ్యలు చేశారు. అందుకోసమే విలీనం వద్దంటూ పార్టీకి లేఖ ద్వారా స్పష్టం చేశానని చెప్పుకొచ్చారు. అధినేతను కలవాలని, చెప్పాలని ప్రయత్నం చేశానని.. తన తండ్రిని కలిసేందుకు అవకాశం వచ్చినా.. లెటర్ లీక్‌తో తాను కలవలేకపోయినట్లు చెప్పారు. గతంలో కూడా లేఖలు రాశానని.. కానీ ఈసారి తనను టార్గెట్ చేస్తూ ఒక పథకం ప్రకారమే లేఖను లీక్ చేశారని మరోసారి చెప్పారు. లెటర్ లీక్ చేసిన వారెవరో తేల్చాలని అన్నారు. తనకంటూ సొంత అజెండా ఏమీ లేదన్నారు. బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేయడానికి ఒప్పుకోనని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. కాగా.. గత రెండు రోజులుగా కవిత పరిణామాలు, ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోసారి కవిత తన మనసులో మాటను చిట్‌చాట్‌ ద్వారా బయటపెట్టారు. దీంతో కవిత ఎపిసోడ్ బీఆర్‌ఎస్‌లో తీవ్ర సంచలనంగా మారింది.


ఇవి కూడా చదవండి

కరీంనగర్‌ నుంచి కుట్రలు.. రాజాసింగ్ సంచలన ఆరోపణలు

ఈ ఔషధాలను పరిమితికి మించి వాడుతున్నారా.. కిడ్నీలు రిస్క్‌లో పడ్డట్టే

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 30 , 2025 | 02:38 PM