Shreyas Iyer: ఆసుపత్రి నుంచి శ్రేయస్ డిశ్చార్జ్
ABN , Publish Date - Nov 01 , 2025 | 01:52 PM
టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది. శ్రేయస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆసీస్తో సిడ్నీ వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. క్యాచ్ పట్టే క్రమంలో పక్కటెముకలు నేలను బలంగా తాకడంతో అతడి ప్లీహానికి(Spleen Injury) గాయమైంది. అంతర్గత రక్తస్రావం కావడంతో సిడ్నీలోనే ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే తాజాగా అయ్యర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ(BCCI) అధికారికంగా వెల్లడించింది. శ్రేయస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపింది.
ఈ సందర్భంగా బీసీసీఐ సిడ్నీ డాక్టర్లకు ధన్యవాదాలు తెలిపింది. డాక్టర్ కొరొష్ హగిగి, అతడి వైద్య బృందంతో పాటు భారత్కు చెందిన డాక్టర్ దిన్షా పార్దీవాలాకు ధన్యవాదాలు తెలిపింది. శ్రేయస్ అయ్యర్ త్వరగా కోలుకునేలా మెరుగైన చికిత్స అందించినందుకు కృతజ్ఞతలు చెప్పింది.
మరికొద్ది రోజులు సిడ్నీలోనే..
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినా మరికొన్నాళ్లు అయ్యర్ సిడ్నీలోనే ఉండనున్నట్లు బీసీసీఐ తెలిపింది. చికిత్స అనంతర వైద్య పరీక్షల కోసం అతడిని సిడ్నీలోనే ఉంచాలని వైద్యులు సూచించినట్లు వెల్లడించింది. విమాన ప్రయాణాలు చేయొచ్చని వైద్యులు చెప్పిన తర్వాతే స్వదేశానికి తిరిగి వస్తాడని తెలిపింది.
స్పందించిన అయ్యర్..
ఇప్పటికే తన గాయంపై శ్రేయస్ అయ్యర్ స్పందించిన విషయం తెలిసిందే. ‘ప్రస్తుతం కోలుకునే ప్రక్రియలో ఉన్నా. రోజు రోజుకూ మెరుగవుతున్నా. ఇలాంటి క్లిష్ట సమయంలో అండగా నిలిచినందుకు అందరికీ కృతజ్ఞతలు. త్వరలోనే ఆరోగ్యంగా తిరిగొస్తా’ అని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు. గాయం పెద్దదే అయినా త్వరగా చికిత్స చేయడం వల్ల పెద్ద ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. అయ్యర్ ఫిట్గా ఉంటాడు కాబట్టి ఇంకా త్వరగానే కోలుకుంటాడని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
IND vs AUS: రెండో టీ-20.. గెలుపు ఆసీస్దే..
Sunil Gavaskar: అదే జరిగితే జెమీమాతో కలిసి పాడతా: గావస్కర్