Ind V SA: టీమిండియా ఆలౌట్
ABN , Publish Date - Nov 24 , 2025 | 03:33 PM
గువాహటి వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 201 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా 489 పరుగులు చేసిన విషయం తెలిసిందే. దీంతో భారత్ 288 పరుగుల వెనుకంజలో ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: గువాహటి(Guwahati Test) వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా బ్యాటర్లు తడబడ్డారు. ఓవర్ నైట్ 9/0 స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 201 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా 489 పరుగుల భారీ స్కోరు చేసిన విషయం తెలిసిందే. దీంతో టీమిండియాపై ప్రొటీస్ జట్టు 288 పరుగుల ఆధిక్యంలో ఉంది.
మొదట్లో చక్కగా ఆడుతున్నట్లే కనిపించిన టీమిండియా, టీ బ్రేక్కు ముందు చకచకా వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తరువాత కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పూ రాలేదు. ఒకనానొక దశలో 122 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో వాషింగ్టన్ సుందర్(48), కుల్దీప్ యాదవ్(19) 72 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత బ్యాటర్లలో ఓపెనర్ యశస్వి జైస్వాల్(58) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు. ఈ సిరీస్లో టీమిండియా తరఫున హాఫ్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్ కూడా అతడే కావడం గమనార్హం.
కేఎల్ రాహుల్ (22) కుదురుకుంటున్న సమయంలో ఔట్గా వెనుదిరిగాడు. ధ్రువ్జురేల్ డకౌట్తో మరోసారి నిరాశ పరిచాడు. కెప్టెన్ రిషభ్ పంత్ (7), సాయి సుదర్శన్ (15), నితీశ్కుమార్ రెడ్డి (10), రవీంద్ర జడేజా (6) తీవ్రంగా నిరాశ పరిచారు. పంత్ క్రీజులోకి వచ్చీ రాగానే సిక్స్తో ఖాతా తెరిచాడు. కానీ ఓవైపు వికెట్లు పడుతున్నా.. క్రీజులో కుదురుకునే ప్రయత్నం చేయలేదు. అనవసరపు షాట్కు యత్నించి పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత వచ్చిన మిగతా బ్యాటర్లు కూడా పంత్ బాటలోనే నడిచారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సెన్ 6, సైమన్ హర్మర్ 3, కేశవ్ మహారాజ్ 1 వికెట్ తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి:
ఆ స్థానంలో ఆడించాలి: ఇర్ఫాన్ పఠాన్