IND vs PAK: నాడు పంతం నెగ్గించుకుంది.. నేడు పాక్పై భారత్ ఏం చేయబోతుంది
ABN , Publish Date - Feb 22 , 2025 | 04:10 PM
పాకిస్తాన్ గడ్డపై ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోమని టీమిండియా పంతం నెగ్గించుకుంది. దీంతో అన్ని మ్యాచ్లు పాకిస్తాన్ వేదికగా జరుగుతున్నా.. భారత్ తలపడే మ్యాచ్లు మాత్రం తటస్థ వేదికలపై జరుగుతున్నాయి. పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టబోమని శపథం చేసి పంతం నెగ్గించుకున్న భారత క్రికెట్ జట్టు ఆదివారం జరగబోయే మ్యాచ్లో ఏం చేయబోతుంది.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మొదలైంది.. ఇప్పటికే నాలుగు మ్యాచ్లు పూర్తయ్యాయి. ఐదో మ్యాచ్ ఫిబ్రవరి 23 ఆదివారం దుబాయి వేదికగా జరగబోతుంది. ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచ్లు ఒక ఎత్తైతే ఆదివారం జరగబోయే మ్యాచ్ మరో ఎత్తు. ఈ మ్యాచ్ కోసం క్రీడాభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటేనే ఓ భీకర పోరు. మ్యాచ్ జరుగుతున్నంతసేపు యుద్ధ వాతావరణమే. పక్క దేశంతో మన దేశం యుద్ధం చేస్తోంది.. విజయం ఎవరిదో అంటూ రెండు దేశాల ప్రజలు ఎదురుచూసే అసలు సిసలైన మ్యాచ్. ఈ మ్యాచ్ కోసం భారత్, పాకిస్తాన్ క్రికెట్ అభిమానులే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ను ఎంతో ఇంట్రెస్టింగ్గా చూస్తారు. పాకిస్తాన్ గడ్డపై మ్యాచ్లు ఆడేది లేదని, తటస్థ వేదికలపై ఆడేందుకు సిద్ధమని ప్రకటించి.. తన పంతాన్ని నెగ్గించుకున్న భారత్.. ఆదివారం నాటి మ్యాచ్లో పాక్ను చిత్తు చేయబోతుందా.. లేదంటే పాక్ భారత్పై పైచేయి సాధించబోతుందా అనే ఆసక్తి నెలకొంది.
ఫేవరెట్ ఎవరంటే..
సాధారణంగా ప్రస్తుత పరిస్థితుల్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఫేవరెట్ భారత్ మాత్రమే. ఇటీవల కాలంలో భారత్ సాధిస్తున్న విజయాలు, ఆటగాళ్ల ఫామ్ను దృష్టిలో పెట్టుకుంటే భారత్ గెలుస్తుందనే నమ్మకం భారత క్రికెట్ అభిమానుల్లో ఉండొచ్చు. కానీ పాకిస్తాన్ను తీసిపారేయలేం. క్రికెట్ అంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేం. మొదటి పది ఓవర్లలో ఓవర్కు పది పరుగులు చొప్పున వంద పరుగులు చేసినంత మాత్రన.. ఆ జట్టు 50 ఓవర్ల మ్యాచ్లో 400కు పైగా పరుగులు చేస్తుందని అంచనా వేయలేం. అలా అని పది ఓవర్లలో అతి తక్కువ పరుగులు చేసి రెండు లేదా మూడు వికెట్లు కోల్పోయిన జట్టు అతి తక్కువ స్కోరుకే పరిమితమవుతుందని చెప్పలేం. అందుకే క్రికెట్లో ఏ జట్టు విజయం సాధిస్తుందో మ్యాచ్ పూర్తయ్యేవరకు చెప్పలేము. రేపటి భారత్-పాకిస్తాన్ మ్యాచ్లో టీమిండియా గెలుస్తుందనే అంచనా వేస్తున్నప్పటికీ పాకిస్తాన్ భారత్ను ఓడించేందుకు ఎలాంటి ప్రణాళికలతో బరిలోకి దిగుతుందనేది ఆసక్తి రేపుతోంది.
పంతం నెగ్గించుకుని..
ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్లో నిర్వహిస్తుండటంతో.. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, భద్రత పరిస్థితుల మధ్య పాక్లో తాము ఆడేది లేదని బీసీసీఐ స్పష్టంచేసింది. అవసరమైతే ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనబోమని బీసీసీఐ స్పష్టమైన వైఖరిని వ్యక్తంచేసింది. దీంతో ఐసీసీ పాకిస్తాన్ బోర్డును భారత్ మ్యాచ్లు తటస్థ వేదికలపై నిర్వహిద్దామని ఐసీసీ ప్రతిపాదించింది. తొలుత అంగీకరించని పాకిస్తాన్.. ఆ తర్వాత ఐసీసీ ప్రతిపాదనకు ఓకే చెప్పింది. దీంతో పాకిస్తాన్లో మ్యాచ్లు ఆడేదిలేదంటూ తమ పంతాన్ని నెగ్గించుకున్న టీమిండియా రియల్ మ్యాచ్లో ఎలా సత్తా చాటబోతుందనేదానిపై క్రికెట్ అభిమానుల దృష్టి నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Srisailam Tunnel: ఒక్కసారిగా కూలిన పైకప్పు.. శ్రీశైలం టన్నెల్లో ప్రమాదం
AP Capital: అమరావతి పనుల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here