Yash Dayal: కోహ్లీ ఫ్రెండ్పై ఎఫ్ఐఆర్ నమోదు.. శిక్ష తప్పదా?
ABN , Publish Date - Jul 08 , 2025 | 08:39 AM
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దోస్తు, టీమ్మేట్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. లైంగిక వేధింపుల కేసులో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..

ఐపీఎల్ సెన్సేషన్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ పేసర్ యష్ దయాల్ చిక్కుల్లో పడ్డాడు. అతడిపై ఉత్తర్ప్రదేశ్లోని ఇందిరాపురం పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. తన మీద దయాల్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఘజియాబాద్కు చెందిన ఓ యువతి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి గ్రీవెన్స్ పోర్టల్లో అతడిపై ఫిర్యాదు చేసిందా యువతి. దీంతో భారత న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 69 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. వివాహం, ఉద్యోగం లాంటి తప్పుడు వాగ్దానాలతో మోసం చేసిన ఘటనల్లో ఈ సెక్షన్లను ఉపయోగిస్తారు. ఒకవేళ దయాల్ గనుక నేరం చేసినట్లు రుజువైతే మాత్రం అతడికి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. అలాగే జరిమానా కూడా కట్టాల్సి ఉంటుంది.
6 ఏళ్లుగా..
ఈ కేసులో బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసిన పోలీసులు.. ఇంకా యష్ దయాల్ను విచారించలేదు. త్వరలో అతడ్ని అరెస్ట్ చేస్తారని తెలుస్తోంది. ఆ తర్వాత బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారని సమాచారం. కాగా, 2019లో దయాల్తో తనకు పరిచయం ఏర్పడిందని, సోషల్ మీడియా ద్వారా అతడ్ని కలిశానని ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలు. అప్పటినుంచి తామిద్దరమూ సన్నిహితంగా ఉంటున్నామని, మ్యారేజ్ చేసుకుంటానని హామీ ఇచ్చాడని కంప్లయింట్లో రాసుకొచ్చింది బాధితురాలు. బెంగళూరు, ఢిల్లీ, ప్రయాగ్రాజ్ సహా కొన్ని ప్రాంతాలకు తీసుకెళ్లి తనతో శారీరక సంబంధాన్ని కొనసాగించాడని ఆమె ఆరోపించింది.
పెళ్లి పేరుతో..
దయాల్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు అందుకు నిరాకరించాడని.. సోషల్ మీడియాలో బ్లాక్ చేశాడని బాధితురాలు తెలిపింది. శారీరకంగానూ తన మీద దాడి చేశారని వాపోయింది. గత కొన్నేళ్లలో దయాల్తో దిగిన ఫొటోలు, చాట్లు, వీడియో కాల్ రికార్డులు లాంటి కీలక ఆధారాలను పోలీసులకు సమర్పించానని ఆమె వెల్లడించింది. తనతోనే కాదు.. పలువురు ఇతర మహిళలతోనూ దయాల్ సంబంధం పెట్టుకున్నాడని బాధితురాలు ఆరోపించింది.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి