Virat Kohli: కోహ్లీ మళ్లీ కనపడడు.. రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు!
ABN , Publish Date - May 20 , 2025 | 04:12 PM
భారత టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్టులకు గుడ్బై చెప్పడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయం సరైనదేనని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం అతడు ఇంకొన్నేళ్లు సుదీర్ఘ ఫార్మాట్లో కొనసాగాలని సూచిస్తున్నారు. ఈ తరుణంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతడు ఏమన్నాడంటే..

ఎంతటి గొప్ప క్రికెటర్ అయినా ఎప్పుడో ఒకప్పుడు రిటైర్ అవ్వాల్సిందే. అయితే తమ అభిమాన ఆటగాడు ఇక బరిలోకి దిగడు అనే విషయాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేరు. మరీ ముఖ్యంగా ఇంకొన్నాళ్లు ఆడే సత్తా ఉన్నా, ఫామ్-ఫిట్నెస్ పరంగా ఢోకా లేకున్నా ప్లేయర్లు అర్ధంతరంగా నిష్క్రమిస్తే అభిమానులు అస్సలు ఒప్పుకోరు. టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విషయంలో అదే జరుగుతోంది. టెస్టుల నుంచి అతడు ఉన్న పళంగా రిటైర్ అవడాన్ని ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు కూడా విరాట్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. రిటైర్మెంట్ మీద వెనక్కి తగ్గాలని కోరుతున్నారు. ఈ విషయంపై భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. ఆ రోజు నుంచి కోహ్లీ ఎవరికీ కనపించడంటూ బాంబు పేల్చాడు. అతడు ఇంకా ఏమన్నాడంటే..
నో కోచింగ్.. నో కామెంట్రీ!
టీమిండియాకు సేవలు అందించేందుకు కోహ్లీ ఎప్పుడూ అందుబాటులో ఉంటాడని రవిశాస్త్రి తెలిపాడు. టీ20లు, టెస్టులకు గుడ్బై చెప్పినా.. వన్డేల్లో అతడు ఆడతాడని చెప్పుకొచ్చాడు. క్రికెట్ నుంచి పూర్తిగా రిటైర్ అయ్యేంత వరకు అతడు భారత జట్టుకు అందుబాటులో ఉంటాడని రవిశాస్త్రి పేర్కొన్నాడు. అయితే ఒక్కసారి ఆట నుంచి రిటైర్ అయితే మాత్రం పూర్తిగా దూరమవుతాడని.. ఎవరికీ కనిపించడన్నాడు. కోచ్ లేదా కామెంటేటర్గా పని చేసే వ్యక్తిత్వం అతడిది కాదన్నాడు. రిటైర్ అయ్యానంటే ఆటకు పూర్తిగా దూరంగా ఉంటానని, కొన్నాళ్ల పాటు ఎవరికీ కనిపించనంటూ గతంలో కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు రవిశాస్త్రి కూడా అలాంటి కామెంట్స్ చేశాడు. దీంతో వన్డే రిటైర్మెంట్ తర్వాత విరాట్ ఎవరికీ కనిపించకుండా పోతాడేమోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఏదో ఒక విధంగా క్రికెట్తో అతడు సంబంధాలు కొనసాగించాలని, కోహ్లీని స్టేడియంలో చూడకుండా ఉండలేమని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇవీ చదవండి:
దిగ్వేష్తో గొడవపై అభిషేక్ రియాక్షన్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి