Virat Kohli: ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతా.. కోహ్లీ ఇలా అనేశాడేంటి?
ABN , Publish Date - Jun 05 , 2025 | 12:23 PM
18 ఏళ్ల కప్పు కలను ఎట్టకేలకు నిజం చేసుకున్నాడు కింగ్ కోహ్లీ. ఐపీఎల్-2025లో ఆర్సీబీ చాంపియన్గా నిలవడంతో విరాట్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీది 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్.. ఇన్నేళ్లలో అతడు అందుకోని విజయం లేదు, సాధించని రికార్డు లేదు. వన్డే వరల్డ్ కప్ సహా టీ20 ప్రపంచ కప్, చాంపియన్స్ ట్రోఫీ, టెస్టుల్లో నంబర్ 1గా ఆధిపత్యం చెలాయించడం.. ఇలా ఎంతో సక్సెస్ చూశాడు కింగ్. కానీ ఐపీఎల్ ట్రోఫీని మాత్రం అందుకోలేకపోయాడు. ఏళ్లుగా ఆడుతున్నా ఒక్క కప్పు కూడా సొంతం చేసుకోలేదు విరాట్. ఎన్ని సాధించినా ఈ ఒక్క విషయంలో మాత్రం ఎప్పుడూ విఫలమవుతూనే వచ్చాడు. వ్యక్తిగతంగా పరుగుల వర్షం కురిపించినా ట్రోఫీ అందుకోకపోవడం అతడ్ని నిరుత్సాహానికి గురిచేసింది. అటు విమర్శకుల సూటిపోటి మాటలు, ఇటు యాంటీ ఫ్యాన్స్ ట్రోల్స్ను భరిస్తూ వచ్చాడు. ఎట్టకేలకు ఈసారి ఆర్సీబీ ట్రోఫీ అందుకోవడంతో కోహ్లీ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. 18 ఏళ్ల కల నెరవేరడంతో అతడి ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. అందుకే ప్రశాంతంగా నిద్రపోతానని అంటున్నాడు కింగ్.
ఎగతాళి చేసినా..
ఒక్క ట్రోఫీ కూడా నెగ్గకపోవడంతో గత కొన్ని సీజన్లుగా ఆర్సీబీపై ట్రోల్స్ విపరీతంగా పెరిగాయి. కప్పు కొట్టడం మీ వల్ల కాదంటూ విమర్శకులు ఎగతాళి చేశారు. వీటిపై విరాట్ కోహ్లీ స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఇదీ ఆర్సీబీ అంటూ చాలా మంది మమ్మల్ని ట్రోల్ చేశారు. మా టీమ్ను అపహాస్యం చేస్తూ ఆట పట్టించారు. కానీ అవేవీ మమ్మల్ని ఆపలేకపోయాయి. పైగా మా ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. చాంపియన్గా నిలవాలనే మా దృఢ సంకల్పాన్ని మరింత పెంచాయి. మా అభిమానులతో మాకు మంచి అనుబంధం ఉంది. గెలుపోటములకు అతీతంగా మాకు మద్దతుగా నిలుస్తూ వచ్చారు. మా మీద దేవుడి దయ ఉంది. కప్పు గెలిచాం. ఇక నేను పసిపిల్లాడి మాదిరిగా ప్రశాంతంగా నిద్రపోతా’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
ఎప్పుడు మాట్లాడాడంటే..
ట్రోఫీ గెలిచాక ఆర్సీబీ నిర్వహించిన విక్టరీ పరేడ్లో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మంది వరకు గాయపడ్డారు. ఈ తరుణంలో కోహ్లీ ప్రశాంతంగా నిద్రపోతా అంటూ చేసిన వ్యాఖ్యల్ని కొందరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఈ తరుణంలో ఇలాంటి కామెంట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే ఆర్సీబీ విక్టరీ పరేడ్కు ముందే విరాట్ ఈ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఫైనల్ మ్యాచ్ ముగిశాక యాంకర్ జతిన్ సప్రూతో చిట్చాట్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి