Virat Kohli:కెప్టెన్సీతో కెరీర్ను ముగించిన కోహ్లీ.. ఇది ఆ దేవుడి స్క్రిప్ట్
ABN , Publish Date - May 13 , 2025 | 12:45 PM
Team India: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్టులకు గుడ్బై చెప్పేశాడు. ఇంగ్లండ్ సిరీస్కు ముందు రిటైర్మెంట్ గురించి ప్రకటన చేశాడు. దీంతో విరాట్ టెస్ట్ కెరీర్ విశేషాలను తలచుకొని ఎమోషనల్ అవుతున్నారు అభిమానులు.

భారత జట్టు సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చేశాడు. ఇప్పటికే టీ20ల నుంచి వైదొలిగిన కింగ్.. ఇకపై వన్డేల్లోనే కొనసాగుతానని స్పష్టం చేశాడు. 14 ఏళ్ల సుదీర్ఘ టెస్ట్ కెరీర్లో తనకు సహకరించిన వారందరికీ అతడు ధన్యవాదాలు తెలిపాడు. తనకు ఎంతో ఇష్టమైన టెస్టులకు వీడ్కోలు పలకడం భావోద్వేగంగా ఉందన్నాడు. కోహ్లీ రిటైర్మెంట్ నిర్ణయంతో అభిమానులు షాక్లో ఉన్నారు. ఫామ్, ఫిట్నెస్ ఉన్నా ఇలా ఎందుకు చేశాడంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో టెస్టుల్లో కోహ్లీ నెలకొల్పిన రికార్డులు, బ్యూటిఫుల్ నాక్స్ను గుర్తుచేసుకుంటున్నారు. అయితే వాళ్లకు తెలియని ఓ విషయం ఉంది. అదే కెప్టెన్సీ. కోహ్లీ సారథ్యంతో కెరీర్ను ముగించాడనే విషయం చాలా మందికి తెలియదు. దాని గురించి ఇప్పుడు చూద్దాం..
కంగారెత్తించాడు..
లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని నుంచి నాయకత్వ పగ్గాలు అందుకున్న విరాట్.. 2014 నుంచి 2022 వరకు కెప్టెన్గా టెస్ట్ టీమ్ను అద్భుతంగా నడిపించాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ జట్టు సారథ్య పగ్గాలు తీసుకున్నాడు. అయితే సుదీర్ఘ ఫార్మాట్లో గత మూడేళ్లుగా కేవలం ఆటగాడిగానే ఉంటూ వచ్చిన కోహ్లీ.. అనూహ్యంగా ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టెస్ట్లో కెప్టెన్గా వ్యవహరించాడు. సిడ్నీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ ఆడలేదు. అతడికి బదులు శుబ్మన్ గిల్ టీమ్లోకి వచ్చాడు.
వాటే ఫేర్వెల్
ఈ టెస్ట్కు సారథిగా ఉన్న పేసర్ బుమ్రా వెన్నునొప్పితో 2వ రోజు ఆట నుంచి వైదొలిగాడు. దీంతో మిగతా మ్యాచ్ మొత్తం విరాటే కెప్టెన్గా వ్యవహరించాడు. అతడి సారథ్యంలో సిరాజ్, ప్రసిద్ధ్, నితీష్ రెడ్డి చెలరేగి బౌలింగ్ చేశారు. ఒకవైపు మాటలతో ఆసీస్ను కవ్విస్తూనే మరోవైపు బౌలర్లలో జోష్ నింపాడు విరాట్. ఇది భలే పని చేసింది. ఆతిథ్య జట్టును రెండు ఇన్నింగ్స్ల్లో 200 స్కోరు లోపే కుప్పకూల్చారు మన బౌలర్లు. ఈ మ్యాచ్లో భారత్ 6 వికెట్లతో ఓడినా కింగ్ తన మార్క్ కెప్టెన్సీతో అభిమానులను ఉర్రూతలూగించాడు. ఈ మ్యాచే కోహ్లీ కెరీర్లో చివరిది. ఆ విధంగా ఆఖరి టెస్ట్ను సారథిగానే ముగించాడీ దిగ్గజం. ఇది నిజంగా దేవుడి స్క్రిప్ట్ అని.. రియల్ లీడర్కు ఇది గుర్తుండిపోయే ఫేర్వెల్ అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. కోహ్లీ వీడ్కోలు మ్యాచ్ కోరుకోకపోయినా ఆ భగవంతుడు చివరి మ్యాచ్లో కెప్టెన్సీ అవకాశం ఇచ్చి ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశాడని చెబుతున్నారు.
ఇవీ చదవండి:
గంభీర్ వల్లే కోహ్లీ రిటైర్మెంట్
ఐపీఎల్పై ఆసీస్ బోర్డు ట్విస్ట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి