Share News

TNPL 2025: వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకోండి.. ఇంతకంటే దారుణం ఉండదు!

ABN , Publish Date - Jun 15 , 2025 | 02:02 PM

వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రాతినిధ్యం వహిస్తున్న దిండిగల్ డ్రాగన్స్ జట్టు పరువు తీసుకుంది. చెత్త ఫీల్డింగ్‌తో భారీగా ట్రోల్స్‌కు గురవుతోంది. అసలేం జరిగిందంటే..

TNPL 2025: వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకోండి.. ఇంతకంటే దారుణం ఉండదు!
TNPL 2025

క్రికెట్‌లో నెగ్గాలంటే బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్ కూడా చాలా కీలకం. కేవలం ఫీల్డింగ్ బలం మీదే మ్యాచులు గెలిచిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలోనే కాదు.. రాష్ట్రస్థాయి జట్లలోనూ ఇప్పుడు ఫీల్డింగ్ ప్రమాణాలు ఎంతగానో పెరిగాయి. పక్షిలా గాల్లోకి ఎగిరి క్యాచులు అందుకోవడం, నమ్మశక్యం కాని రీతిలో రనౌట్లు చేయడం, అద్భుతమైన రిటర్న్ క్యాచ్‌లు పట్టడం.. ఇలా ఫీల్డింగ్‌ ప్రమాణాలు గణనీయంగా పెరిగాయి. ఈ తరుణంలో మంచి పాపులారిటీ తెచ్చుకున్న తమిళనాడు ప్రీమియర్ లీగ్‌‌‌ చెత్త ఫీల్డింగ్‌కు అడ్డాగా మారింది. కనీసం బంతి పట్టుకోవడానికి కూడా ఫీల్డర్లు అగచాట్లు పడటం అందర్నీ విస్మయానికి గురిచేసింది. అసలేం జరిగిందంటే..


అశ్విన్ బంతిని విసరడంతో..

తమిళనాడు ప్రీమియర్ లీగ్‌.. తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ తెచ్చుకుందీ టోర్నమెంట్. తమిళనాడులోని లోకల్ టాలెంట్‌ను గుర్తించి ప్రోత్సహించడం, టీమిండియాకు ఆడేలా ఆటగాళ్లను తీర్చిదిద్దడం కోసం ఈ లీగ్‌ను ప్రవేశపెట్టారు. రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు పలువురు భారత స్టార్లు ఆడుతుండటంతో ఈ టోర్నీకి మంచి పాపులారిటీ వచ్చింది. అలాంటి చోట దారుణమైన ఫీల్డింగ్‌తో పరువు తీసుకుంది అశ్విన్ టీమ్. అతడు సారథిగా ఉన్న దిండిగల్ డ్రాగన్స్ జట్టు ఫీల్డర్లు ఒకే బంతికి ఏకంగా మూడుసార్లు రనౌట్ మిస్ చేశారు. సియాచెమ్ మధురై పాంథర్స్‌తో మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది.


ఓవర్‌త్రోల మీద ఓవర్‌త్రోలు..

సియాచెమ్ మధురై పాంథర్స్ ఇన్నింగ్స్‌ 20వ ఓవర్‌లో ఓ ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. పాంథర్స్ బ్యాటర్ కొట్టిన బంతి కవర్ ఫీల్డర్ దగ్గరకు వెళ్లింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న అశ్విన్ బంతిని నాన్ స్ట్రయికర్ ఎండ్ వైపు విసిరాడు. అయితే బౌలర్‌తో పాటు బ్యాకింగ్‌లో ఉన్న ఫీల్డర్ కూడా దాన్ని అందుకోలేదు. దీంతో బ్యాటర్లు అదనంగా ఇంకో పరుగు తీశారు. బంతిని అందుకున్న ఇంకో ఫీల్డర్ కూడా డైరెక్ట్ త్రోకు ప్రయత్నించాడు. అయితే ఈసారి కూడా బంతిని ఎవరూ అందుకోకపోవడంతో మరో ఓవర్‌త్రో అయింది. దీంతో ఇంకో పరుగు తీశారు బ్యాటర్లు. ఇలా ఒకే బంతికి మూడుసార్లు రనౌట్‌కు ప్రయత్నించడం, బంతిని ఎవరూ అందుకోకపోవడం కామెడీ సీన్‌ను తలపించింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోను చూసిన నెటిజన్స్.. ఇది ప్రొఫెషనల్ క్రికెట్‌లా అనిపించడం లేదని అంటున్నారు. వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకోండి అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.


ఇవీ చదవండి:

బుద్ధి పోనిచ్చుకోని ఆసీస్!

టీమిండియా వల్ల నిద్రపట్టలేదు

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 15 , 2025 | 02:02 PM