Shubman Gill Serious: ఇంగ్లండ్ పరువు తీసిన గిల్.. దమ్ముంటే ఆడమంటూ..!
ABN , Publish Date - Jul 13 , 2025 | 10:13 AM
టీమిండియా నయా కెప్టెన్ శుబ్మన్ గిల్ ఇంగ్లండ్ పరువు తీశాడు. దమ్ముంటే ఆడమంటూ ప్రత్యర్థి జట్టు ఓపెనర్లను వార్నింగ్ ఇచ్చాడు. మూడో రోజు ఆట ముగింపు సమయంలో జరిగిన ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

శుబ్మన్ గిల్ ఎక్కువగా కామ్గా, కూల్గా ఉంటాడు. బ్యాటింగ్ చేస్తున్నా, ఫీల్డింగ్ చేస్తున్నా అతడు ఇలాగే ఉంటాడు. బయట కూడా తన పని ఏదో తాను అన్నట్లు వ్యవహరిస్తుంటాడు. అంతేగానీ ఇతరులతో గొడవలకు దిగడం లాంటివి అతడు ఇప్పటివరకు చేయలేదు. సాధారణ ఆటగాడిగా ఉన్నప్పుడే కాదు.. టీమిండియాకు కెప్టెన్ అయ్యాక కూడా గిల్ యాటిట్యూడ్లో మార్పు రాలేదు. కానీ లార్డ్స్ టెస్ట్ మూడో రోజు గిల్ ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు. దమ్ముంటే ఆడి చూపించండి అంటూ ఇంగ్లండ్ ఓపెనర్ల వైపు దూసుకెళ్లాడు. అసలేం జరిగిందంటే..
కావాలని చేయడంతో..
లార్డ్స్ టెస్ట్ మూడో రోజు భారత్ 387 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగింది ఇంగ్లండ్. అయితే డే-3 ముగింపునకు చేరుకోవడం, సమయం దగ్గర పడుతుండటంతో ఇంకో రెండు, మూడు కంటే ఎక్కువ ఓవర్లు వేసేందుకు వీలు లేని పరిస్థితి. కనీసం రెండు ఓవర్లు వేసి ఇంగ్లండ్ ఓపెనర్లలో ఒకర్ని ఔట్ చేసి రోజును విజయవంతంగా ముగించాలని భారత్ అనుకుంది. కానీ జాక్ క్రాలే (2 నాటౌట్), బెన్ డకెట్ (0 నాటౌట్) తెలివిగా ఒకే ఓవర్తో గేమ్ ముగించారు. బౌండరీ లైన్ వైపు నుంచి ఎవరో అడ్డుగా కనిపిస్తున్నారని ఒకసారి ఆటను ఆపిన క్రాలే.. ఆ తర్వాత బంతి గట్టిగా తాకకున్నా ఇంజ్యురీ అయినట్లు ఓవరాక్షన్ చేశాడు. దీంతో గిల్ అతడికి ఇచ్చిపడేశాడు. దమ్ముంటే ఆడండి.. నాటకాలు ఎందుకు అంటూ మండిపడ్డాడు.
ఎందుకీ నాటకాలు?
దమ్ముంటే ఆడాలి గానీ ఎక్కడ ఔట్ అవుతామో అని భయంతో నాటకాలు చేయడం ఏంటంటూ జాక్ క్రాలేకు కౌంటర్ ఇచ్చాడు గిల్. వీళ్లిద్దరూ మాట్లాడుతుండగా మధ్యలో డకెట్ జోక్యం చేసుకున్నాడు. దీంతో అతడిపై కూడా గిల్ సీరియస్ అయ్యాడు. ఆ సమయంలో శుబ్మన్, బుమ్రా, రాహుల్, పంత్ సహా పలువురు భారత ఆటగాళ్లు నిజంగానే గాయమైందా అంటూ చప్పట్లతో ఇంగ్లండ్ గాలి తీసేశారు. ఔట్ అవ్వకుండా తప్పించుకునేందుకు ఇలా ప్లాన్ చేశారా అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు. అయితే ఓవర్ ముగిసిన తర్వాత అంతా నవ్వుతూ డ్రెస్సింగ్ రూమ్ వైపు నడక సాగించారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి