Shubman Gill: రోహిత్ బాటలో గిల్.. ఇక మనల్ని ఎవడ్రా ఆపేది!
ABN , Publish Date - Jun 06 , 2025 | 01:07 PM
టీమిండియా నయా కెప్టెన్ శుబ్మన్ గిల్ పాత సారథి బాటలోనే నడుస్తున్నాడు. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను ఫాలో అవుతున్నాడు గిల్. మరి.. భారత క్రికెట్లో అసలేం జరుగుతోందో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్-2025 ముగియడంతో ఇప్పుడు అంతా టీమిండియా మ్యాచుల కోసం ఎదురు చూస్తున్నారు. భారత ఆటగాళ్లు బరిలోకి దిగి రెచ్చిపోయి ఆడుతుంటే చూడాలని అనుకుంటున్నారు. అయితే వాళ్ల కోరిక నెరవేరాలంటే జూన్ 20 వరకు ఆగక తప్పదు. ఎందుకంటే ఆ తేదీ నుంచే భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ షురూ అవుతుంది. 5 మ్యాచుల ఈ ప్రతిష్టాత్మక సిరీస్ కోసం లండన్ ఫ్లైట్ ఎక్కేసింది టీమిండియా. వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ నయా సైకిల్ ఇదే సిరీస్తో మొదలవనుండటంతో సత్తా చాటాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో మెన్ ఇన్ బ్లూ కొత్త సారథి శుబ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ బాటలో తాను నడవాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. ఇంకా గిల్ ఏమన్నాడంటే..
అదే దారిలో..
ప్రతి ప్లేయర్ అతడి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకునేలా చేయడమే తన పని అని గిల్ అన్నాడు. ఆటగాళ్లు న్యాచురల్ గేమ్తో అదరగొట్టేలా ప్రోత్సహిస్తానని చెప్పాడు. జట్టు సభ్యుల్లో భయాన్ని పోగొడతానని.. ఈ విషయంలో రోహిత్ శర్మను అనుసరిస్తానని గిల్ తెలిపాడు. హిట్మ్యాన్లాగే టీమ్ మెంబర్స్తో కలివిడిగా ఉంటూ సత్సంబంధాలు నెరుపుతానని చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్ అనే కాదు.. టీమిండియా ఆడే ప్రతి సిరీస్, ప్రతి పర్యటనలో ఒత్తిడి అధికంగా ఉంటుందని గిల్ స్పష్టం చేశాడు.
వాళ్లు లేకపోయినా..
‘ప్రతి టూర్లో ఒత్తిడి అనేది తప్పకుండా ఉంటుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీమిండియాకు ఎన్నో మ్యాచుల్లో ప్రాతినిధ్యం వహించారు. జట్టు బ్యాటింగ్కు మూలస్తంభంగా ఉంటూ వచ్చిన వీళ్లను భర్తీ చేయడం అంత సులువేం కాదు. వాళ్లు లేకపోయినా జట్టుపై అంతే స్థాయిలో ఒత్తిడి ఉంటుందని మాత్రం చెప్పగలను. ఇలాంటి ఒత్తిడి సమయాల్లో ఆడటం మాకు అలవాటు అయింది. విజయం కోసం ఏం చేయాలో మాకు తెలుసు’ అని గిల్ చెప్పుకొచ్చాడు. అనుభవం వస్తున్న కొద్దీ సహచర ఆటగాళ్లను ఎలా కలుపుకొని పోవాలి, వాళ్లలో అభద్రతా భావాన్ని ఎలా పోగొట్టాలి.. అనే విషయాలు అర్థమయ్యాయని వివరించాడు. ఆటగాళ్లలో భయం పోతేనే 100 శాతం ఎఫర్ట్ పెట్టగలరని గిల్ వ్యాఖ్యానించాడు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి