Rohit Sharma: తెలుగోడి కోసం రోహిత్ ఫైట్.. బీసీసీఐని ఒప్పించిన హిట్మ్యాన్!
ABN , Publish Date - May 28 , 2025 | 06:18 PM
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నమ్మిన వాళ్ల కోసం ఏం చేయడానికైనా వెనుకాడడని మరోసారు నిరూపితమైంది. ఒక తెలుగోడి కోసం హిట్మ్యాన్ చేసిన పోరాటమే దీనికి ఉదాహరణ అని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. అసలు రోహిత్ ఏం చేశాడంటే..

భారత క్రికెట్ బోర్డు ఏదైనా నిర్ణయం తీసుకుందంటే అది ఫైనల్ అనే చెప్పాలి. బోర్డు పెద్దలు ఒక డెసిషన్ తీసుకున్నాక దాని విషయంలో వెనుకంజ వేసిన సందర్భాలు దాదాపుగా లేవు. అలాంటిది టీమిండియా కోచింగ్ స్టాఫ్ విషయంలో బీసీసీఐ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఫీల్డింగ్ కోచ్గా హైదరాబాద్కు చెందిన టి దిలీప్కు ఉద్వాసన పలికి నెల గడిచిందో లేదో తిరిగి అతడికే ఆ బాధ్యతలను అప్పగించింది. విదేశీ కోచ్ కోసం ఎంత ప్రయత్నించినా దొరకకపోవడంతో దిలీప్ను ఆ పదవిలో కొనసాగించాలని నిర్ణయించామని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. వచ్చే నెల ఇంగ్లండ్లో పర్యటించే టీమిండియాకు దిలీప్ ఫీల్డింగ్ కోచ్గా వ్యవహరిస్తాడని తెలిపారు. అయితే దిలీప్ రీఎంట్రీ విషయంలో రోహిత్ శర్మ పాత్ర ఉందని తెలుస్తోంది. హిట్మ్యాన్ పట్టుబట్టి బీసీసీఐతో పాటు హెడ్ కోచ్ గౌతం గంభీర్ను ఒప్పించి దిలీప్ను తిరిగి టీమిండియాలోకి తీసుకొచ్చాడని క్రికెట్ వర్గాల సమాచారం. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
వరుస ఓటములతో..
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా దారుణ ఓటమిపాలైంది. అంతకుముందు న్యూజిలాండ్ సిరీస్లోనూ మెన్ ఇన్ బ్లూ వైట్వాష్ అయింది. దీంతో జట్టు కోచింగ్ స్టాఫ్ మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ ఓటములకు బాధ్యులుగా ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్తో పాటు అభిషేక్ నాయర్ను ఇంటికి సాగనంపింది బీసీసీఐ. రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ రిటైర్మెంట్కు ముందే ఈ ఇద్దరి మీద వేటు వేసింది బోర్డు. త్వరలో ఇంగ్లండ్ టూర్ మొదలుకానున్న నేపథ్యంలో దిలీప్-అభిషేక్ స్థానంలో కొత్త కోచ్లను ఎంపిక చేసి, రంగంలోకి దింపాలని అనుకుంది. అయితే ఫీల్డింగ్ కోచ్గా తిరిగి దిలీప్నే రీప్లేస్ చేసింది. సరైన రీప్లేస్మెంట్ దొరకకపోవడంతో అతడ్నే తిరిగి నియమించారని బీసీసీఐ వర్గాలు చెప్పడంతో ఇదే నిజమని అంతా అనుకున్నారు. కానీ దీని వెనుక రోహిత్ ప్రమేయం ఉందని తెలుస్తోంది. కనీసం ఏడాది పాటు దిలీప్ను ఫీల్డింగ్ కోచ్గా కొనసాగేలా చూడాలని బీసీసీఐతో పాటు గంభీర్ను ప్రత్యేకంగా కోరాడట హిట్మ్యాన్. దీంతో బోర్డు దిలీప్ను తిరిగి టీమిండియాలోకి తీసుకుందని సమాచారం.
స్పెషల్ రిక్వెస్ట్!
టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ హయాంలో పని చేసిన టి దిలీప్.. ఆ తర్వాత గంభీర్ స్టాఫ్లోనూ ఒకడిగా సేవలు అందించాడు. టీ20 వరల్డ్ కప్-2024తో పాటు చాంపియన్స్ ట్రోఫీ-2025ను భారత్ గెలుచుకోవడంలో అతడిది కీలక పాత్ర. మన ఆటగాళ్లు వరల్డ్ క్లాస్ ఫీల్డింగ్తో ప్రత్యర్థులను భయపెట్టేలా చేశాడు దిలీప్. ఈ రెండు మెగా టోర్నమెంట్స్ సమయంలో బరిలో పాదరసంలా కదిలిన ఆటగాళ్లకు బెస్ట్ ఫీల్డింగ్ మెడల్స్ ఇచ్చి ప్రోత్సహించాడు. అతడి హయాంలో క్యాచింగ్, రనౌట్స్, గ్రౌండ్ ఫీల్డింగ్.. ఇలా ప్రతి విషయంలో జట్టు ఎన్నో రెట్లు మెరుగుపడింది. అతడి పనితీరును రోహిత్ దగ్గరగా చూశాడు. బహుశా ఆ నమ్మకంతోనే దిలీప్ను ఇంకో ఏడాది పాటు కొనసాగేలా చూడాలని బీసీసీఐ-గంభీర్కు హిట్మ్యాన్ స్పెషల్ రిక్వెస్ట్ పెట్టి ఉండొచ్చని నెటిజన్స్ అంటున్నారు. టాలెంట్ను గుర్తించడం, ఎంకరేజ్ చేయడం, నమ్మిన వారి కోసం నిలబడటంలో రోహిత్ తనకు తానే సాటి అని మెచ్చుకుంటున్నారు.
ఇవీ చదవండి:
కోహ్లీతో మైండ్గేమ్స్.. ఎవడ్రా వీడు!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి