Rohit-Kohli: రోహిత్-కోహ్లీకి అరుదైన గౌరవం.. ఆస్ట్రేలియాను మెచ్చుకోవాల్సిందే!
ABN , Publish Date - Jun 08 , 2025 | 04:16 PM
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. ఈ ఇద్దరి విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా మంచి నిర్ణయం తీసుకుంది. మరి.. ఆ నిర్ణయం ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఆధునిక క్రికెట్పై చెరగని ముద్ర వేశారు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. ఆడిన ప్రతి దేశంలోనూ అదరగొట్టారీ స్టార్లు. టీ20, వన్డే, టెస్ట్ అనే తేడాల్లేకుండా బరిలోకి దిగితే చాలు.. పరుగుల వర్షం కురిపించడమే ధ్యేయంగా ఆడుతూ వచ్చారు. అయితే పొట్టి ప్రపంచ కప్-2024 తర్వాత టీ20లకు గుడ్బై చెప్పిన ఈ ద్వయం.. ఇటీవలే టెస్టులకూ రిటైర్మెంట్ ప్రకటించారు. ఇకపై వన్డేల్లో మాత్రమే కొనసాగుతామని వెల్లడించారు. దీంతో అభిమానులు తెగ బాధపడుతున్నారు. కనీసం ఫేర్వెల్ మ్యాచ్ ఆడకుండా రిటైర్ అవడం ఏంటని ఫీల్ అవుతున్నారు. సత్కరించే అవకాశం కూడా ఇవ్వరా అని వాపోతున్నారు. ఈ తరుణంలో రోహిత్-కోహ్లీ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా చేస్తున్న పని తెలిసి ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. అసలు సీఏ ఏం చేసిందంటే..
ఘనమైన వీడ్కోలు..
టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చేసిన రోహిత్-కోహ్లీని సత్కరించాలని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయించింది. ఈ ఏడాది ఆఖర్లో జరిగే వన్డే సిరీస్ సమయంలో రోకో జోడీని ప్రత్యేకంగా గౌరవించాలని డిసైడ్ అయింది. ఇద్దరు భారత స్టార్లకు ఘనమైన వీడ్కోలుకు ప్లాన్ చేస్తోంది. ‘రోహిత్-కోహ్లీ ఆస్ట్రేలియా గడ్డ మీద ఆడటం బహుశా ఇదే చివరిసారి కావొచ్చు. అందుకే వాళ్లిద్దరికీ ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని అనుకుంటున్నాం. అంతర్జాతీయ క్రికెట్కు వాళ్లు అందించిన సేవలకు గానూ గ్రాండ్ ఫేర్వెల్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాం’ అని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో టాడ్ గ్రీన్బెర్గ్ చెప్పుకొచ్చారు. కాగా, మూడు వన్డేల కోసం ఈ సంవత్సరం అక్టోబర్లో ఆస్ట్రేలియాకు పయనం కానుంది టీమిండియా. అక్టోబర్ 19న తొలి వన్డే, 23న రెండో వన్డే, 25వ తేదీన ఆఖరి మ్యాచ్ జరుగుతాయి. ఇది తెలిసిన నెటిజన్స్.. ఆసీస్ బోర్డుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. దిగ్గజాలను గౌరవించడం గొప్ప విషయమని అంటున్నారు. ప్రత్యర్థి ఆటగాళ్లయినా గేమ్కు వాళ్లు అందించిన సేవలకు గుర్తుగా ఇలా వేడుకకు ప్లాన్ చేయడం భేష్ అని మెచ్చుకుంటున్నారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి