Ravichandran Ashwin: లేడీ అంపైర్పై అశ్విన్ సీరియస్.. చెప్పినా వినకపోవడంతో..!
ABN , Publish Date - Jun 09 , 2025 | 12:36 PM
టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. లేడీ అంపైర్తో అతడు వ్యవహరించిన విధానం కాంట్రవర్సీగా మారింది. అసలేం జరిగిందంటే..

టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఎప్పుడూ కూల్గా ఉంటాడు. బయటా, క్రికెట్ మైదానంలో దాదాపుగా ఒకేలా ఉంటాడు. గెలుపోటములకు అతీతంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటాడు. అయితే కెరీర్లో పలు వివాదాల్లో చిక్కుకున్న అతడు.. మరోమారు కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడు. ఒక లేడీ అంపైర్తో అశ్విన్ వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఔట్ కాదని అశ్విన్ ఎంత చెప్పినా అంపైర్ వినకపోవడంతో అసహనానికి లోనయ్యాడు మాజీ స్పిన్నర్. బ్యాట్తో ప్యాడ్స్ను గట్టిగా కొడుతూ ఫ్రస్ట్రేషన్ చూపించాడు. ఈ ఘటన ఎక్కడ జరిగింది? అసలు ఏమైంది? అనేది ఇప్పుడు చూద్దాం..
తప్పు ఎవరిది?
ఐపీఎల్-2025 ముగిశాక తమిళనాడు ప్రీమియర్ లీగ్లో ఆడుతూ బిజీ అయిపోయాడు అశ్విన్. దిండిగల్ డ్రాగన్ తరఫున బరిలోకి దిగుతూ అభిమానులను అలరిస్తున్నాడీ వెటరన్ ఆల్రౌండర్. అయితే అనూహ్యంగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు అశ్విన్. తిరుప్పూర్ జట్టుతో మ్యాచ్లో 18 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. స్పిన్నర్ సాయి కిషోర్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు అశ్విన్. అయితే అంపైర్ ఔట్ నిర్ణయంపై అతడు అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాను ఔట్ కాదంటూ వాదనకు దిగాడు.
ప్యాడ్స్ను కొడుతూ..
అంపైర్ మాత్రం అశ్విన్ చెప్పేది అస్సలు వినలేదు. దీంతో ఏం చేయాలో పాలుపోకపోవడంతో బ్యాట్తో ప్యాడ్స్ను గట్టిగా కొడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు దిగ్గజ స్పిన్నర్. డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్తూ ఏవో కామెంట్స్ చేశాడు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. అశ్విన్ నాటౌట్ అని, అతడు చేసింది తప్పు కాదని కొందరు నెటిజన్స్ సమర్థిస్తున్నారు. మరోవైపు సీనియర్ స్పిన్నర్ అలా వ్యవహరించి ఉండాల్సింది కాదని.. అంపైర్తో వాగ్వాదానికి దిగడం ఏంటని మరికొందరు మండిపడుతున్నారు. కాగా, ఈ ఏడాది ఐపీఎల్లో అశ్విన్ తన స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. 9 మ్యాచుల్లో 7 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి