Share News

IPL 2025 Qualifier 2: క్వాలిఫయర్-2కు వాన గండం.. మ్యాచ్ రద్దయితే ఫైనల్ వెళ్లేదెవరు?

ABN , Publish Date - Jun 01 , 2025 | 03:06 PM

పంజాబ్-ముంబై జట్ల మధ్య ఇవాళ కీలక మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన టీమ్ ఫైనల్‌కు చేరుకుంటుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో నెగ్గాల్సిందేనని అటు అయ్యర్ సేన, ఇటు ఎంఐ వీరులు పట్టుదలతో ఉన్నారు.

IPL 2025 Qualifier 2: క్వాలిఫయర్-2కు వాన గండం.. మ్యాచ్ రద్దయితే ఫైనల్ వెళ్లేదెవరు?
PBKS vs MI

ఐపీఎల్-2025 తుది అంకానికి చేరుకుంది. ఇంకో రెండు మ్యాచులతో క్యాష్ రిచ్ లీగ్ మరో సీజన్‌ను పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. మరో బెర్త్ కోసం పంజాబ్ కింగ్స్-ముంబై ఇండియన్స్ పోటీపడుతున్నాయి. ఈ రెండు హేమాహేమీల నడుమ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం సాయంత్రం రసవత్తర పోరు జరగనుంది. ఈ మ్యాచ్ కోసం రెండు జట్ల అభిమానులే గాక క్రికెట్ లవర్స్ అంతా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌కు వాన గండం పొంచి ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒకవేళ మ్యాచ్ రద్దయితే ఫైనల్‌కు వెళ్లేదెవరు.. పంజాబ్-ముంబైలో తుదిపోరుకు అర్హత సాధించేదెవరు.. అనేది ఇప్పుడు చూద్దాం..


రద్దయితే ఇంటికే..

ఒకవేళ వరుణుడి వల్ల మ్యాచ్ గానీ రద్దయితే అప్పుడు పంజాబ్ కింగ్స్‌కే లాభం అని చెప్పాలి. ఎందుకంటే లీగ్ దశ ముగిసేసరికి పాయింట్స్ టేబుల్‌లో మెరుగ్గా ఉన్న టీమే ముందుకు వెళ్తుంది. ఆ లెక్కన టేబుల్ టాపర్‌గా నిలిచినందున పంజాబ్ ఫైనల్‌కు చేరుకుంటుంది. అప్పుడు పాయింట్స్ టేబుల్‌ను నాలుగో స్థానంతో ముగించిన ముంబై ఇండియన్స్ ఇంటిదారి పడుతుంది. దీంతో ఈ మ్యాచ్‌ ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగాలని ముంబై అభిమానులు కోరుకుంటున్నారు. కాగా, మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న అహ్మదాబాద్‌లో 34 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని సమాచారం. వాన కురిసే అవకాశాలు తక్కువేనని తెలుస్తోంది. అయితే ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దయితే మాత్రం ముంబై నిష్క్రమిస్తుంది.


అంత ఈజీ కాదు..

ఎలిమినేటర్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించిన ముంబై ఇండియన్స్ పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. అటు క్వాలిఫయర్-1లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లోనూ అట్టర్‌ఫ్లాప్ అయిన పంజాబ్ కింగ్స్‌‌లో నమ్మకం లోపించినట్లు కనిపిస్తోంది. ఆ జట్టు అన్ని విభాగాలను రీసెట్ చేసి బరిలోకి దిగాల్సి ఉంటుంది. అయితే లీగ్ దశలో ముంబైని ఓడించడం అయ్యర్ సేన కాన్ఫిడెన్స్‌ను పెంచుతోంది. తిరిగి ఎంఐ మీద గెలవగలమనే నమ్మకాన్ని కలిగిస్తోంది. అయితే సీనియర్లతో కూడిన ముంబైని ఓడించాలంటే పంజాబ్ తమ బెస్ట్ ఇవ్వక తప్పదు.


ఇవీ చదవండి:

ఎంపీతో రింకూ మ్యారేజ్

కరుణ్‌ డబుల్‌ సెంచరీ

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 01 , 2025 | 03:14 PM