Pat Cummins On Edgbaston Test: గిల్ సేనను చూసి జడుసుకున్న కమిన్స్.. అస్సలు ఆడనంటూ..!
ABN , Publish Date - Jul 07 , 2025 | 01:09 PM
ఎడ్జ్బాస్టన్ టెస్ట్లో భారత్ గ్రాండ్ విక్టరీ సాధించింది. 336 పరుగుల తేడాతో చారిత్రక విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుపై ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు.

ప్రతి సెషన్ రసవత్తరంగా సాగుతూ వచ్చిన ఎడ్జ్బాస్టన్ టెస్ట్ ఎట్టకేలకు ముగిసింది. దాదాపుగా అన్ని సెషన్లలో ఆధిపత్యం కనబర్చుతూ వచ్చిన టీమిండియా ఏకంగా 336 పరుగుల భారీ తేడాతో విజయకేతనం ఎగురవేసింది. ఇంగ్లండ్ను అన్ని విభాగాల్లో చిత్తు చేసింది భారత్. ఈ గెలుపుతో 5 టెస్టుల సిరీస్ను 1-1తో సమం చేసింది గిల్ సేన. ఈ విక్టరీతో టీమిండియా అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. బ్యాటింగ్లో కెప్టెన్ శుబ్మన్ గిల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ మెరుపులు.. బౌలింగ్లో ఆకాశ్దీప్, మహ్మద్ సిరాజ్ అదరగొట్టిన తీరును ఎంజాయ్ చేస్తున్నారు. అయితే భారత ఆటతీరును చూసి ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ భయపడుతున్నాడు. వామ్మో.. వీళ్లతో మ్యాచ్ వద్దని అంటున్నాడు.
బౌలింగ్ చేయను..
భారత్-ఇంగ్లండ్ సిరీస్ మ్యాచుల్ని తాను చూడటం లేదన్నాడు కమిన్స్. అయితే అక్కడి పిచ్లు, నమోదవుతున్న స్కోర్లు తనను భయపెడుతున్నాయని తెలిపాడు. భారత బ్యాటర్లు రెచ్చిపోయి ఆడుతున్నారని.. ఇలాంటి వికెట్లపై బౌలింగ్ చేయాలని ఏ బౌలర్ కూడా అనుకోడన్నాడు కమిన్స్. ‘ఈ తరహా పిచ్లపై బౌలింగ్ చేయాలని ఎవరూ కోరుకోరు. వికెట్ మరీ ఇంత ఫ్లాట్గా ఉండటం నాకు నచ్చలేదు. అయితే ఈ సిరీస్ పోటాపోటీగా సాగుతుందని మాత్రం చెప్పగలను’ అని కమిన్స్ చెప్పుకొచ్చాడు.
లార్డ్స్ పరిస్థితేంటి..
ఒకవైపు భారీ స్కోర్లు బాదుతున్న భారత్ను పొగుడుతూనే మరోవైపు చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్ను పిచ్ల విషయంలో లక్ష్యంగా చేసుకున్నాడు కంగారూ కెప్టెన్. ఈ ఏడాది ఆఖర్లో యాషెస్ సిరీస్ జరగనున్న నేపథ్యంలో ఇంగ్లీష్ వికెట్లపై కమిన్స్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. కాగా, ఎడ్జ్బాస్టన్ పిచ్ ఆసియా వికెట్ల మాదిరిగా మరీ ఫ్లాట్గా మారిందంటూ స్వయంగా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వ్యాఖ్యానించడం వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో మూడో టెస్ట్కు ఆతిథ్యం ఇస్తున్న లార్డ్స్లో పిచ్ను ఎలా తయారు చేస్తారనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇవీ చదవండి:
ఆకాశ్దీప్ కష్టం ఎవరికీ రాకూడదు!
మమ్మల్ని అతడే ఓడించాడు: మెకల్లమ్
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి