Gautam Gambhir: టీమిండియాకు కొత్త టెన్షన్.. ఇది సెట్ చేస్తే తిరుగుండదు!
ABN , Publish Date - Jun 12 , 2025 | 09:01 AM
భారత జట్టుకు కొత్త టెన్షన్ మొదలైంది. ఇంగ్లండ్ సిరీస్కు ముందు టీమ్ మేనేజ్మెంట్కు ఇది పెద్ద తలనొప్పిగా మారింది. మరి.. ఏంటా టెన్షన్ అనేది ఇప్పుడు చూద్దాం..

ఇంగ్లండ్తో 5 టెస్టుల సిరీస్ కోసం జోరుగా సన్నద్ధం అవుతోంది భారత జట్టు. మరో వారం రోజుల్లో ఈ సిరీస్ మొదలవనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గైర్హాజరీలో భారత్ ఆడుతున్న ప్రధాన టెస్ట్ సిరీస్ కావడంతో అటు కొత్త కెప్టెన్ శుబ్మన్ గిల్తో పాటు ఇటు హెడ్ కోచ్ గౌతం గంభీర్ నేతృత్వంలోని టీమ్ మేనేజ్మెంట్కు ఇది కఠిన పరీక్షగా నిలవనుంది. కుర్రాళ్లతో నిండిన మెన్ ఇన్ బ్లూ ఎలా ఆడుతుంది? ఇంగ్లండ్ విసిరే సవాళ్లను తట్టుకొని ఎంతవరకు రాణిస్తుందనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ తరుణంలో గంభీర్ అండ్ కోకు కొత్త టెన్షన్ పట్టుకుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
ఎక్కడ ఆడిస్తారు?
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్తో టీమిండియాలోకి కొత్త నీరు చేరింది. కరుణ్ నాయర్, సాయి సుదర్శన్ లాంటి బ్యాటర్లు జట్టులోకి ఎంట్రీ ఇస్తున్నారు. అయితే సుదర్శన్ను ఏ స్పాట్లో ఆడించాలనేది గిల్-గంభీర్కు అర్థం కావడం లేదని సమాచారం. సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఓపెనర్గా ఆడటం దాదాపుగా ఖాయమైంది. అతడికి తోడుగా మరో ఓపెనర్గా యశస్వి జైస్వాల్ ఆడటం కూడా పక్కాగా కనిపిస్తోంది. టెస్టుల్లో తన స్థానాన్ని పదిలం చేసుకున్న జైస్వాల్ మొదట్నుంచి ఓపెనర్గానే ఆడుతూ వస్తున్నాడు. కాబట్టి ఇక మీదటా అదే పొజిషన్లో ఆడించొచ్చు. అలాంటప్పుడు దేశవాళీలతో పాటు ఐపీఎల్లోనూ ఓపెనర్గా రాణించిన సాయి సుదర్శన్ను ఏ ప్లేస్లో దింపుతారనేది బిగ్ క్వశ్చన్గా మారింది.
త్యాగం చేస్తాడా..?
విరాట్ కోహ్లీ బ్యాటింగ్కు దిగే నంబర్ 4 పొజిషన్లో కొత్త సారథి శుబ్మన్ గిల్, నంబర్ 5 స్థానంలో కరుణ్ నాయర్ ఆడటం ఖాయమని తెలుస్తోంది. రిషబ్ పంత్, నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా కలసి మిడిలార్డర్లో బాధ్యతలు పంచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అలాంటప్పుడు సాయి సుదర్శన్ను ఆడించాలంటే నంబర్ 3 స్పాట్ ఒక్కటే ఖాళీగా ఉంది. డెబ్యూ ప్లేయర్ కాబట్టి అతడ్ని ఆ ప్లేస్లో ఆడించొద్దని గంభీర్ భావిస్తున్నాడట. రెగ్యులర్ పొజిషన్లో ఆడిస్తే కాన్ఫిడెన్స్ పెరుగుతుందనే ఆలోచనతో రాహుల్కు జతగా అతడ్ని ఓపెనర్గా పంపాలని అనుకుంటున్నాడట. అదే జరిగితే జైస్వాల్ తనకు అలవాటు లేని నంబర్ 3లో ఆడక తప్పదు. దీంతో సుదర్శన్ కోసం జైస్వాల్ త్యాగం చేస్తాడా? అనే సందేహాలు వస్తున్నాయి. ఈ రకంగా ఓపెనింగ్ స్పాట్ను ఫిక్స్ చేయడం గంభీర్-గిల్కు పెద్ద తలనొప్పిగా మారిందని వినిపిస్తోంది. అయితే దీన్ని గనుక సెట్ చేస్తే బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం కుదురుకుంటుంది. ఇన్నింగ్స్ ఆరంభంలో సరైన భాగస్వామ్యం నమోదైతే టీమిండియాకు తిరుగుండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి