MI vs PBKS: ముంబై ఓటమికి 5 కారణాలు.. ఆ తప్పు చేసుండాల్సింది కాదు!
ABN , Publish Date - Jun 02 , 2025 | 09:13 AM
ఆరో కప్పును ఖాతాలో వేసుకుందామని భావించిన ముంబై ఇండియన్స్.. ఆ కలను నెరవేర్చుకోలేకపోయింది. క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్ చేతుల్లో ఓడి ఐపీఎల్-2025 నుంచి ఇంటిదారి పట్టింది హార్దిక్ సేన.

ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్కు కోలుకోలేని షాక్ తగిలింది. ఆరో కప్పును ఖాతాలో వేసుకుందామని భావించిన హార్దిక్ సేనను చిత్తుగా ఓడించింది పంజాబ్ కింగ్స్. ఈ ఇరు జట్ల మధ్య జరిగిన ఐపీఎల్-2025 క్వాలిఫయర్-2 పోరులో గెలుపు అయ్యర్ సేనను వరించింది. ఎంఐ విసిరిన 203 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంకో ఓవర్ మిగిలి ఉండగానే ఛేజ్ చేసేసింది పంజాబ్. ఈ విజయంతో ఆ జట్టు ఫైనల్కు చేరుకోగా.. ఓటమితో ఇంటిదారి పట్టింది ముంబై. మరి.. ఒకదశలో గెలిచేలా కనిపించిన ఎంఐ.. ఎలా మ్యాచ్ను మిస్ చేసుకుంది.. ఆ టీమ్ ఓటమికి కారణాలు ఏంటి.. అనేది ఇప్పుడు చూద్దాం..
బౌలింగ్ మార్పులు
ముంబై బ్యాటింగ్లో అదరగొట్టినా బౌలింగ్లో విఫలమైంది. దీనికి తోడు కెప్టెన్ హార్దిక్ పాండ్యా చేసిన బౌలింగ్ మార్పులు జట్టుకు ప్రతికూలంగా మారాయి. 18వ ఓవర్ వరకు బుమ్రా చేతికి బంతి ఇవ్వకపోవడం ఆ టీమ్ విజయావకాశాల మీద ప్రభావం చూపింది. అప్పటికే అయ్యర్ వార్ వన్ సైడ్ చేసేశాడు. తీవ్ర ఒత్తిడి సమయంలో అశ్వినీ కుమార్, రీస్ టోప్లేతో బౌలింగ్ వేయించగా.. వాళ్లు ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు. 19 ఓవర్లో అశ్వినీ ఏకంగా 26 పరుగులు సమర్పించుకున్నాడు.
చెత్త ఫీల్డింగ్
జోరు మీదున్న నేహాల్ వధేరా (29 బంతుల్లో 48) క్యాచ్ను జారవిడిచాడు ట్రెంట్ బౌల్ట్. అతడు 13 పరుగుల వద్ద ఇచ్చిన సులువైన క్యాచ్ను నేలపాలు చేశాడు. దీంతో రెచ్చిపోయి ఆడిన వధేరా.. అయ్యర్తో కలసి నాలుగో వికెట్కు 84 పరుగులు జతచేశాడు. ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డాడు. ఒక్క క్యాచ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. దీనికి తోడు గ్రౌండ్ ఫీల్డింగ్ సరిగ్గా చేయకపోవడం కూడా ముంబైకి ప్రతికూలంగా మారింది.
బుమ్రా వైఫల్యం
బుమ్రా రాణిస్తే ముంబైకి తిరుగుండదు. అతడు వికెట్లు తీస్తూ పోతే ఎంఐని ఆపడం ఎవరి వల్లా కాదు. కానీ నిన్నటి మ్యాచ్లో వికెట్ తీయకపోగా.. 4 ఓవర్లలో ఏకంగా 40 పరుగులు సమర్పించుకున్నాడీ పేసుగుర్రం. మరో పేసర్ అశ్వినీ కుమార్ (2/55) వికెట్లు తీసినా ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నాడు. రీస్ టోప్లే కూడా 3 ఓవర్లలో 40 పరుగులు లీక్ చేశాడు. ఇలా బుమ్రాతో పాటు ఇతర బౌలర్ల వైఫల్యం ముంబై విజయావకాశాలకు తీవ్రంగా గండికొట్టింది.
బ్రేక్త్రూ సమస్యలు
పంజాబ్ ఓపెనర్ ప్రభుసిమ్రన్ సింగ్ (6)ను త్వరగా ఔట్ చేసింది ఎంఐ. కానీ ఆ తర్వాత వికెట్లు తీయలేకపోయింది. పేసర్లతో పాటు స్పిన్నర్లు కూడా బ్రేక్త్రూలు అందించలేకపోయారు. దీంతో ఎంఐపై ఒత్తిడి తీవ్రంగా పెరిగింది.
ఫలించని వ్యూహాలు
కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేంజెస్ సరిగ్గా చేయలేకపోయాడు. దీనికి తోడు ఫీల్డింగ్ పొజిషన్స్ కూడా వర్కౌట్ కాలేదు. పంజాబ్ బ్యాటర్లు రెచ్చిపోతున్న సమయంలో టీమ్ ప్లేయర్లలో కాన్ఫిడెన్స్ నింపాల్సిన పాండ్యా ఆ పని చేయలేకపోయాడు. ఓటమి దగ్గర పడుతున్న కొద్దీ అతడి బాడీ లాంగ్వేజ్ మారిపోవడం కూడా జట్టుకు ప్రతికూలంగా మారింది.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి