MS Dhoni-Suresh Raina: ధోనీని బద్నాం చేస్తే ఊరుకోను.. సురేష్ రైనా సీరియస్
ABN , Publish Date - Apr 26 , 2025 | 04:32 PM
Indian Premier League: సీఎస్కే సారథి ఎంఎస్ ధోనీని ఏమైనా అంటే ఊరుకోనని అన్నాడు మాజీ క్రికెటర్ సురేష్ రైనా. మాహీ తప్పేమీ లేదని.. అనవసరంగా అతడ్ని బద్నాం చేయడం సరికాదన్నాడు. మరి.. ఏ విషయాన్ని ఉద్దేశించి రైనా ఈ వ్యాఖ్యలు చేశాడో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్ పాపులర్ ఫ్రాంచైజీల్లో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్కు ఈసారి ఏదీ కలసి రావడం లేదు. వరుస ఓటములతో పాయింట్స్ టేబుల్లో చివరి స్థానంలో నిలిచింది సీఎస్కే. ప్లేఆఫ్స్ ఆశలు అడుగంటాయి. ఊరట విజయాలు కూడా దక్కడం లేదు. రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అదరగొడతారు అనుకొని రీటెయిన్ చేసుకున్న స్టార్లు తుస్సుమంటున్నారు. కొత్త కుర్రాళ్లు కొద్దో గొప్పో రాణిస్తున్నా.. మిగతా వాళ్లంతా చేతులెత్తేస్తున్నారు. దీంతో ఎంఎస్ ధోనీపై విమర్శలు వస్తున్నాయి. ఆక్షన్లో అతడు చెప్పిన ప్లేయర్లనే తీసుకున్నారని.. ఓటములకు బాధ్యత మాహీదేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అంతా వాళ్ల చేతుల్లోనే..
సీఎస్కేలో ధోని ఏం చెబితే అదే నడుస్తుందని, మెగా ఆక్షన్లో ఎవరెవర్ని తీసుకోవాలో కూడా అతడే డిసైడ్ చేశాడనే పుకార్లు వస్తున్నాయి. చెన్నై ప్రస్తుత పరిస్థితికి ఆక్షన్లో మాహీ నిర్ణయాలే కారణమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనిపై సీఎస్కే మాజీ స్టార్ సురేష్ రైనా సీరియస్ అయ్యాడు. మాహీ తప్పేమీ లేదన్నాడు. చెన్నై జట్టుకు సంబంధించి రూపా జీ అన్ని క్రికెటింగ్ వ్యవహారాలు చూసుకుంటారని తెలిపాడు. ప్లేయర్ల కొనుగోలు దగ్గర నుంచి కోర్ గ్రూప్ ఆటగాళ్ల మెయింటెనెన్స్ వరకు అంతా ఆమె రెస్పాన్సిబిలిటీనేనని చెప్పాడు. అయితే ఈసారి వేలంలో సీఎస్కే సక్సెస్ కాలేదనేది వాస్తవమన్నాడు రైనా.
వాళ్ల వల్లే ఓటమి
ఆక్షన్లో ప్లేయర్ల కొనుగోలుకు సంబంధించి ధోనీదే ఫైనల్ డెసిజన్ అని అనుకుంటారని.. కానీ ఇందులో నిజం లేదన్నాడు రైనా. ఆటగాళ్లను తీసుకోవాలా.. వద్దా.. అనే విషయంలో మాహీతో డిస్కషన్స్ జరిపినా.. తుది నిర్ణయం మాత్రం ఓనర్లదేనని పేర్కొన్నాడు. టీమ్కు అవసరమైన నలుగురైదుగురు ప్లేయర్ల గురించి ధోని చెప్పగలడని.. అంతేగానీ ఆక్షన్ అంతా అతడి కనుసన్నల్లోనే నడుస్తుందనడం కరెక్ట్ కాదన్నాడు రైనా. అన్క్యాప్డ్ ప్లేయర్ అయిన మాహీ ఈ సీజన్లో జట్టు కోసం బ్యాటింగ్, కీపింగ్, కెప్టెన్సీ.. ఇలా అన్నీ చేస్తున్నాడని మెచ్చుకున్నాడు. అయితే కోట్లకు కోట్లు తీసుకునే ఆటగాళ్లు చెత్తగా పెర్ఫార్మ్ చేస్తున్నారని.. వాళ్ల వల్లే చెపాక్లో ఎప్పుడూ చూడనిరీతిలో అనూహ్య ఓటములు ఎదురవుతున్నాయని రైనా వ్యాఖ్యానించాడు.
ఇవీ చదవండి:
పాక్తో క్రికెట్.. దాదా సెన్సేషనల్ కామెంట్స్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి