Share News

Jitesh Sharma Run-out: జితేష్ రనౌట్ వివాదం.. అప్పీల్ చేసినా నాటౌట్! ఎందుకంటే..

ABN , Publish Date - May 28 , 2025 | 04:25 PM

లక్నో-ఆర్సీబీ మ్యాచ్‌ ముగిసినా జితేష్ శర్మ రనౌట్ గురించి ఇంకా చర్చలు నడుస్తున్నాయి. జితేష్ ఔటా.. నాటౌటా.. అనే డిస్కషన్స్ ఊపందుకున్నాయి. అసలు జితేష్ రనౌట్ విషయంలో రూల్స్ ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం..

Jitesh Sharma Run-out: జితేష్ రనౌట్ వివాదం.. అప్పీల్ చేసినా నాటౌట్! ఎందుకంటే..
LSG vs RCB

ఉత్కంఠభరిత పోరులో లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఏకనా స్టేడియంలో జరిగిన ఐపీఎల్-2025 ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఎల్‌ఎస్‌జీని 6 వికెట్ల తేడాతో మట్టికరిపించింది ఆర్సీబీ. లక్నో సంధించిన 227 పరుగుల భారీ లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి 18.4 ఓవర్లలో చేజ్ చేసేసింది బెంగళూరు. 33 బంతుల్లో 85 పరుగుల విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన జితేష్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అయితే జితేష్ బ్యాటింగ్ సమయంలో చాలా అనూహ్య ఘటనలు జరిగాయి. ఒకసారి దిగ్వేష్ రాఠీ బౌలింగ్‌లో ఔట్ అవ్వకుండా తప్పించుకున్నాడు. మళ్లీ అదే దిగ్వేష్ బౌలింగ్‌లో రనౌట్ నుంచి ఎస్కేప్ అయ్యాడు. ఈ ఔట్ విషయంలో పంత్ అప్పీల్ చేయలేదు. కానీ అతడు అప్పీల్ చేసినా జితేష్ నాటౌట్‌ అయ్యేవాడు. దీనికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..


అసలేం జరిగిందంటే..

ఆర్సీబీ ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో బౌలింగ్‌కు దిగాడు దిగ్వేష్. ఆ సమయంలో జితేష్ నాన్‌స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్నాడు. అప్పటికే జితేష్ ఓ క్యాచ్ ఔట్ నుంచి తప్పించుకున్నాడు. దిగ్వేష్ వేసిన బంతిని బ్యాక్ ఫుట్ నోబాల్‌గా ప్రకటించాడు అంపైర్. ఔట్ మిస్ అవడంతో ఎలాగైనా జితేష్‌ను పెవిలియన్‌కు పంపాలని డిసైడ్ అయిన ప్రత్యర్థి బౌలర్.. ఈసారి మన్కడింగ్ ఆయుధాన్ని ప్రయోగించాడు. నాన్‌స్ట్రయికింగ్ ఎండ్ నుంచి జితేష్ కాస్త ముందుకు రావడాన్ని గమనించి తర్వాతి బంతి వేయబోయి వెనక్కి వచ్చి స్టంప్స్‌ను గిరాటేశాడు. దీంతో అంతా జితేష్ ఔట్ అనుకున్నారు. కానీ అంపైర్ ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ఈ తరుణంలో ఎల్‌ఎస్‌జీకి థర్డ్ అంపైర్‌కు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. కానీ ఆ జట్టు సారథి పంత్ అప్పీల్ చేయలేదు.


ఔటా.. నాటౌటా..!

మన్కడింగ్ విషయంలో పంత్ వెనక్కి తగ్గడంతో అతడి క్రీడాస్ఫూర్తిని జితేష్ శర్మ మెచ్చుకున్నాడు. అయితే రూల్స్ ప్రకారం ఒకవేళ లక్నో అప్పీల్ చేసినా జితేష్ నాటౌట్‌గానే ఉండేవాడు. ఎందుకంటే నిబంధనల ప్రకారం మన్కడింగ్ చేయాలంటే బౌలర్ యాక్షన్ పూర్తవక ముందే స్టంప్స్‌ను పడేయాలి. అలాగే బంతిని కూడా రిలీజ్ చేయకూడదు. కానీ నిన్నటి మ్యాచ్‌లో దిగ్వేష్ దాదాపుగా బౌలింగ్ యాక్షన్ కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత స్టంప్స్‌ను గిరాటేశాడు. ఒక బౌలర్ తన యాక్షన్ పూర్తి చేసినట్లు అనిపిస్తే రనౌట్ ఇవ్వరు. అందుకే అది నాటౌట్ అని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. బౌలింగ్ వేస్తున్నట్లు చేసి కాస్త ముందే వికెట్లను గిరాటేస్తే మన్కడింగ్ అప్పీల్‌‌కు చాన్స్ ఉంటుందని.. అప్పుడు అంపైర్లు కూడా ఆ రిక్వెస్ట్‌ను పరిగణనలోకి తీసుకుంటారని చెబుతున్నారు.


ఇవీ చదవండి:

ఆ మాటే గెలిపించింది

పంత్‌ జీతం కట్!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 28 , 2025 | 04:34 PM