Jasprit Bumrah: బుమ్రా విషయంలో బేఫికర్.. కోచ్ మాటతో ఫ్యాన్స్ ఖుషీ!
ABN , Publish Date - Jul 01 , 2025 | 09:43 AM
టీమిండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా రెండో టెస్టులో ఆడతాడా? లేదా? అనేది సస్పెన్స్గా మారింది. వర్క్ లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా అతడికి విశ్రాంతి ఇస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై అసిస్టెంట్ కోచ్ డొషేట్ క్లారిటీ ఇచ్చాడు.

ఎడ్జ్బాస్టన్ టెస్ట్కు సర్వం సిద్ధమైంది. జులై 2వ తేదీ నుంచి జరిగే ఈ మ్యాచ్లో దుమ్మురేపాలని చూస్తోంది టీమిండియా. లీడ్స్ టెస్ట్లో ఎదురైన ఓటమికి ఇక్కడ ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది గిల్ సేన. ఇంగ్లండ్ను చావుదెబ్బ తీసి 1-1తో సిరీస్ను సమం చేయాలని చూస్తోంది. అందుకోసం బౌలింగ్ లైనప్లో భారీ మార్పులు చేస్తోంది. పేసర్లతో పాటు ఈసారి బలమైన స్పిన్నర్లను రంగంలోకి దింపుతోంది. అయితే అంతా బాగానే ఉన్నా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రాను ఆడిస్తారా? లేదా? అనేది స్పష్టత లేకుండా పోయింది. వర్క్ లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడం ఖాయమని వినిపిస్తోంది. ఈ విషయంపై తేల్చేశాడు భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డొషేట్. అతడేం అన్నాడంటే..
తప్పకుండా ఆడిస్తాం..
రెండో టెస్టుకు బుమ్రా కచ్చితంగా అందుబాటులో ఉంటాడని ర్యాన్ టెన్ డొషేట్ అన్నాడు. 5 టెస్టుల్లో మూడు మాత్రమే ఆడగలడని, అయితే గత మ్యాచ్ తర్వాత అతడికి కోలుకునేందుకు 8 రోజుల సమయం దొరికిందన్నాడు అసిస్టెంట్ కోచ్. బుమ్రాను బరిలోకి దించాలా? వద్దా? అనేది పరిస్థితులు, వర్క్ లోడ్ను దృష్టిలో పెట్టుకొని నిర్ణయిస్తామని చెప్పుకొచ్చాడు. టెక్నికల్గా బుమ్రా సెలెక్షన్కు అందుబాటులో ఉన్నాడని.. అతడు బరిలోకి దిగితే టీమ్కు లాభం చేకూరుతుందని భావిస్తే తప్పకుండా ఆడిస్తామని డొషేట్ పేర్కొన్నాడు.
సస్పెన్స్ కంటిన్యూ..
ప్లేయింగ్ ఎలెవన్ విషయంలో ఏ నిర్ణయమైనా వాతావరణం, పిచ్ను బట్టే తీసుకుంటామని ర్యాన్ టెన్ డొషేట్ తెలిపాడు. ఎడ్జ్బాస్టన్ టెస్ట్లో ఇద్దరు స్పిన్నర్లను ఆడించాలని అనుకుంటున్నామని టీమిండియా అసిస్టెంట్ కోచ్ చెప్పుకొచ్చాడు. అయితే దీనిపై ఇప్పుడే ఏమీ చెప్పలేమంటూ సస్పెన్స్లో పెట్టేశాడు. రవీంద్ర జడేజాతో పాటు కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారని డొషేట్ మెచ్చుకున్నాడు. సుందర్ బ్యాటింగ్లో కూడా రాణిస్తున్నాడని వివరించాడు. మొత్తానికి అటు బుమ్రాతో పాటు ఇటు ఇద్దరు స్పిన్నర్లను ఆడిస్తామంటూ కొంత స్పష్టత ఇచ్చాడు డొషేట్. అతడు చెప్పినట్లే జరిగితే బుమ్రాతో పాటు ఇద్దరు స్పిన్నర్లు, మరో ఇద్దరు పేసర్లతో భారత బౌలింగ్ యూనిట్ రంగంలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇవీ చదవండి:
ట్రేడ్మార్క్గా కెప్టెన్ కూల్
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి