Bengaluru Stumpede: ప్రాణాలు తీస్తున్న తొక్కిసలాటలు.. వీటి బారి నుంచి తప్పించుకోండిలా..!
ABN , Publish Date - Jun 07 , 2025 | 03:44 PM
బెంగళూరు తొక్కిసలాట ఘటనతో ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడింది. అభిమాన క్రికెటర్ల సెలబ్రేషన్స్లో పాలుపంచుకుందామని వెళ్లిన ఫ్యాన్స్.. విగతజీవులుగా మారడం అందర్నీ తీవ్రంగా కలచివేసింది.

జూన్ 3, 2025.. ఈ తేదీని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. 18 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఐపీఎల్ ట్రోఫీ కల ఆ రోజు నిజమైంది. పంజాబ్ కింగ్స్ను ఓడించి కప్పును కైవసం చేసుకుంది పాటిదార్ సేన. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. కోహ్లీ కప్పు పట్టుకొని సంబురాలు చేసుకుంటే తామే అందుకున్నట్లు మురిసిపోయారు. వీధుల్లోకి వచ్చి ఆర్సీబీ.. ఆర్సీబీ.. అని కేకలు వేశారు. మరుసటి రోజు విక్టరీ పరేడ్ అనగానే లక్షలాదిగా తరలివచ్చారు. అభిమాన క్రికెటర్లతో కలసి సెలబ్రేట్ చేసుకుందామని భావించారు. కానీ విగతజీవులుగా మారారు. భారీ తొక్కిసలాటలో 11 మంది ఫ్యాన్స్ కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఇలాంటి తొక్కిసలాటల నుంచి ఎలా తప్పించుకోవాలో ఇప్పుడు చూద్దాం..
ఈ తేదీనీ మర్చిపోరు..
కప్పు వచ్చింది కాబట్టి జూన్ 3ని మర్చిపోలేరు. అదే సమయంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చిన జూన్ 4వ తేదీనీ ఎవరూ అంత సులువుగా మర్చిపోలేరనే చెప్పాలి. ఒకవైపు చిన్నస్వామి స్టేడియం లోపల ఆర్సీబీ సెలబ్రేషన్స్లో మునిగిపోతే.. మరోవైపు బయట భారీ తొక్కిసలాట చోటుచేసుకోవడంతో 11 మంది చనిపోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. దేశం మొత్తాన్ని తీవ్రంగా కలచివేసిన ఈ ఘటనతో తొక్కిసలాటల గురించి చర్చలు ఊపందుకున్నాయి. భారీ కార్యక్రమాలను నిర్వహించాలనుకునేవారు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటున్నారు. అదే సమయంలో భారీ జనసమూహాలకు వెళ్లేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి వాళ్లు ఈ 5 విషయాలు పాటించాలి.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
తొక్కిసలాట బారిన పడకుండా ఉండాలంటే అందులో చిక్కుకోకుండా ఉండటమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ గుంపులో గానీ ఇరుక్కుంటే కళ్లు, చెవులు బాగా తెరిచి ఉంచడం.. విపత్తు సంకేతాల కోసం ఎదురు చూడటం, ఏదైనా అనూహ్య ఘటన జరుగుతున్నట్లు అనిపిస్తే వెంటనే స్పందించడం లాంటివి చేయాలని అంటున్నారు.
బిగ్ ఈవెంట్స్కు వెళ్లినప్పుడు ఎంట్రీ, ఎగ్జిట్తో పాటు ఇతర గేట్లు, ఫెన్సింగ్ లాంటివి ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి. అలాగే జనాలు ఎటువైపు పరుగులు తీస్తున్నారో గమనించాలి.
తొక్కిసలాట నుంచి తప్పించుకోవాలంటే చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాంటి ఘటనలు చోటుచేసుకున్నప్పుడు ఎంత త్వరగా అలర్ట్ అయితే బయటపడటం అంత ఈజీ అవుతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.
నో ఫియర్..
తొక్కిసలాటల్లో చాలా మంది కిందపడే ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి భారీగా గుమిగూడిన జనసందోహంలో మీరు గనుక ఉంటే కిందపడకుండా ఉండాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. మునివేళ్లపై నిల్చొని అయినా సరే శరీరాన్ని అదుపు చేసుకోవాలని అంటున్నారు.
జనసందోహం ఎక్కువగా ఎటువైపు వెళ్తే మనమూ అటు వైపు వెళ్లడమే బెటర్ అని నిపుణులు అంటున్నారు. గుంపునకు వ్యతిరేక దిశలో వెళ్తే కిందపడే అవకాశాలు ఎక్కువని చెబుతున్నారు.
తొక్కిసలాటల్లో ఊపిరిపీల్చుకోవడం కష్టంగా మారుతుంది. ఒకేచోట ఎక్కువ మంది ఉన్నప్పుడు ఈ సమస్య ఏర్పడుతుంది. అలాంటి సమయాల్లో శ్వాసను నియంత్రించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అరవడం, గొడవపడటం లాంటివి చేస్తే శక్తి వృథా అవుతుందని, శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. గుంపును కలుపుకొని వెళ్లడం, భయాందోళనలకు లోనవ్వకుండా ఉండటం వల్ల కూడా బయటపడొచ్చని అంటున్నారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి