HCA-IPL 2025: ఐపీఎల్ టికెట్ల వ్యవహారం.. విజిలెన్స్ సంచలన నివేదిక!
ABN , Publish Date - May 27 , 2025 | 07:03 PM
ఐపీఎల్-2025 టికెట్ల వ్యవహారంలో తప్పు ఎవరిదో విజిలెన్స్ తేల్చేసింది. హెచ్సీఏ అక్రమాలపై చేసిన విచారణకు సంబంధించిన ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి పంపించింది.

వివాదాస్పదంగా మారిన ఐపీఎల్-2025 టికెట్ల వ్యవహారంపై విజిలెన్స్ విచారణ ముగిసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అక్రమాలపై విచారణ పూర్తి చేసిన విజిలెన్స్.. ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి పంపించింది. సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీపై హెచ్సీఏ సెక్రెటరీ ఒత్తిడి తీసుకొచ్చినట్లు నివేదికలో విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు. టికెట్ల కోసం ఎస్ఆర్హెచ్ యజమాన్యాన్ని ఇబ్బందులకు గురిచేసినట్లు తెలిపారు. కాగా, ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్ మ్యాచులకు సంబంధించి 10 శాతం టికెట్లను ఫ్రాంచైజీ ఫ్రీగా ఇచ్చింది. అయినా అదనంగా మరో 10 శాతం టికెట్లు కావాలని యాజమాన్యంపై హెచ్సీఏ సెక్రెటరీ ఒత్తిడి తీసుకురావడంతో వివాదం మొదలైంది.
చర్యలు తీసుకోవాల్సిందే..
ఆల్రెడీ 10 శాతం టికెట్లు ఇస్తున్నందున, అదనంగా మరో పది శాతం టికెట్లు ఇచ్చే ప్రసక్తి లేదని హెచ్సీఏకు సన్రైజర్స్ యాజమాన్యం తేల్చిచెప్పింది. అయితే ఓపెన్ మార్కెట్లో టికెట్లు కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు హెచ్సీఏ ద్వారా రిక్వెస్ట్ పెట్టడంతో టికెట్లు ఇచ్చేందుకు సన్రైజర్స్ ఒప్పుకుంది. అయినా వ్యక్తిగతంగా తనకు మరో 10 శాతం టికెట్లు కావాలని ఎస్ఆర్హెచ్పై ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే వ్యక్తిగతంగా టికెట్లు ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చిచెప్పింది సన్రైజర్స్ యాజమాన్యం. టికెట్లు ఇవ్వలేదనే కారణంతో మ్యాచుల సందర్భంగా ఎస్ఆర్హెచ్ను జగన్మోహన్ ఇబ్బందులకు గురిచేయడంతో ఈ వివాదం తారస్థాయికి చేరుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ సందర్భంగా వీఐపీ గ్యాలరీలకు హెచ్సీఏ సిబ్బంది తాళాలు వేశారు. తీవ్ర దుమారం రేపిన ఈ వివాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. దీనిపై విచారణకు విజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. విచారణ పూర్తవడంతో తాజాగా సర్కారుకు నివేదికను అందించారు. ఎస్ఆర్హెచ్ను హెచ్సీఏ తీవ్ర ఇబ్బందులకు గురిచేసినట్లుగా నివేదికలో తెలిపారు. అంతేగాక హెచ్సీఏ మీద చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు చేశారు.
ఇవీ చదవండి:
బంతికి 60 లక్షలు.. హీరోను జీరో చేశారు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి