Gautam Gambhir: తిరుమల శ్రీవారి సేవలో గంభీర్.. ఏం మొక్కుకున్నాడంటే..
ABN , Publish Date - May 18 , 2025 | 08:52 AM
భారత జట్టు హెడ్ కోచ్ గౌతం గంభీర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చిన అతడు దర్శనం అనంతరం ఆలయం బయటకు వస్తున్నప్పుడు దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇంగ్లండ్ టూర్కు ముందు దొరికిన గ్యాప్ను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నాడు భారత జట్టు హెడ్ కోచ్ గౌతం గంభీర్. కుటుంబంతో కలసి సమయం గడుపుతూనే.. ఆలయాలను కూడా సందర్శిస్తున్నాడు. ఇటీవలే ముంబైలోని ప్రసిద్ధ సిద్ధి వినాయక గుడికి వెళ్లిన గౌతీ.. తాజాగా తిరుమలను సందర్శించాడు. సతీమణి నటాషా జైన్తో పాటు కూతుళ్లు అజీన్, అనైజాతో కలసి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాడు. అనంతరం గంభీర్ దంపతులు ఆలయం నుంచి బయటకు వస్తున్న సమయంలో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టీమిండియా హెడ్ కోచ్ వరుసగా ఆలయాలను సందర్శించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో అతడు ఏం మొక్కుకున్నాడో అనే చర్చలూ ఊపందుకున్నాయి. దీని గురించి ఇప్పుడు చూద్దాం..
సవాళ్ల మీద సవాళ్లు
భారత జట్టు కోచింగ్ పగ్గాలు అందుకున్నప్పటి నుంచి సవాళ్ల మీద సవాళ్లు ఎదుర్కొంటున్నాడు గంభీర్. అతడు ఎంట్రీ ఇచ్చాక చాంపియన్స్ ట్రోఫీ-2025ని టీమిండియా కైవసం చేసుకున్నప్పటికీ టెస్టుల్లో మాత్రం వరుసగా విఫలమవుతూ వస్తోంది. గౌతీ కోచింగ్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్ల్లో ఓడటంతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకోవడంలోనూ ఫెయిల్ అయింది. దీనికి తోడు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ సుదీర్ఘ ఫార్మాట్కు రిటైర్మెంట్ ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో త్వరలో మొదలవనున్న ఇంగ్లండ్ టూర్లో భారత్ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. డబ్ల్యూటీసీ నయా సైకిల్ ఈ సిరీస్తో మొదలవుతోంది. టీమిండియాకు కొత్త కెప్టెన్ రానుండటం కూడా గమనించాల్సిన విషయం.
నిరూపించుకోవాల్సిందే..
సీనియర్లు రిటైర్మెంట్ తీసుకోవడం, కొత్త కెప్టెన్ రానుండటం, డబ్ల్యూటీసీ నయా సైకిల్ మొదలవుతుండటంతో పాటు జట్టుపై గంభీర్ అజమాయిషీ కూడా పెరగనుంది. గౌతీ కనుసన్నల్లోనే టీమ్ నడవనుందని విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇకపై అన్ని ఫార్మాట్లలోనూ జట్టును గెలిపిస్తూ పోవాలి. మరీ ముఖ్యంగా టెస్టుల్లో కోచ్గా గంభీర్ తానేంటో నిరూపించుకోవాలి. అందుకే వరుసగా ఆలయాలను అతడు సందర్శిస్తున్నాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. ఇంగ్లండ్ టూర్ నుంచి అంతా శుభం జరగాలని, టీమిండియాకు అలాగే కోచ్గా తనకు ఎదురు ఉండొద్దని భగవంతుడ్ని గౌతీ కోరుకొని ఉండొచ్చని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వినాయకుడు, బాలాజీ ఆశీస్సులతో భారత క్రికెట్కు అంతా మంచే జరగాలని చెబుతున్నారు. మరికొందరు నెటిజన్స్ మాత్రం వరుస సిరీస్ల నేపథ్యంలో ఒత్తిడి దరిచేరకుండా ప్రశాంతతను ప్రసాదించమనే గౌతీ కోరుకున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి