Ayush Mhatre: రాజస్థాన్ను భయపెట్టిన మాత్రే.. ఏం బాదాడు భయ్యా!
ABN , Publish Date - May 20 , 2025 | 08:21 PM
రాజస్థాన్తో మ్యాచ్లో చెలరేగిపోయాడు సీఎస్కే ఓపెనర్ ఆయుష్ మాత్రే. అనుభవం ఉన్న బ్యాటర్ మాదిరిగా ఆడిన మాత్రే.. బౌండరీల మీద బౌండరీలు బాదుతూ ప్రత్యర్థులను ఓ ఆటాడుకున్నాడు.

రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ యువ ఓపెనర్ ఆయుష్ మాత్రే చెలరేగిపోయాడు. ఆకాశమే హద్దుగా బౌండరీల మీద బౌండరీలు కొడుతూ ప్రత్యర్థి బౌలర్లను భయపెట్టాడీ 17 ఏళ్ల బ్యాటర్. 20 బంతుల్లోనే 43 పరుగులు చేశాడు మాత్రే. ఇందులో 8 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. 215 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసిన ఆయుష్.. తుషార్ దేశ్పాండే, యుధ్వీర్ సింగ్ను చావబాదాడు. చెత్త బంతుల్ని శిక్షించడమే గాక మంచి డెలివరీస్ను కూడా బౌండరీకి తరలించాడతను. అయితే మాత్రే ఔట్ అవడంతో సీఎస్కే ఇన్నింగ్స్ పేకమేడను తలపించింది.
పెవిలియన్కు క్యూ!
ఆరంభంలో డెవిన్ కాన్వే, ఉర్విల్ పటేల్ ఇద్దరూ త్వరగానే ఔట్ అయ్యారు. 12 పరుగులకే వీళ్లు పెవిలియన్ చేరారు. అయినా భయపడకుండా సీనియర్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ (13) సాయంతో హిట్టింగ్కు దిగాడు ఆయుష్ మాత్రే. అయితే అతడు ఔట్ అవడంతో చెన్నై బ్యాటింగ్ భారీ కుదుపునకు లోనైంది. ఆ తర్వాత వచ్చిన రవీంద్ర జడేజా (1)తో పాటు అశ్విన్ వెంటవెంటనే ఔట్ అయ్యారు. దీంతో 2 వికెట్లకు 67 పరుగులతో ఉన్న టీమ్ కాస్తా 5 వికెట్లకు 78 పరుగులతో తీవ్ర కష్టాల్లో పడింది. ప్రస్తుతం డెవాల్డ్ బ్రేవిస్ (9 నాటౌట్), శివమ్ దూబె (0 నాటౌట్) క్రీజులో ఉన్నారు. వీళ్లిద్దరూ ఎంత సేపు క్రీజులో ఉంటారనే దాన్ని బట్టే సీఎస్కే భారీ స్కోరు ఆశలు ఆధారపడి ఉన్నాయి. కెప్టెన్ ధోని ఇంకా బ్యాటింగ్కు రాలేదు. చివర్లో మాహీ హిట్టింగ్కు దిగక తప్పదు. మరి.. చెన్నై ఎంత స్కోరు చేస్తుందో చూడాలి.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి