BCCI-Operation Sindoor: బీసీసీఐ గొప్ప మనసు.. ఆపరేషన్ సిందూర్ హీరోల కోసం..!
ABN , Publish Date - May 27 , 2025 | 05:00 PM
భారత క్రికెట్ బోర్డు గొప్ప నిర్ణయం తీసుకుంది. ఆపరేషన్ సిందూర్ హీరోలను సత్కరించేందుకు బోర్డు సిద్ధమైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఆపరేషన్ సిందూర్తో శత్రుదేశం పాకిస్థాన్ను గడగడలాడించారు భారత సైనికులు. పహల్గాం దాడికి ప్రతీకారంగా పాక్ ప్రేరేపిత ఉగ్రస్థావరాల మీద అటాక్ చేసి దాదాపుగా 200 మంది టెర్రరిస్టులను మట్టుబెట్టారు. ఆ తర్వాత ఎదురుదాడికి దిగిన పాకిస్థాన్కు మూడు చెరువుల నీళ్లు తాగించారు. శత్రుదేశ డ్రోన్లు, మిసైళ్లను గాల్లోనే పేల్చేశారు మన సైనికులు. అనంతరం పాక్ భూభాగంలోకి దూసుకెళ్లి వాళ్ల వైమానిక పోస్టులను ధ్వంసం చేశారు. మళ్లీ భారత్ వైపు చూడాలంటే భయపడేలా చేశారు. అలాంటి భద్రతా బలగాలను సత్కరించాలని నిర్ణయించింది భారత క్రికెట్ బోర్డు. ఆపరేషన్ సిందూర్ హీరోలను స్మరించుకునేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఇండియన్ ప్రీమియర్ లీగ్ను వేదికగా చేసుకోవాలని డిసైడ్ అయింది. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
బిగ్ సెల్యూట్
ఐపీఎల్-2025 చివరి దశకు చేరుకుంది. జూన్ 3వ తేదీన క్యాష్ రిచ్ లీగ్ ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్ రోజు భారత త్రివిధ దళాల సేవల్ని స్మరించుకోనుంది బీసీసీఐ. ఆపరేషన్ సిందూర్ను విజయవంతంగా నిర్వహించిన త్రివిద దళాల అధిపతులను ఫైనల్ మ్యాచ్కు ఆహ్వానించింది బీసీసీఐ. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్తో పాటు చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠిని ఫైనల్ మ్యాచ్ ముగింపు వేడుకకు రావాల్సిందిగా కోరింది. ‘భారత త్రివిద దళాల ధైర్యసాహసాలు, నిస్వార్థమైన సేవలకు బీసీసీఐ సెల్యూట్ చేస్తోంది. ఈ దేశాన్ని రక్షించేందుకు ఆపరేషన్ సిందూర్తో వాళ్లు చేసిన వీరోచిత పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకం. జవాన్ల సేవలకు నివాళిగా, భద్రతా బలగాలను గౌరవించుకునేందుకు ఐపీఎల్ ఫైనల్ ముగింపు వేడుకలను అంకితం చేయాలని నిర్ణయించుకున్నాం’ అని బీసీసీఐ సెక్రెటరీ దేవజిత్ సైకియా తెలిపారు. కాగా, సైనికుల సేవల్ని స్మరించుకుంటూ వేడుకల్ని అంకితం చేయడంపై సోషల్ మీడియాలో నెటిజన్స్ స్పందిస్తున్నారు. బీసీసీఐ గొప్ప పని చేస్తోందని.. జవాన్లను గౌరవించుకోవడం మన విధి అని అంటున్నారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి