Share News

Pak Spy: జ్యోతి మల్హోత్రాతో సంబంధం ఉన్న మరో యూట్యూబర్ అరెస్టు

ABN , Publish Date - Jun 04 , 2025 | 02:51 PM

గూఢచర్యం కేసులో ఇటీవల అరెస్టయిన హిసార్‌కు చెందిన 33 ఏళ్ల మల్హోత్రాతో సింగ్‌కు సంబంధాలున్నాయని, మల్హోత్రా అరెస్టుతో సింగ్ తనకు పాక్‌స్థాన్ ఆపరేటివ్స్‌తో ఉన్న సంబంధాలకు చెందిన సమాచారాన్ని డిలీట్ చేసేందుకు ప్రయత్నించాడని డీజీపీ తెలిపారు.

Pak Spy: జ్యోతి మల్హోత్రాతో సంబంధం ఉన్న మరో యూట్యూబర్ అరెస్టు

చండీగఢ్: పాక్ గూఢచర్యం నెట్‌వర్క్‌ (Spy Network)‌‌పై కేంద్రం కొరడా ఝళిపిస్తోంది. దీంతో పలు రాష్ట్రాల్లో వరుస అరెస్టులు కొనసాగుతున్నాయి. పాకిస్థాన్‌తో సంబంధాలు సాగిస్తున్న ఆరోపణలపై యూట్యూబర్ జస్బీర్ సింగ్‌ (Jasbir Singh)ను పంజాబ్ పోలీసులు బుధవారంనాడు అరెస్టు చేశారు. హర్యానా ఇన్‌ఫ్లుయెన్సర్ జ్యోతి మల్హోత్రాను ఇదే ఆరోపణలపై ఇటీవల అరెస్టు చేశారు.


అధికారుల వివరాల ప్రకారం, పంజాబ్‌లోని రూప్‌నగర్ జిల్లా మహ్లాన్ గ్రామానికి చెందిన జస్బీర్ సింగ్ 'జాన్ మహల్' పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్నాడు. దీనికి 11 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. మే 13న ఇండియా నుంచి బహిష్కరించిన పాకిస్థాన్ హైకమిషన్ మాజీ అధికారి షకీర్క అలియాస్ జుట్ రాంధావాతో సహా పలువురు పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ (PIOs)తో జస్బీర్ సింగ్‌కు సంబంధాలున్నట్టు కనుగొన్నారు. పాక్ రాయబార కార్యాలయం అధికారి ఎహసాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్‌తో సింగ్‌కు సంబంధాలున్నాయని, డానిష్ ఆహ్వానం మేరకు ఢిల్లీలో జరిగిన పాకిస్థాన్ జాతీయ దినోత్సవంలో కూడా సింగ్ పాల్గొన్నాడని, అక్కడ పాకిస్థాన్ ఆర్మీ ఆధికారులు, వ్లోగర్లను సింగ్ కలుసుకున్నాడని విచారణలో తేలింది. 2020,2021,2024లో మూడు సందర్భాల్లో సింగ్ పాకిస్థాన్‌కు వెళ్లాడని, ఆయనకు పాకిస్థాన్ బేస్డ్ కాంటాక్టులు ఉన్నట్టు అతని వద్ద స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాల ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలిందని పంజాబ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) గౌరవ్ యాదవ్ తెలిపారు.


గూఢచర్యం కేసులో ఇటీవల అరెస్టయిన హిసార్‌కు చెందిన 33 ఏళ్ల మల్హోత్రాతో సింగ్‌కు సంబంధాలున్నాయని, మల్హోత్రా అరెస్టుతో సింగ్ తనకు పాకిస్థాన్ ఆపరేటివ్స్‌తో ఉన్న సంబంధాలకు చెందిన సమాచారాన్ని డిలీట్ చేసేందుకు ప్రయత్నించాడని డీజీపీ తెలిపారు. సింగ్‌పై మొహాలీలోని స్టేట్ స్పెషల్ ఆపరేషన్ సెల్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి, అనంతరం ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్‌తో సంబంధం ఉన్న గూఢచార్య నెట్‌వర్క్‌పై అధికారులు ఉక్కుపిడికిలి బిగించారు.


ఇవి కూడా చదవండి..

జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు

ఓవైపు వివాదం.. మరోవైపు సర్కార్ అండ.. కమల్‌కు గుడ్‌న్యూస్

For National News And Telugu News

Updated Date - Jun 04 , 2025 | 04:39 PM