Mamata Banerjee: యోగి అతిపెద్ద భోగి.. యూపీ సీఎంపై మమత ఫైర్, బీజేపీ కౌంటర్
ABN , Publish Date - Apr 16 , 2025 | 04:01 PM
మహాకుంభ్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, ఉత్తర ప్రదేశ్లో అనేక మందిని ఎన్కౌంటర్ చేశారని, ప్రజలు ర్యాలీలు చేయడానికి కూడా యోగి అనుమతించరని మమతా బెనర్జీ విమర్శించారు. బెంగాల్లో ఎంతో స్వేచ్ఛ ఉందని చెప్పారు.

కోల్కతా: వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్లో అల్లర్లు, హింసాకాండ చెలరేగడంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) చేసిన వ్యాఖ్యలను టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) తిప్పికొట్టారు. ''ఆయన మహా భోగి'' అంటూ విమర్శలు గుప్పించారు. ముర్షీదాబాద్లో హింసాకాడ అనంతరం ఇమామ్లతో మమత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, యోగి చాలా పెద్ద మాటలు చెబుతారని, ఆయన అతిపెద్ద భోగి అని అన్నారు. మహాకుంభ్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, ఉత్తర ప్రదేశ్లో అనేక మందిని ఎన్కౌంటర్ చేశారని, ప్రజలు ర్యాలీలు చేయడానికి కూడా యోగి అనుమతించరని విమర్శించారు. బెంగాల్లో ఎంతో స్వేచ్ఛ ఉందని చెప్పారు.
Waqf Bill Supreme Court hearing: వక్ఫ్ బిల్లు చట్టభద్దతపై సుప్రీం కోర్టులో విచారణ అప్డేట్స్
కేంద్రంపై నిప్పులు
కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిందని, ''గోడి మీడియా'' కేవలం బెంగాల్కు వ్యతిరేకంగాను, తనకు వ్యతిరేకంగాను మాట్లాడటమే పనిగా పెట్టుకుందని మమత విమర్శించారు. "మీరు ఏదైనా చెప్పదలచుకుంటే నా ముందుకు వచ్చి చెప్పండి. మీరు తప్పుడు వార్తలు రాస్తున్నారు. కొందరు బయట నుంచి వచ్చిన వ్యక్తులు నకిలీ వీడియోలు చూపిస్తున్నారు. వారిని మేము పట్టుకున్నాం. వారి వద్ద పట్టుకున్న 8 వీడియోల్లో కొన్ని కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, బీహార్, రాజస్థాన్కు చెందినవి ఉన్నాయి. వాళ్లు బీహార్ ప్రతిష్ఠను దెబ్బతీయాలనుకుంటున్నారు. అందుకు వాళ్లు సిగ్గుపడాలి" అని మమతా బెనర్జీ మండిపడ్డారు.
దీనికి ముందు ముర్షీదాబాద్ హింసాకాండపై యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. బెంగాల్ తగులబడుతుంటే ముఖ్యమంత్రి మౌనంగా ఉన్నారని విమర్శించారు అల్లర్లకు పాల్పడే వారికి పూర్తి పూర్తి స్వేచ్ఛనిచ్చి చోద్యం చూస్తున్నారని అన్నారు. ఆందోళనకారులను శాంతి దూతలుగా భావిస్తున్నారని విమర్శించారు. బెంగాల్లో ఇంత విధ్వంసం జరుగుతుంటే ప్రజల కోసం పోరాడుతున్నామని చెప్పుకునే కాంగ్రెస్, సమాజ్వాదీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి బెంగాల్కు భద్రతా దళాలను పంపిన కేంద్రానికి కృతజ్ఞతలు చెప్పారు.
మమత వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్
యోగిని మహా భోగి అంటూ మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తిప్పికొట్టంది. అల్లర్లను మమతా బెనర్జీ ప్రోత్సహిస్తున్నందునే యోగి వ్యాఖ్యలు ఆమెకు నచ్చడం లేదని యూపీ బీజేపీ ప్రతినిధి రాకేష్ త్రిపాఠి అన్నారు. అల్లర్ల నుంచి బెంగాల్కు విముక్తి కలిగించాలని యోగి పేర్కొన్నారని, ఆయనపై మమత వ్యాఖ్యలు సరికాదని చెప్పారు. ఉత్తరప్రదేశ్ మోడల్ను చూసి మమత నేర్చుకోవాలన్నారు. కాగా, యోగి అదిత్యనాథ్ పశ్చిమబెంగాల్ వచ్చి ప్రజలనుద్దేశించి మాట్లాడాలని బెంగాల్ అసెంబ్లీలో వివక్ష నేత సువేందు అధికారి కోరారు. బెంగాల్లో అరాచకంపై మాట్లాడిన యోగికి, బెంగాల్కు వచ్చిన ఎన్హెచ్ఆర్సీ, ఎన్సీడబ్ల్యూకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి...