Air crash: వీడని మిస్టరీ!
ABN , Publish Date - Jun 14 , 2025 | 05:30 AM
ఎంతో ఆనందంగా లండన్కు బయలు దేరిన 241 మంది జీవితాలను కాల్చి బుగ్గి చేసిన ఘోర విమాన ప్రమాదంపై మిస్టరీ ముడి వీడలేదు. ప్రమాద ఘటన జరిగి రెండు రోజులు అవుతున్నా..

రంగంలోకి ఎన్ఐఏ, ఏఏఐబీ.. వైమానిక రంగ నిపుణులతో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు
ఎయిర్ ఇండియా నిర్వహణ లోపాలపై దృష్టి
ఇంజన్ల వైఫల్యం, ఇంధనం కల్తీ.. జరిగి ఉండవచ్చని పలువురు పైలెట్ల సందేహాలు
హాస్టల్ శిథిలాల కింద బ్లాక్బాక్స్ను గుర్తించిన ఏటీఎస్ అధికారులు
వెయ్యి డిగ్రీల వేడిని తట్టుకుని చెక్కు చెదరని వైనం.. దాంతోనే కారణాలు వెలుగులోకి!
ఎయిరిండియాలో బోయింగ్ల కుదింపు?
తొలుత సాంకేతిక తనిఖీలకు కేంద్రం ఆదేశం
విమానాలు బయల్దేరడానికి ముందే ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించాలని స్పష్టీకరణ
దేశంలోని అన్ని విమానయాన సంస్థల్లో 209 బోయింగ్లు.. ఎయిరిండియా వద్దే 135
న్యూఢిల్లీ, జూన్ 13: ఎంతో ఆనందంగా లండన్కు బయలు దేరిన 241 మంది జీవితాలను కాల్చి బుగ్గి చేసిన ఘోర విమాన ప్రమాదంపై మిస్టరీ ముడి వీడలేదు. ప్రమాద ఘటన జరిగి రెండు రోజులు అవుతున్నా.. దీనికి గల కారణాలు అంతుచిక్కలేదు. సాంకేతిక లోపమా? పక్షులు ఢీకొనడంతోనే ఇంత పెద్ద ప్రమాదం సంభవించిందా? అసలు ఏం జరిగింది? అనే విషయాలపై పౌర విమానయాన శాఖకు స్పష్టత రాలేదు. ఈ క్రమంలో ప్రమాద కారణాలను అన్వేషించేందుకు జాతీయ దర్యాప్తు బృందం(ఎన్ఐఏ) అధికారులు రంగంలోకి దిగారు. అదేవిధంగా పౌర విమానయాన సంస్థకే చెందిన ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఏఏఐబీ) అధికారులు విచారణ ప్రారంభించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం.. వైమానిక రంగ నిపుణులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని కూడా నియమించింది. ఈ కమిటీ అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ రూపొందించిన ప్రోటోకాల్ ప్రకారం విచారణ చేస్తుందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను అన్వేషించేందుకు అన్ని కోణాల్లోనూ విచారణ చేయనున్నట్టు చెప్పారు. అదేవిధంగా వైమానిక రంగం భద్రత, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాల నుంచి ఎలా బయటపడాలనే అంశాలపై కూడా ఉన్నత స్థాయి కమిటీ దృష్టిసారిస్తుందని వివరించారు. ఇదిలావుంటే, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అహ్మదాబాద్లోని సివిల్ ఆసుపత్రిని సందర్శించి.. చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
ఎన్ఐఏ సహా..
జాతీయ దర్యాప్తు బృందం(ఎన్ఐఏ) అధికారులు సహా కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే ఇతర ఏజెన్సీలకు చెందిన అధికారులు కూడా అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాద స్థలాన్ని శుక్రవారం పరిశీలించారు. అయితే, వారు ఏయే అంశాలపై దృష్టి పెట్టారు? ఏకోణంలో విచారణ చేపట్టారనే విషయాలను గోప్యంగా ఉంచారు. మరోవైపు, ఈ ప్రమాదంలో 241 మంది ప్రాణాలు కోల్పోయారని ఎయిర్ ఇండియా ప్రకటించింది. మొత్తం విమానంలో ప్రయాణించిన వారిలో ఒకే ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని తెలిపింది. ఇక, ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేసన్ బ్యూరో(ఏఏఐబీ) అధికారులు ఘటనా స్థలంలోని అణువణువునూ నిశితంగా పరిశీలించారు. అదేవిధంగా ప్రభుత్వం సహా ఎయిర్ ఇండియా అధికారులు విమాన ప్రమాద సమయంలో ఇంజన్, ల్యాండింగ్ గేర్ పరిస్థితిపై ప్రత్యేకంగా విచారణ సాగిస్తున్నాయి. కుప్పకూలిన విమానం నిర్వహణ సమస్యలు సహా ఎయిర్ ఇండియా సంస్థ లొసుగులు, ఇతర అనేక అంశాలపైనా దృషించారు.
పైలట్లు ఏమన్నారంటే..
ఈ రెండు వీడియోలను వీక్షించిన పైలట్లు ల్యాండింగ్ గేర్పై అనుమానాలు వ్యక్తం చేశారు. అదేసమయంలో ఇంజన్ల విఫలం, ఇంధనం కల్తీపైనా సందేహాలు వెలిబుచ్చారు. విమానం గగనతలం వైపు ఎగిరిన ఐదు సెకన్లలోనే సాధారణంగా పైలట్ ల్యాండింగ్ గేర్ను పైకి ఎత్తుతారని కెప్టెన్ అమిత్ సింగ్ చెప్పారు. గగన తలంలో సానుకూల ఎత్తుకు చేరుకున్న వెంటనే ల్యాండింగ్ గేర్ను సాధారణ స్థితికి తీసుకువస్తారని మాజీ కెప్టెన్ మనోజ్ హతీ తెలిపారు. ల్యాండింగ్ గేర్ను వెనక్కి తీసుకోవడం వల్ల విమానం పైకి ఎగరడానికి సహాయపడే మృదువైన ఏరోడైనమిక్ ప్రవాహం ఏర్పడుతుందని వివరించారు. ‘‘పైలట్లు పరధ్యానంలో ఉంటే.. ఒక్కొక్కసారి గేర్ అప్ చేయడం మరిచిపోవచ్చు. ప్రస్తుతం జరిగిన ఘటనలో రెండు ఇంజన్లు విఫలమైనా అయి ఉండాలి. లేదా పక్షులైనా ఢీకొట్టి ఉండాలి. లేదా రెండూ జరిగి ఉండాలి. ఈ విమానం రన్వే చివరకు వచ్చే సరికి శక్తిని కూడగట్టుకోలేక పోయినట్టు తెలుస్తోంది(వీడియోల ఆధారంగా). బహుశ ఇంజన్లలో సమస్యలు వచ్చి ఉంటాయి.’’ అని కెప్టెన్ అమిత్ సింగ్ వివరించారు. ‘‘వీడియోలను బట్టి చూస్తే.. విమానం వేగం కోల్పోయినట్టు స్పష్టంగా తెలుస్తోంది. దీనికి ఇంజన్లు విఫలం కావడమే కారణం కావొచ్చు. అదేసమయంలో ఇంధనం కల్తీ మరో కారణమైన ఉండొచ్చు.’’ అని మనో హతీ పేర్కొన్నారు. మరికొందరు సీనియర్ పైలెట్లు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంజన్లు విఫలం కావడం లేదా, ఇంధనం కల్తీ కావడం వల్లే ఈ ఘోరం సంభవించి ఉంటుందని పేర్కొన్నారు. అయితే.. గత ఏడు దశాబ్దాల కాలంలో జరిగిన ఏడు విమాన ప్రమాదాలను విశ్లేషిస్తే ఇంజన్లు విఫలం కావడం అనేది అత్యంత అరుదేనని తెలిపారు. మరోవైపు, డీజీసీఏ ఇచ్చిన ప్రకటనలో రెండు ఇంజన్లు విఫలమయ్యాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే ‘మేడే కాల్’ వచ్చిందని, నిర్ణీత వేగాన్ని అందుకున్నాక ఇంజన్లలో సమస్య వచ్చి ఉంటుందని పేర్కొంది.
నివేదిక ఎప్పుడు?
వైమానిక నిబంధన 13 ప్రకారం ప్రాథమిక దర్యాప్తు నివేదికను ఘటన జరిగిన నాటి నుంచి 30 రోజుల్లో సిద్ధం చేయాలి. కానీ, అంతర్జాతీయ పౌరవిమానయాన సంస్థ(ఐసీఏవో) మాత్రం ఈ విషయాన్ని ఆయా దేశాలకే వదిలి వేసింది. దర్యాప్తు నివేదికను బహిర్గతం చేయాలా? వద్దా? అనేది కూడా ప్రభుత్వ ఇష్టాన్ని బట్టే ఉంటుంది. అంతేకాదు, తుది నివేదిక ఇచ్చేందుకు ఏడాది పాటు సమయం ఉంటుంది.
‘‘వీడియోలను బట్టి చూస్తే.. విమానం వేగం కోల్పోయినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఇంజన్లు విఫలం కావడమే కారణం కావొచ్చు. దీనికి ఇంధనం కల్తీ మరో కారణమైన ఉండొచ్చు.’’ - సీనియర్ మాజీ పైలట్
కన్నీటి కథలు..!!
అహ్మదాబాద్లో గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో మరణించిన ప్రతీ ఒక్కరి ప్రయాణం వెనక ఒక్కో కథ. లండన్లో ఉన్న భార్యను కలిసేందుకు బయలుదేరిన వ్యక్తి ఒకరైతే.. భార్య అస్థికలను స్వగ్రామంలోని నదిలో కలిపి ఆమె ఆఖరి కోరిక తీర్చి లండన్ తిరుగు ప్రయాణమైన భర్త మరొకరు.. వివాహ వేడుక కోసం స్వస్థలానికి వచ్చి లండన్ తిరిగి వెళ్తూ ప్రాణాలు కోల్పోయిన ఏడు నెలల గర్భిణి ఇంకొకరు.. ఇలా ఎందరికో ఆఖరి మజిలీగా మారిన ఈ ప్రయాణం ఎన్నో కుటుంబాలను చిదిమేసింది..!!
అంజూ.. ఫ్లైట్ ఎక్కాను.. రేపటికి చేరుకుంటా!
‘‘అంజూ నేను ఫ్లైట్ ఎక్కా. విమానం బయలుదేరబోతోంది. నేను రేపు వస్తాను’’ ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణీ తన భార్య అంజలిబెన్తో చివరిగా ఫోన్లో మాట్లాడిన మాటలివి. ఆ కాసేపటికే ఆయన మరణించారు. లండన్లో ఉంటున్న తమ కుమార్తె ఇంటికి అంజలిబెన్ మే 19న వెళ్లారు. విజయ్రూపాణీ కూడా జూన్ 5న లండన్ వెళ్లేందుకు టికెట్ కూడా బుక్ చేసుకున్న విజయ్ రూపానీ.. పంజాబ్లోని లుథియానా ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. మళ్లీ జూన్ 10న ప్రయాణానికి టికెట్ బుక్ చేసుకున్నా.. ఆఖరి నిమిషంలో ప్రయాణం వాయిదా వేసుకున్నారు. చివరికి గురువారం విమానం ఎక్కి ఈ లోకాన్ని వీడారు.
భార్య అస్థికలను నదిలో కలిపేందుకు వచ్చి..
సూరత్కు చెందిన అర్జున్ పటోలియా(36) తన భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి 2009 నుంచి లండన్లోనే స్థిరపడ్డాడు. అర్జున్ భార్య భారతిబెన్ మే 23న మరణించింది. భారతి అంత్యక్రియలను అర్జున్ లండన్లోనే పూర్తి చేశాడు. అయితే, తన అస్థికలను స్వగ్రామంలోని నర్మదా నదిలో కలపాలన్న ఆమె చివరి కోరికను తీర్చేందుకు అర్జున్ సూరత్ వచ్చాడు. ఆమె అస్థికలను నదిలో కలిపాడు. తిరిగి లండన్ బయలుదేరి విమాన ప్రమాదంలో మరణించాడు. వారి పిల్లలు అనాథలుగా మిగిలారు.
తండ్రి అంత్యక్రియలకు వచ్చి...
గుజరాత్, మెహసాన్ జిల్లాలోని ఉంఝూ ప్రాంతానికి చెందిన కేతన్ పటేల్(40) లండన్లో స్థిరపడ్డారు. ఇటీవల తన తండ్రి మరణించగా.. అంత్యక్రియల కోసం 15 రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చారు. ఆ కార్యక్రమాలు ముగించుకుని తల్లి సవితాబెన్ పటేల్(70)తో కలిసి అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరారు. కానీ, ఆ విమానం కూలిపోవడంతో తల్లీకొడుకులు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
పెళ్లి కోసం వచ్చి గర్భస్థ శిశువు సహా దంపతులు..
గుజరాత్, దోల్కా జిల్లాలోని కేలియావాస్నా అనే గ్రామానికి చెందిన జినాల్ పటేల్, వైభవ్ పటేల్ది ప్రేమ వివాహం. జినాల్ ప్రస్తుతం 7నెలల గర్భిణి. తమ కుటుంబసభ్యుల్లో ఒకరి వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు ఈ జంట మే 5న లండన్ నుంచి భారత్లోని స్వగ్రామానికి వచ్చింది. గురువారం ఎయిరిండియా విమానంలో తిరుగు ప్రయాణమై వారు ప్రాణాలు కోల్పోయారు.
పెళ్లైన నాలుగు నెలలకే
ధనేరాలోని థారావ్ గ్రామానికి చెందిన సావ్దాన్ చౌదరి, థాపుబెన్కు నాలుగు నెలల క్రితమే వివాహమైంది. అహ్మదాబాద్ నుంచి ఎయిరిండియా విమానంలో లండన్ బయలుదేరిన ఈ జంట విమాన ప్రమాదంలో మరణించగా.. ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
భార్యతో కలిసి లండన్ వెళ్తూ..
గాంధీనగర్కు చెందిన గౌరవ్ బ్రహ్మభట్ గతంలో లండన్లో పని చేసేవారు. ఆ సమయంలో పరిచయమైన మహారాష్ట్రకు చెందిన కల్యాణిని పెళ్లి చేసుకున్నారు. ఢిల్లీలోని ఓ ఫార్మా కంపెనీలో ఉన్నత స్థాయి ఉద్యోగం చేస్తున్న గౌరవ్ ఇటీవల ముంబైకి బదిలీ అయ్యారు. కల్యాణి గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో ఓ కంపెనీలో పని చేస్తున్నారు. తాము తొలిసారి కలిసిన లండన్కు చాలాకాలం తర్వాత వెళ్లేందుకు ఎయిరిండియా విమానం ఎక్కిన గౌరవ్ దంపతులు ప్రమాదంలో మరణించారు.
నిశ్చితార్థం చేసుకుని తిరిగి వెళ్తూ..
గుజరాత్, బోటాడ్ జిల్లాలోని అద్తల గ్రామానికి చెందిన హార్దిక్ దేవరాజ్(27) రెండేళ్లుగా లండన్లో ఉంటూ అమెజాన్లో ఉద్యోగం చేస్తున్నాడు. సజోద్ గ్రామానికి చెందిన విభూతి అనే యువతిని లండన్లో కలిశాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకోని పెద్దలను ఒప్పించారు.. నెల రోజుల క్రితం వారు భారత్కు రాగా.. సజోద్లో నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. పెళ్లికి సమయం ఉండడంతో తిరిగి లండన్ బయలుదేరిన ఆ యువ జంట తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది.
కూతురు ఇంటికి పిలిచిందని...
గుజరాత్, ఆనంద్ జిల్లాలోని ఖంబాట్కు చెందిన హేమంత్ పాండ్యా(52), నేహాబెన్ పాండ్యా(48) దంపతులకు ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. వారి కుమార్తె పెళ్లి చేసుకుని భర్తతో కలిసి లండన్లో నివాసముంటోంది. కూతురి ఆహ్వానంతో లండన్ బయలుదేరిన పాండ్యా దంపతులు విమానం ఎక్కిన వెంటనే సెల్ఫీ తీసుకున్నారు. కానీ వారికిదే చివరి ఫొటో, ఆఖరి ప్రయాణమైంది.
లండన్ చేరగానే ఫోన్ చేస్తా నాన్నా..!!
ఫ్లైట్ బయలుదేరే టైమైంది. లండన్ చేరగానే ఫోన్ చేస్తా నాన్నా.. అహ్మదాబాద్లో కూలిన ఎయిరిండియా విమానంలోని ఎయిర్ హోస్టే్సలో ఒకరైన మిథాలీ పాటిల్ (23) తన తండ్రి మోరేశ్వర్ పాటిల్తో చివరిగా ఫోన్లో మాట్లాడిన మాటలివి. రెండేళ్లుగా ఎయిర్ హోస్టే్సగా పని చేస్తున్న మిథాలీ జీవిత ప్రయాణం హఠాత్తుగా ముగియగా.. ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
ట్రావెలింగ్ సరదా ప్రాణాలు తీసింది
వడోదరకు చెందిన నీరజ్ లవానియా(50) అపర్ణ(49) దంపతులకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ప్రతీ ఏటా ఏదో ఒక కొత్త ప్రాంతానికి వెళ్లేవారు. ఎప్పటికైనా లండన్ చూడాలన్న వారి కోరిక తీర్చుకునేందుకు అహ్మదాబాద్లో గురువారం ఎంతో ఉత్సాహంగా విమానం ఎక్కారు. విమానం ఎక్కే ముందు నీరజ్ చివరిగా తన సోదరుడు సతీ్షకు ఫోన్ చేసి తన లండన్ ప్రయాణం కోసం చెప్పాడు. ఆ తర్వాత కాసేపటికే ఆ దంపతులు చనిపోయారు. నీరజ్ దంపతుల ఏకైక కుమార్తె(16) కూడా తల్లిదండ్రులతో కలిసి వెళ్లాల్సిందే. కానీ అమ్మమ్మ(70)కు తోడుగా ఇంట్లో ఉండిపోయింది.
మరిది పెళ్లికి వచ్చి ..
వడోదరకు చెందిన సాధిక భాను(23) తన భర్త, కుమార్తె ఫాతిమా(2)తో కలిసి కొంతకాలంగా లండన్లో నివాసముంటోంది. మే 16న జరిగిన తన మరిది వివాహం కోసం కూతురు ఫాతిమాను తీసుకుని సాధిక ఇటీవల వడోదర వచ్చింది. వేడుకల తర్వాత లండన్కు తిరుగు ప్రయాణమైన సాధిక, ఫాతిమాకు కుటుంబసభ్యులు విమానాశ్రయానికి వచ్చి సాగనంపారు. కానీ వారికి అదే చివరి చూపు అయింది. ప్రమాదంలో సాధిక, చిన్నారి ఫాతిమా మరణించారు.