Share News

MK Stalin: సుప్రీంకోర్టును రాష్ట్రపతి వివరణ కోరడమా?

ABN , Publish Date - May 16 , 2025 | 04:45 AM

శాసనసభ ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా తమిళనాడు గవర్నర్‌ ఏళ్లతరబడి పెండింగ్‌లో ఉంచడాన్ని తప్పుబడుతూ తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టును రాష్ట్రపతి ద్వారా కేంద్రం వివరణ కోరటంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

MK Stalin: సుప్రీంకోర్టును రాష్ట్రపతి వివరణ కోరడమా?

  • ఇది సుప్రీంను సవాల్‌ చేయడమే బీజేపీయేతర రాష్ట్రాల అసెంబ్లీలను

  • స్తంభింపజేయాలని కేంద్రం యోచనా?

  • తమిళనాడు సీఎం స్టాలిన్‌ ధ్వజం

చెన్నై, మే 15 (ఆంధ్రజ్యోతి): శాసనసభ ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా తమిళనాడు గవర్నర్‌ ఏళ్లతరబడి పెండింగ్‌లో ఉంచడాన్ని తప్పుబడుతూ తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టును రాష్ట్రపతి ద్వారా కేంద్రం వివరణ కోరటంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకున్న ఈ చర్య ద్వారా రాష్ట్ర గవర్నర్‌ బీజేపీ ప్రోద్బలంతోనే ప్రజాస్వామయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కించపరిచేలా వ్యహరించినట్టు సుస్పష్టమవుతోందని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెలువడే చర్యలను తనకున్న విచక్షణాధికారం ద్వారా అడ్డుకునే సమర్థత కలిగిన సర్వోన్నత న్యాయస్థానానికి ప్రత్యక్ష సవాలు విసరటమే తప్ప మరొకటి కాదన్నారు. ‘బిల్లుల ఆమోదంలో నిరవధిక జాప్యాన్ని అనుమతించడం ద్వారా గవర్నర్‌ ఆటంకాలను కేంద్రప్రభుత్వం చట్టబద్దం చేయాలనుకుంటోం దా? బీజేపీయేతర రాష్ట్రాల శాసనసభలను స్తంభింపజేయాలని అనుకుంటోందా?’ అని ఆయన ప్రశ్నించారు.


మీకు అభ్యంతరం ఏమిటి!?: లెఫ్ట్‌

న్యూఢిల్లీ, మే 15: బిల్లుల ఆమోదానికి గవర్నర్లకు డెడ్‌లైన్‌ విధిస్తూ ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్రపతి ద్వారా వివరణ కోరే మార్గాన్ని కేంద్ర ప్రభుత్వం ఎంచుకోవడాన్ని వామపక్షాలు తప్పుబట్టాయి. ఈ చర్యను తమ పార్టీ ఖండిస్తోందని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ స్పష్టం చేశారు. ఇదే అంశంపై తమిళనాడు సీఎం స్టాలిన్‌ పోస్టును ప్రస్తావిస్తూ ఆయన ఎక్స్‌లో స్పందించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన చట్టసభలు రెండుసార్లు ఆమోదించి పంపిన చట్టాలను ఆమోదించడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వచ్చిన అభ్యంతరం ఏమిటని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా నిలదీశారు.

Updated Date - May 16 , 2025 | 04:45 AM