Indian Techie: భార్య, కొడుకును తుపాకీతో కాల్చి.. టెక్ వ్యవస్థాపకుడి ఆత్మహత్య..
ABN , Publish Date - Apr 29 , 2025 | 09:09 PM
కర్నాటక మండ్య జిల్లా కేఆర్పేట్ తాలూకాకు చెందిన హర్షవర్ధన్ (57) అనే టెక్ వ్యవస్థాపకుడికి భార్య శ్వేత పాణ్యం (44), ఇద్దరు కుమారులు ఉన్నారు. ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. ఇంట్లో ఉన్న హర్షవర్ధన్.. ఉన్నట్టుండి తన భార్య, 14 ఏళ్ల తన కుమారుడిని కాల్చి చంపేశాడు. ఆ తర్వాత తానూ ఆత్యహత్య చేసుకున్నాడు..

అతనో రోబోటిక్స్ కంపెనీ వ్యవస్థాపకుడు. అమెరికాలో మైక్రోసాఫ్ట్ కంపెనీలో కూడా పని చేశాడు. ఆర్థికంగా బాగా స్థిరపడిన ఆ వ్యక్తికి.. ఏ సమస్య వచ్చిపడిందో ఏమో గానీ.. ఉన్నట్టుండి తన భార్య, కొడుకును కాల్చి.. తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
అమెరికా వాషింగ్టన్లోని (America Washington) న్యూకాజిల్లో ఏప్రిల్ 24న ఈ ఘటన చోటు చేసుకుంది. కర్నాటక మండ్య జిల్లా కేఆర్పేట్ తాలూకాకు చెందిన హర్షవర్ధన్ (57) అనే టెక్ వ్యవస్థాపకుడికి భార్య శ్వేత పాణ్యం (44), ఇద్దరు కుమారులు ఉన్నారు. ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. ఇంట్లో ఉన్న హర్షవర్ధన్.. ఉన్నట్టుండి తన భార్య, 14 ఏళ్ల తన కుమారుడిని కాల్చి చంపేశాడు.
ఆ తర్వాత తానూ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఆ సమయంలో హర్షవర్ధన్ రెండో కొడుకు ఇంట్లో లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. హర్షవర్ధన్ ఇలా చేయడానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయని చెబుతున్నారు. కాగా, హర్షవర్ధన్ 2017లో అమెరికా నుంచి వచ్చి మైసూర్లో హోలోవరల్డ్ పేరుతో రోబొటిక్స్ కంపెనీని స్థాపించినట్లు తెలిసింది. ఈ కంపెనీకి హర్షవర్ధన్ సీఈవో కాగా, అతడి భార్య సహ వ్యవస్థాపకురాలుగా ఉండేవారు.
అయితే కోవిడ్ కారణంగా 2022లో ఆ కంపెనీ మూతపడింది. దీంతో హర్షవర్ధన్ మళ్లీ కుటుంబంతో పాటూ అమెరికాకు వెళ్లినట్లు పోలీసు విచారణలో తెలిసింది. కంపెనీ స్థాపించిన సమయంలో దేశ సరిహద్దు భద్రత కోసం రోబోలను ఉపయోగించడంపై ప్రధాని నరేంద్ర మోదీని హర్షవర్ధన్ కలిసినట్లు తెలుస్తోంది. రోబోటిక్స్లో నిపుణుడైన హర్షవర్ధన్.. అమెరికాలో మైక్రోసాఫ్ట్లో కూడా పని చేసినట్లు తెలిసింది. కాగా, ప్రస్తుతం హర్షవర్ధన్ కుటుంబం ఆత్మహత్య ఘటనతో ఆయన సొంత గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.