Heavy Rains: మళ్లీ తుపాను ముప్పు.. 29నుంచి కుంభవృష్టి
ABN , Publish Date - Nov 25 , 2025 | 11:56 AM
చెన్నై నగరాన్ని వర్షాలు వదలడం లేదు. వారానికోసారి తుపాన్లు అతలాకుతలం చేస్తున్నాయి. మళ్లీ 29వతేదీ నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో రెండు వాయుగుండాలు ఏర్పడుతున్నాయని, దీని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
- బంగాళాఖాతంలో రెండు వాయు‘గండాలు’
చెన్నై: ఈశాన్యరుతుపవనాలు తీవ్రరూపం దాల్చటంతో బంగాళాఖాతంలో వరుసగా రెండు అల్పపీడనాలు కేంద్రీకృతమై వాయుగుండాలుగా మారే అవకాశం ఉందని, దీంతో ఈ నెల 29 నుండి రాష్ట్రంలో కుండపోతగా వర్షాలు కురిసే అవకాశముందని స్థానిక వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో ప్రతియేటా ఈశాన్యరుతుపవనాల ప్రభావంతో అక్టోబరు, నవంబర్, డిసెంబర్ నెలల్లో చెన్నై(Chennai) పరిసర జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తుంటాయి. ఆ ప్రకారమే ఈ యేడాది అక్టోబర్లో భారీగా వర్షాలు కురిశాయి. కానీ నవంబర్లో ఆశినంతగా వర్షాలు కురవలేదు.
గత పదిహేను రోజులుగా రాష్ట్రంలో దక్షిణాది జిల్లాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసి వరి, అరటి పంటలను ముంచెత్తాయి. తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్కాశి జిల్లాలో ప్రస్తుతం కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో వచ్చే 48 గంటలలోగా అల్పవాయుపీడనం తుఫానుగా మారనుందని చెన్నై వాతావరణ కేంద్రం సంచాలకులు డాక్టర్ అముద తెలిపారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మలాక్కా జలసంధి దాని సీమపంలోని దక్షిణ అండమాన్ తీరంలో కేంద్రీకృతమైన అల్ప పీడనం సోమవారం వేకువజాము 5.30 గంటలకు ఆ ప్రాంతంలోనే స్థిరంగా ఉందని,

వచ్చే 24 గంటల్లోగా ఆ అల్పపీడనం పడమటి దిశగా ఆగ్నేయం వైపు కదలుతూ అండమాన్ వద్ద వాయుగుండంగా మారనుందని వివరించారు. రానున్న 24 గంటల్లోగా ఆ వాయుగుండం తుఫాన్గా మారనుందని వెల్లడించారు. ఇదే విధంగా కేమరూన్ సమీపం ఆగ్నేయ బంగాళాఖాతంలో శ్రీలంకకు సమీపంలో ఏర్పడిన అల్ప పీడనం కూడా సోమవారం వేకువజాము అక్కడే స్థిరంగా ఉందని, ఆ అల్ప పీడనం తుఫానుగా మారే అవకాశాలన్నాయని తెలిపారు.
దక్షిణాది జిల్లాలకు భారీ వర్షసూచన...
బంగాళాఖాతంలో వరుసగా రెండు వాయుగుండాలు తరుముకు వస్తుండటంతో అరియలూరు, పెరంబలూరు, తిరుచ్చి, కరూరు, నామక్కల్, ఈరోడ్, తిరుప్పూరు, కోవై, నీలగిరి, దిండుగల్, తేని, మదురై, విరుదునగర్, శివగంగ జిల్లాలో భారీగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. చెన్నై, కాంచీపురం(Chennai, Kanchipuram), చెంగల్పట్టు, తిరువళ్లూరు జిల్లాల్లో మంగళవారం నుండి నెలాఖరుదాకా చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు తెలిపారు. ఈ నెల 29న చెన్నై నగరానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే త్వరపడండి.. పసిడి, వెండి ధరల్లో కోత
అది బూటకపు ఎన్కౌంటర్: ఈశ్వరయ్య
Read Latest Telangana News and National News