Sonu Nigam: పహల్గాం ఘటనపై సోనూ నిగమ్ సంచలన కామెంట్స్.. షాకిచ్చిన పోలీసులు..
ABN , Publish Date - May 05 , 2025 | 06:04 PM
Sonu Nigam FIR 2025: కర్ణాటకలో ఇటీవల జరిగిన ఓ కన్సర్ట్లో పహల్గాం ఘటనతో ముడిపెడుతూ ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. తాజాగా బెంగళూరు పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. త్వరలో ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేసే అవకాశం కూడా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ, ఏం జరిగిందంటే..

Sonu Nigam Controversy: ప్రముఖ గాయకుడు సోను నిగమ్కు బెంగళూరు పోలీసులు నోటీసు జారీ చేశారు. వారం రోజుల్లోగా దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని ఆదేశించారు. కెఆర్వి దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా బెంగళూరు గ్రామీణ జిల్లాలోని అవలహల్లి పోలీస్ స్టేషన్లో గాయకుడిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఓ సంగీత కార్యక్రమంలో కన్నడిగులను టెర్రరిస్టులతో పోలుస్తూ సోనూ నిగమ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సీఎం సిద్ధరామయ్య సహా రాష్ట్ర ప్రజలంతా గాయకుడి తీరును నిరసిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశించారు.
సోను నిగమ్పై ఎఫ్ఐఆర్
గాయకుడు చేసిన ఈ వ్యాఖ్యలు కర్ణాటక ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఉగ్రవాద దాడికి, పాట పాడమని అభ్యర్థించడానికి మధ్య సంబంధం ఏంటని కన్నడ భాషా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొందరు సోను నిగమ్పై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. కన్నడిగులను అవమానించారని, భాషా వర్గాల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొట్టారని ఆరోపించారు. సుమోటోగా కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు. భారతీయ న్యాయ సంహిత (BNS) చట్టంలోని సెక్షన్లు 351(2) (నేరపూరిత బెదిరింపు), 352 (ప్రజలకు హాని కలిగించే ప్రకటనలు), 352(1) (శాంతికి భంగం కలిగించే ఉద్దేశ్యంతో లేదా మరొక నేరాన్ని ప్రేరేపించే ఉద్దేశ్యంతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం) కింద బెంగళూరులోని అవలహల్లి పోలీస్ స్టేషన్లో FIR నమోదైంది. కర్ణాటక రక్షణ వేదిక బెంగళూరు నగర జిల్లా యూనిట్ అధ్యక్షుడు ఎ. ధర్మరాజ్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ కేసు ఫైల్ చేశారు. "సోనూ నిగమ్ వ్యాఖ్యలు కన్నడిగ సమాజం మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయి. కర్ణాటకలోని వివిధ భాషా వర్గాల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టాయి. ఈ వ్యాఖ్యలు హింసను రేకెత్తించే అవకాశం ఉంది" అని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
పహల్గాం ఘటనకు ఇదే కారణం..
మే 1 శనివారం నాడు బెంగళూరులోని ఈస్ట్ పాయింట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో జరిగిన కచేరీ సందర్భంగా ఈ వివాదం చెలరేగింది. ప్రేక్షకుల్లో నుంచి ఓ విద్యార్థి కన్నడ పాటను పాడమని సింగర్ సోనూ నిగమ్ ను అభ్యర్థించాడు. దీనిపై గాయకుడు తీవ్రంగా స్పందిస్తూ, "నేను వివిధ భాషలలో పాడాను. కన్నడలోనూ అత్యుతమం అని చెప్పదగ్గ ఎన్నో పాటలు పాడాను. కర్ణాటకకు ఎప్పుడూ చాలా ప్రేమ, గౌరవంతో వస్తాను. మీరందరూ నన్ను కుటుంబంలా చూసుకున్నారు. నేను కోరినప్పుడల్లా కన్నడ పాటలు పాడతాను. ఆ యువకుడి వయస్సు కంటే ఎక్కువ కాలం నుంచే నేను కన్నడలో పాడుతున్నాను. కానీ అతడు 'కన్నడ, కన్నడ' అని అరిచిన విధానం నాకు నచ్చలేదు. అలాంటి ప్రవర్తన వల్లే పహల్గాం దాడి వంటి సంఘటనలు జరుగుతాయి." అని అన్నారు.
శాండివుడ్ లో సోనూపై బ్యాన్?
కన్నడ భాష గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాయకుడు సోను నిగమ్పై కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC) కఠిన చర్యలు తీసుకుంటుందని, కన్నడ సినిమా నుండి నిషేధం విధించే అవకాశం ఉందని భావిస్తున్నారు. సోమవారం జరగనున్న అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
గాయకుడు చేసిన ఈ వ్యాఖ్యలను కర్ణాటక ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఉగ్రవాద దాడికి, పాట పాడమని అభ్యర్థించడానికి మధ్య సంబంధం ఏంటని కన్నడ భాషా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొందరు సోను నిగమ్పై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. కన్నడిగులను అవమానించారని, భాషా వర్గాల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొట్టారని ఆరోపించారు.
Read Also: Rahul meets PM Modi : ప్రధాని నరేంద్ర మోదీతో రాహుల్ గాంధీ భేటీ
Pahalgam Terror Attack: పాక్కు వ్యతిరేకంగా భారత్ మరో కీలక నిర్ణయం