Shashi Tharoor: ఇంకోసారి మా జోలికొస్తే అంతకంత అనుభవిస్తారు.. పాక్కు శశి థరూర్ స్ట్రాంగ్ వార్నింగ్..
ABN , Publish Date - May 27 , 2025 | 10:30 AM
Shashi Tharoor on Operation Sindoor: అఖిలపక్ష ప్రతినిధి బృందంతో పాటు గయానా చేరుకున్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పాకిస్థాన్ పై తీవ్ర విమర్శలు చేశారు. 'ఆపరేషన్ సిందూర్' పాక్ ఉగ్రవాదులు సృష్టించిన హింసకు ప్రతిస్పందన అని.. యుద్ధం కాదని అన్నారు. ఇంకోసారి భారత్ జోలికొస్తే రియాక్షన్ మామూలుగా ఉండదని వార్నింగ్ ఇచ్చారు.

Shashi Tharoor Guyana Speech: ఉగ్రవాదానికి పాకిస్థాన్ ఎలా కొమ్ముకాస్తూ కాపాడుకుంటూ వస్తోందో చాటి చెప్పేందుకు భారత్ నుంచి అఖిలపక్ష బృందాలు పలు దేశాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. దాయాది దేశం అసలు రంగును బహిర్గతం చేస్తూనే, భారత్ ఎందుకు 'ఆపరేషన్ సిందూర్' చేపట్టాల్సి వచ్చిందో వివరించడమే ఈ బృందాల లక్ష్యం. ఇక శశి థరూర్ నేతృత్వంలోని అఖిలపక్ష ప్రతినిధి బృందం ప్రస్తుతం గయానాలో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా ఉగ్రవాదానికి మద్ధతుగా నిలుస్తున్న పాకిస్థాన్పై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. గయానా నుంచి పాకిస్థాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
పహల్గామ్లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడి తర్వాత మన దేశం 'ఆపరేషన్ సిందూర్' పేరిట ఉగ్రవాదులపై ప్రతీకార చర్యకు పూనుకుంది. ఈ క్రమంలో భారత సాయుధ దళాలు దాయాది దేశంలోని 9 కీలక ఉగ్రస్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడి నేలమట్టం చేశాయి. ఈ దాడిలో మొత్తం 200 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత నుంచి ఉగ్రవాదుల విషయంలో పాక్ కపట వైఖరిని అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టేందుకు భారత ప్రభుత్వం ఎంపీలతో అఖిలపక్ష ప్రతినిధి బృందాలను ఏర్పాటు చేసింది. తాజాగా, కాంగ్రెస్ సీనియర్ ఎంపీ నేతృత్వంలోని ఓ బృందం అమెరికా పర్యటన తర్వాత గయానా రాజధాని జార్జ్టౌన్కు చేరుకుంది.
గయానాలో అంతర్జాతీయ ప్రతినిధులతో శశిథరూర్ మాట్లాడుతూ, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్కు హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై సరిహద్దులు దాటి వచ్చే ఉగ్రవాదులు ఎప్పటికీ తప్పించుకోలేరని అన్నారు. ఉగ్రవాదులపైనే కాక వారికి ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తున్న వారిపైనా కఠిన చర్యలు విధిస్తామని స్పష్టం చేశారు. మరోసారి ఉగ్రవాదులు దాడికి తెగబడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. గత నాలుగు దశాబ్దాలుగా భారతదేశం ఉగ్రవాదంతో బాధపడుతోందని థరూర్ ఆవేదన వ్యక్తం చేశారు. 'ఉగ్రవాదం ఎక్కడ జరిగినా దానికి వ్యతిరేకంగా మనం నిలబడాలి. దుష్ట హంతకులతో పాటు వారికి శిక్షణ, ఆయుధాలు, ఆర్థిక సహాయం అందిస్తున్న వారికి తగిన బుద్ధి చెప్పాలి' అని పిలుపునిచ్చారు.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న ప్రచారానికి మద్దతు ఇవ్వాలని గయానాలో నివసిస్తున్న భారతీయ సమాజాన్ని శశి థరూర్ కోరారు.'భవిష్యత్తులో ఇలాంటివి మళ్ళీ జరిగితే మీరందరూ మాకు మద్దతు, బలం, సంకల్పం అందించాలని కోరుకుంటున్నాము. ఇదే మా సందర్శన ఉద్దేశం' అని ఆయన అన్నారు. అంతకుముందు గయానా ప్రధాని మార్క్ ఫిలిప్, ఉపాధ్యక్షుడు భరత్ జగదియోలతో శశి థరూర్ నేతృత్వంలోని బృందం భేటీ అయ్యింది. చర్చల అనంతరం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న ప్రచారానికి ఇరు నాయకులు పూర్తిగా మద్దతు ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి.
కాల్పుల విరమణకు అమెరికాకు థ్యాంక్స్ చెప్తారా? విదేశాంగమంత్రి సమాధానం ఇదే..
Gold Rates Today: పసిడి ప్రియులకు అలర్ట్.. తగ్గిన బంగారం, పెరిగిన వెండి
Read Latest National News and Telugu News