Share News

Republic Day Tableau Award: ఓటింగ్ పెట్టినా గుజరాత్‌కే అవార్డు.. ఫలితాలు ముందే లీక్..

ABN , Publish Date - Jan 27 , 2025 | 05:16 PM

ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా ప్రదర్శించిన శకటాల్లో ఉత్తమ ప్రదర్శనకు అవార్డు ఇచ్చే విషయంలో కేంద్రం కొత్త సంప్రదాయాన్ని తీసుకొచ్చింది. గతంలో కేంద్రప్రభుత్వమే ఉత్తమ ప్రదర్శనను ఎంపిక చేయగా.. ఈ ఏడాది నుంచి ఓటింగ్ నిర్వహిస్తోంది. మరికొన్ని గంటల్లో ఓటింగ్ ముగియనుండగా.. ఇప్పటికే అవార్డు ఎవరికో తెలిసిపోయింది.

Republic Day Tableau Award: ఓటింగ్ పెట్టినా గుజరాత్‌కే అవార్డు.. ఫలితాలు ముందే లీక్..
Gujarat Tableau

ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించే వేడుకలు ఎంతో ప్రత్యేకమైనవిగా చెప్పవచ్చు. రిపబ్లిక్ డే సందర్భంగా దేశం యొక్క బలాన్ని, ఐక్యతను చాటేలా త్రివిధ దళాలు ప్రదర్శించే విన్యాసాలు ప్రజలందరినీ ఆకట్టుకుంటాయి. ఈ వేడుకల్లో వివిధ రాష్ట్రాలు తమ ప్రాంత ప్రత్యేకతను చాటిచెప్పేలా శకటాలు ప్రదర్శిస్తుంటారు. చాలా రాష్ట్రాలు ఈ ప్రదర్శనలో పాల్గొంటాయి. ఒక్కో రాష్ట్రం ఒక ఇతివృత్తంతో గణతంత్ర వేడకల్లో తమ రాష్ట్ర శకటాలను ప్రదర్శించగా.. వేడుకల తర్వాత వీటిలో అత్యుత్తమ శకటానికి అవార్డులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ శకటాల ప్రదర్శనలకు అవార్డులు ఇచ్చే సమయంలోనూ కేంద్రప్రభుత్వంపై విమర్శలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. దీంతో ఈ ఏడాది నుంచి కేంద్రప్రభుత్వం రిపబ్లిక్ డే రోజు ప్రదర్శించిన శకటాలకు అవార్డు కోసం ఓటింగ్ నిర్వహిస్తోంది. దేశ ప్రజలు ఈ ఓటింగ్‌లో పాల్గొనాలని రక్షణ శాఖ కోరింది. https://www.mygov.in/group-poll/vote-your-favourite-tableau-and-marching-contingent-republic-day-parade-2025 ఈ లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా ఓటింగ్‌లో పాల్గొనవచ్చు. ఆదివారం ప్రారంభమైన ఈ ఓటింగ్ సోమవారం అర్థరాత్రితో ముగుస్తుంది. మంగళవారం అవార్డును కేంద్రం ప్రకటించనుంది.


ఆ రాష్ట్రానికే అవార్డు..

సాయంత్రం ఐదు గంటల సమయానికి కేంద్ర రక్షణ శాఖ నిర్వహించిన ఓటింగ్‌లో ఎక్కువమంది గుజరాత్ రాష్ట్రం స్వర్ణిమ్ భారత్, విరాసత్ ఔర్ వికాస్ ఇతివృత్తంతో ప్రదర్శించిన శకటానికి తమ ఓటు వేయడంతో 2025 సంవత్సరానికి సంబంధించి గుజరాత్ రాష్ట్రం అవార్డును గెలుచుకోనుంది. ఓటింగ్‌లో పాల్గొన్న ప్రజలు 50 శాతానికి పైగా గుజరాత్‌ రాష్ట్రానికి తమ ఓటు వేశారు. మిగిలిన రాష్ట్రాలకు కనీసం పది శాతం ఓట్లు పడలేదు. గుజరాత్ తర్వాత ఉత్తరప్రదేశ్ శకటానికి 9 శాతం ఓట్లు పడగా, ఉత్తరాఖండ్ శకటానికి 8 శాతం ఓట్లు పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏటికొప్పాక బొమ్మలు, ఏకో ఫ్రెండ్లీ ఉడెన్ టాయ్స్ ఇతివృత్తంతో ప్రదర్శించిన శకటానికి 4శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. మరికొన్ని గంటలు మాత్రమే ఓటింగ్‌కు సమయం ఉండటంతో గుజరాత్ శకటానికి ఇప్పటికే ఓట్లు 50 శాతం దాటడంతో ఈ అవార్డును గెలుచుకునే అవకాశం ఉంది. మొత్తం 16 రాష్ట్రాలు తమ శకటాలను ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రదర్శించాయి.


మిగిలిన శకటాలకు సంబంధించి..

రాష్ట్రాలు కాకుండా, వివిధ కేంద్రప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, రక్షణ దళాలకు సంబంధించిన శకటాల ప్రదర్శనపై ఓటింగ్ నిర్వహిస్తోంది. రక్షణ దళాలకు సంబంధించిన శకటాల ప్రదర్శనలో సీఆర్‌పిఎఫ్ శకటానికి 50 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. మంత్రిత్వ శాఖలకు సంబంధించిన శకటాల ప్రదర్శనలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖకు చెందిన శకటానికి 20 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. దీంతో అత్యధిక శాతం ఓట్లు వచ్చిన శకటానికే అవార్డులు ఇవ్వనున్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Jan 27 , 2025 | 05:16 PM