India Pak Ceasefire: ట్రంప్ ఫోన్తో మోదీ సరెండర్.. కాల్పుల విరమణపై రాహుల్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Jun 03 , 2025 | 07:15 PM
బీజేపీ నేతలకు మాత్రం ఇండిపెండెన్స్ సమయం నుంచి లొంగుబాటు లేఖలు రాయడం అలవాటని రాహుల్ గాంధీ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ లొంగిపోదని చెప్పారు. గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్ లొంగిపోయే వ్యక్తులు కారని, సూపర్ పవర్లను ఎదిరించి పోరాటం చేశారని అన్నారు.

భోపాల్: ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) కొనసాగుతున్న సమయంలో కాల్పుల విరమణకు అంగీకరించడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఫోన్కాల్ రాగానే ప్రధాని నరేంద్ర మోదీ సరెండర్ అయ్యారని ఆరోపించారు. భోపాల్లోని రవీంద్ర భవన్లో మంగళవారం నాడు జరిగిన పార్టీ సదస్సులో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, బీజేపీ-ఆర్ఎస్ఎస్ నేతలపై చిన్న ఒత్తిడి వచ్చినా సరే భయపడి పారిపోతారని అన్నారు. ట్రంప్ అక్కడి నుంచి ఫోన్ చేసి 'నరేందర్... సరెండర్' అన్నారు. దీంతో ఇక్కడ నరేంద్ర మోదీ 'ఎస్ సర్' అనేశారని రాహుల్ మండిపడ్డారు.
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1971 సంక్షోభంలో నిర్ణయాత్మక వైఖరి ప్రదర్శించారని రాహుల్ గుర్తుచేశారు. 1971లో అమెరికా సెవెన్త్ ఫ్లీట్ వచ్చినప్పుడు, నేను ఏమి చేయాలో అదే చేస్తానంటూ ఇందిరాగాంధీ చెప్పారని అన్నారు. కానీ ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలకు మాత్రం ఇండిపెండెన్స్ సమయం నుంచీ లొంగుబాటు లేఖలు రాయడం అలవాటని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ లొంగిపోదని చెప్పారు. గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్ లొంగిపోయే వ్యక్తులు కారని, సూపర్ పవర్లను ఎదిరించి పోరాటం చేశారని చెప్పుకొచ్చారు.
అమెరికా మధ్యవర్తిత్వం ఉత్తదే: ఎంఈఏ
కాగా, ఇండియా-పాక్ మధ్య కాల్పుల విరమణకు ఎవరూ మధ్యవర్తిత్వం చేయలేదని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటీవల వివరణ ఇచ్చింది. ఇరుదేశాల డీజీఎంఏలు నేరుగా చర్చించి కాల్పుల విరమణకు నిర్ణయించినట్టు ఎంఈఏ ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ చెప్పారు. ఆపరేషన్ సిందూర్ ప్రారంభించిన మే 7 నుంచి.. కాల్పుల విరమణ జరిగిన మే 10 వరకూ కేవలం మిలటరీ పరిస్థితిపైనే భారత్, అమెరికా మధ్య సంభాషణలు జరిగాయే కానీ, సుంకాల అశం ఎక్కడా ప్రస్తావనకు రాలేదన్నారు.
ఇవి కూడా చదవండి..
తప్పు చేసి భద్రత కోరుతున్నారా? కమల్పై కర్ణాటక హైకోర్టు ఫైర్..
శర్మిష్ఠ పనోలికి బెయిల్ నిరాకరించిన కోల్కతా హైకోర్టు
For National News And Telugu News