PM Kisan Samman Nidhi: పీఎం కిసాన్ 20వ విడత నగదు విడుదల చేసిన ప్రధాని మోదీ..
ABN , Publish Date - Aug 02 , 2025 | 12:01 PM
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత నగదును ప్రధాని మోదీ తాజాగా విడుదల చేశారు. వారణాసి పర్యటనలో భాగంగా ప్రధాని రూ.2,200 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత మొత్తాన్ని విడుదల చేశారు. సేవాపురిలోని బనౌలిలో జరిగిన కార్యక్రమంలో ఈ విడతను అధికారికంగా రిలీజ్ చేశారు. ఈసారి దేశవ్యాప్తంగా 9.7 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రూ.20,000 కోట్లు బదిలీ అయ్యాయి.
ఈ పథకం ద్వారా రైతులకు ఏడాదికి మూడు విడతల్లో రూ.6,000 ఆర్థిక సాయం అందుతుంది. అంటే, ఒక్కో విడతలో రూ.2,000 చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ అవుతాయి. అంతకుముందు, జూన్ 18, 2024న, ప్రధానమంత్రి మోదీ నుంచి రూ.9.26 కోట్ల మంది రైతుల ఖాతాలకు సమ్మాన్ నిధిని రిలీజ్ చేశారు.
పర్యటనలో భాగంగా
వారణాసి పర్యటనలో భాగంగా మోదీ దాదాపు రూ.2,200 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతోపాటు శంకుస్థాపన చేశారు. వీటిలో రోడ్లు, ఆసుపత్రులు, స్కూళ్లు సహా రకరకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు వారణాసి ప్రజల జీవితాలను మరింత మెరుగుపరుచనున్నాయి. ఈ అభివృద్ధి ప్రాజెక్టులు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను కూడా పెంచబోతున్నాయని తెలిపారు. ఇలాంటి ప్రాజెక్టులు రైతుల జీవితాలు, గ్రామీణ భారతాన్ని మరింత బలోపేతం చేస్తాయన్నారు.
మోదీ మాట్లాడుతూ,
మీరు దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు. మీ సంక్షేమం కోసం మేం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామన్నారు. రైతులకు నగదు విడుదల చేసిన సందర్భంగా మరో పథకం గురించి కూడా మోదీ ప్రస్తావించారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన. ఈ పథకం ద్వారా పంటకు నష్టం జరిగితే బీమా సంస్థ పరిహారం ఇస్తుందని గుర్తు చేశారు. ఈ స్కీం ద్వారా ఇప్పటివరకు రైతులకు రూ.1.75 లక్షల కోట్లకు పైగా విలువైన క్లెయిమ్లు ఇచ్చినట్లు ప్రస్తావించారు. పంట బీమా తీసుకోని వారు వెంటనే తీసుకోవాలన్నారు.
ఇవి కూడా చదవండి
ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి