Rajnath Singh: పాక్కు రుణం ఇవ్వడంపై ఐఎంఎఫ్ పున:పరిశీలించాలి: కేంద్రమంత్రి..
ABN , Publish Date - May 16 , 2025 | 02:43 PM
భారత్ అభ్యంతరాలను బేఖాతరు చేయకుండా పాక్కు రెండో విడత లోన్ ప్యాకేజీగా 7 బిలియన్ల డాలర్లను ఐఎంఎఫ్ ఇటీవల ప్రకటించింది. ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి, సంస్కరణల కొనసాగింపునకు ఇస్లామాబాద్కు రుణం మంజూరు చేస్తున్నామని పేర్కొంది.

భుజ్: ఉగ్రవాదులకు పాకిస్థాన్ నిధులు అందిస్తుండడంపై భారత్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) విరుచుకుపడ్డారు. పాక్ తన గడ్డపై ఉగ్రవాద సంస్థలకు నిధులివ్వడానికి చరమగీతం పాడాలంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) ఆ దేశానికి ఆర్థిక సాయం ఆపేయాలని డిమాండ్ చేశారు. గుజరాత్లోని భుజ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో వాయిసేన సిబ్బందిని ఉద్దేశించి రాజ్నాథ్ శుక్రవారం నాడు మాట్లాడారు. గ్లోబల్ సాయాన్ని పాక్ దుర్వినియోగం చేస్తూ క్రాస్ బోర్డర్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తోందని కేంద్రమంత్రి ఆరోపించారు.
Rajnath Singh: ఆపరేషన్ సిందూర్ ముగియలేదు.. తేల్చేసిన రాజ్నాథ్ సింగ్
జమ్మూకశ్మీర్లో గురువారం నాడు పర్యటన అనంతరం రాజ్నాథ్ సింగ్.. భుజ్ చేరుకున్నారు. ఎల్ఓసీ, అంతర్జాతీయ సరిహద్దుల్లో భద్రతను ఆయన ఈ సందర్భంగా సమీక్షించారు. శ్రీనగర్లో పర్యటన సందర్భంగా పాక్పై రాజ్నాథ్ విరుచుకుపడ్డారు. పాక్ భారత్ పట్ల నయవంచనకు పాల్పడుతోందని, భారత వ్యతిరేక శక్తులు, ఉగ్రవాద సంస్థలకు తన భూభాగంపై ఆశ్రయం ఇవ్వడం తక్షణం పాక్ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఐఎంఎఫ్ నుంచి రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితికి పాక్ చేరుకుందని, భారత్ మాత్రం ఐఎంఎఫ్కు నిధులు సమకూర్చే క్యాటగిరీలో ఉందని చెప్పారు. ఇందువల్ల పేద దేశాలను ఐఎంఎఫ్ ఆదుకోగలుగుతోందన్నారు.
భారత్ అభ్యంతరాలను ఖాతరు చేయకుండా పాక్కు రెండో విడత లోన్ ప్యాకేజీగా 7 బిలియన్ల డాలర్లను ఐఎంఎఫ్ ఇటీవల ప్రకటించింది. ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి, సంస్కరణల కొనసాగింపునకు ఇస్లామాబాద్కు రుణం మంజూరు చేస్తున్నామని పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు పాక్కు అందిస్తున్న సహాయాన్ని కొనసాగిస్తామని తెలిపింది.
ఐఎంఎఫ్ చర్యను భారత్ తప్పుపట్టింది. సంస్కరణలు అమలు చేయడంలో అత్యంత దయనీయమైన ట్రాక్ రికార్డ్ ఉన్న పాక్కు నిధులెలా ఇస్తారని నిలదీసింది. అదీగాక ఆ నిధులను క్రాస్ బోర్డర్ టెర్రరిజాన్ని ప్రోత్సహించేందుకు పాక్ మళ్లిస్తోందని ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను పాక్ తోసిపుచ్చింది.
ఇవి కూడా చదవండి..
Defence Budget: ఆపరేషన్ సిందూర్ సక్సెస్.. ఆర్మీకి మరో 50 వేల కోట్ల నిధులు