BSF Jawan: బీఎస్ఎఫ్ జవాన్ విడుదల.. అటారీ వద్ద భారత్కు అప్పగించిన పాకిస్తాన్..
ABN , Publish Date - May 14 , 2025 | 12:33 PM
పాకిస్తాన్ ప్రభుత్వం భారత జవాన్ను విడుదల చేసింది. పొరపాటున సరిహద్దు దాటి పాకిస్తాన్లోకి ప్రవేశించిన బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ సాహును పాక్ రేంజర్లు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే..

పాకిస్తాన్ ప్రభుత్వం భారత జవాన్ను విడుదల చేసింది. పొరపాటున సరిహద్దు దాటి పాకిస్తాన్లోకి ప్రవేశించిన బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ సాహును పాక్ రేంజర్లు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఎట్టకేలకు మన జవాన్ను పాకిస్తాన్ విడుదల చేసింది. అట్టారిలోని చెక్ పోస్ట్ వద్ద భారత అధికారులకు అప్పగించారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
పశ్చిమ బెంగాల్లోని హుగ్లీకి చెందిన పూర్ణం కుమార్.. 17 సంవత్సరాలుగా BSFలో పనిచేస్తున్నాడు. అయితే పహల్గామ్లో ఉగ్రదాడి (Pahalgam Terror Attack) ఘటన జరిగిన తర్వాతి రోజు.. అంటే ఏప్రిల్ 23న పంజాబ్లోని ఫిరోజ్పూర్లో పూర్ణం కుమార్ విధుల్లో ఉన్నాడు. స్థానికంగా ఉండే రైతులు ఈ ప్రాంతాల్లో పంట సాగు చేస్తున్నారు. దీంతో పూర్ణం కుమార్ ఈ పొలాల వద్ద గస్తీ నిర్వహిస్తున్నాడు. అయితే ఈ క్రమంలో అలసిపోయిన అతను.. సమీపంలోని ఓ చెట్టు కింద విశ్రాంతి తీసుకుందామని వెళ్లాడు. అయితే అది పాకిస్తాన్ భూభూగమని అతను గ్రహించలేకపోయాడు. ఈ క్రమంలో అతన్ని గమనించిన పాక్ రేంజర్లు (Pak Rangers) అదుపులోకి తీసుకున్నారు.
అయితే పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరుతో ప్రతీకార దాడులు చేసిన విషయం తెలిసిందే. దీంతో భారత్ - పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనడంతో జవాన్ తిరిగి రావడంలో ఆలస్యమైంది. పొరపాటున పాక్ భూభాగంలోకి అడుగు పెట్టాడని.. అతడ్ని వదిలేయాలని బీఎస్ఎఫ్ అధికారులు సూచించారు. అయినా దీనిపై పాక్ రేంజర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేశారు. ఈ క్రమంలో ఈ నెల మొదటివారంలో రాజస్థాన్లోని శ్రీగంగానగర్ సమీపంలోని భారత్-పాక్ సరిహద్దులోకి ఓ పాక్ రేంజర్ చొరబడ్డాడు. పాక్ రేంజర్ను పసిగట్టిన ఇండియన్ ఆర్మీ అదుపులోకి తీసుకుంది. దీంతో పాకిస్తాన్పై ఒత్తిడి పెరిగి.. పూర్ణమ్ను అప్పగించాల్సిన పరిస్థితి వచ్చింది.
ఎట్టకేలకు పూర్ణం కుమార్ స్వదేశానికి వచ్చేయడంతో ఆయన కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్ రేంజర్లకు పూర్ణం కుమార్ పట్టుబడిన వార్త తెలియగానే ఆయన కుటుంబం ఆందోళనకు గురైంది. తన భర్తను తిరిగి తీసుకొచ్చేందుకు.. గర్భిణిగా ఉన్న ఆయన భార్య రజని షాహు ఎన్నో ప్రయత్నాలు చేసింది. కోల్కతా నుంచి పఠాన్కోట్కు వెళ్లి అధికారులను కలిసి విన్నవించుకుంది. కుమార్ సాహు త్వరగా విడుదల అవుతారని అధికారులు హామీ ఇవ్వడంతో ఆమె తిరిగి సొంతూరుకు వచ్చారు. సరిహద్దులు దాటి వెళ్లే ఘటనలు సర్వసాధారణంగా జరుగుతుంటాయి. భారత జవాన్లు పాక్ భూభాగంలోకి వెళ్లడం, అలాగే పాక్ రేంజర్లు భారత భూభాగంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో రెండు దేశాల సైనికాధికారులతో చర్చలు జరి, ఎవరి సైనికులను వారి భూభాగంలోకి పంపిస్తుంటారు.
ఇవీ చదవండి:
అబద్ధాల ఫ్యాక్టరీ.. పాకిస్థాన్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి