PM Modi: అణు బూచికిబెదరం
ABN , Publish Date - May 13 , 2025 | 03:49 AM
ప్రధాన మంత్రి మోదీ స్పష్టం చేశారు — ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ప్రభుత్వాలను వేరు చేయమని, అణ్వస్త్ర బెదిరింపులను భారత్ ఏమాత్రం భయపడదని హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలపై విధ్వంసకర దాడులు నిర్వహించినట్లు తెలిపారు.

అణ్వస్త్ర బెదిరింపులను సహించం
ఉగ్రవాదులు, వారికి ఆశ్రయమిచ్చే ప్రభుత్వాల్ని వేర్వేరుగా చూడం
నుదుట సిందూరాన్ని తుడిచే సాహసం చేస్తే వాటి
ప్రధాన కార్యాలయాలనే తుడిచిపెట్టేశాం
సరిహద్దుల్లో దాడికి సిద్ధమైతే.. పాక్ గుండెలపైనే దాడులు చేశాం
భద్రతా బలగాల తెగువ, పరాక్రమం తిరుగులేనివి
ఉగ్రవాద స్థావరాలనే కాదు.. నైతిక స్థైర్యాన్నీ బదాబదలు చేశాం
మన దాడులతో పాక్కు ఊహకు కూడా అందనంత విధ్వంసం
అందుకే ప్రపంచ దేశాల్ని వేడుకుంది.. పరుగెత్తుకుంటూ వచ్చింది
మేడిన్ ఇండియా రక్షణ వ్యవస్థల సత్తా ప్రపంచానికి తెలిసింది
ఉగ్రవాదం, చర్చలు ఒకేసారి కుదరవు..
ఉగ్రవాదం, వాణిజ్యం ఒకే బాటలో పయనించలేవు..
రక్తం, నీళ్లు కలిసి ప్రవహించ లేవు..
జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ, మే 12 (ఆంధ్రజ్యోతి): అణు బెదిరింపులకు భారత్ బెదిరేది లేదని, అణ్వస్త్ర బ్లాక్ మెయిలింగ్ను ఏమాత్రం సహించేది లేదని పాకిస్థాన్కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు. అణ్వస్త్ర బూచిని చూపించి ఉగ్రవాద స్థావరాలను నిర్వహిస్తే కచ్చితమైన, నిర్ణయాత్మక దాడులు తప్పవని హెచ్చరించారు. ఉగ్రవాదులకు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి మధ్య ఏమాత్రం తేడా లేదని, ఉగ్రవాద నాయకులను, వారికి ఆశ్రయం ఇచ్చే ప్రభుత్వాలను భారత్ వేర్వేరుగా చూడదని పునరుద్ఘాటించారు. భారత సైన్యం హతమార్చిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాకిస్థాన్ సైనికాధికారులు హాజరయ్యారని, దీనిని ప్రపంచమంతా చూసిందని, ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంలో పాకిస్థాన్ పూర్తిగా కూరుకుపోయిందనడానికి ఇది మరో నిదర్శనమని చెప్పారు. మన కుమార్తెలు, చెల్లెళ్ల నుదుటిపై సింధూరాన్ని తుడిచే సాహసాన్ని ఉగ్రవాదులు చేశారని, దానికి ప్రతిగా ఉగ్రవాదం ప్రధాన కార్యాలయాలనే తుడిచిపెట్టేశామని, దాంతో, సిందూరాన్ని తుడిచేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పుడు ప్రతి ఉగ్రవాదికి తెలిసిందని అన్నారు. మన సరిహద్దుల్లో దాడులు చేయడానికి పాకిస్థాన్ సిద్ధమైందని, కానీ, భారత్ మాత్రం నేరుగా దాని గుండెలపైనే తన్నిందని చెప్పారు. ఉగ్రవాదంపై పోరును ఆపరేషన్ సిందూర్ పునర్ నిర్వచించిందని, సరికొత్త బెంచ్ మార్క్ను నిర్దేశించిందని వ్యాఖ్యానించారు.
పాకిస్థాన్లో భారత్ సృష్టించిన యుద్ధ బీభత్సానికి తట్టుకోలేక ఆ దేశం కాళ్ల బేరానికి వచ్చిందని, మరోసారి ఉగ్రవాదానికి పాల్పడబోమని చెప్పిందని, అందుకే తాము కూడా కాల్పుల విరమణకు అంగీకరించామని చెప్పారు. పాకిస్థాన్లో చర్చలంటూ జరిగితే ఉగ్రవాదం, పాక్ ఆక్రమిత కశ్మీర్ను అప్పగించడంపైనేనని తేల్చి చెప్పారు. ఉగ్రవాదం, చర్చలు ఒకేసారి జరగవని, ఉగ్రవాదం, వాణిజ్యం ఒకే బాటలో సాగవని, రక్తం, నీళ్లు ఒకేసారి ప్రవహించవని స్పష్టం చేశారు. పహల్గాంలో ఉగ్ర దాడి.. అనంతరం ఉగ్రవాదుల పీచమణచడానికి భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో సోమవారం రాత్రి 8 గంటలకు ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
ఆపరేషన్ సిందూర్.. భావోద్వేగాల ప్రతీక
ఆపరేషన్ సిందూర్ అనేది కేవలం ఒక్క పేరు మాత్రమే కాదు.. అది కోట్లాదిమంది భారతీయుల భావోద్వేగాలకు ప్రతీక. న్యాయం జరగాలని చేసిన దృఢమైన సంకల్పం. దీనినే ఈనెల ఆరేడు తేదీల్లో ప్రపంచం మొత్తం చూసింది. పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలు, శిక్షణ శిబిరాలపై మన సైనిక బలగాలు కచ్చితమైన దాడులు చేశాయి. వాటిని తిరుగులేని దెబ్బతీశాయి. భారత్ ఇంత సాహసోపేతమైన అడుగులు వేస్తుందని ఉగ్రవాదులు ఎన్నడూ ఊహించి ఉండరు. కానీ, మాకు దేశమే తొలి ప్రాధాన్యమనే సంకల్పంతో జాతి మొత్తం ఏకమైంది. దృఢమైన నిర్ణయాలు తీసుకున్నాం. ప్రభావశీల ఫలితాలు వచ్చాయి. పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలపై మన క్షిపణి, డ్రోన్ దాడులు ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలనే కాదు.. వారి నైతిక స్థైర్యాన్ని కూడా బదాబదలు చేశాయి. బహావల్పూర్, మురుడ్కేల్లోని స్థావరాలు ఎప్పటి నుంచో ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కేంద్రాలు. అమెరికాలో 9/11, లండన్లోని ట్యూబ్ బాంబింగ్స్, దశాబ్దాలుగా భారత్లో ఉగ్రవాద దాడులు సహా ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాలకు వీటికి సంబంధం ఉంది. భారతీయ మహిళల పరువును తుడిచేయడానికి ఉగ్రవాదులు సాహసిస్తే.. భారతదేశం ఉగ్రవాద ప్రధాన కార్యాలయాలనే తుడిచిపెట్టేసింది. ఈ ఆపరేషన్లో వంద మందికిపైగా కరడుగట్టిన ఉగ్రవాదులు హతమయ్యారు. దశాబ్దాలుగా భారత్లో ఉగ్రదాడుల సూత్రధారులూ వీరిలో ఉన్నారు. భారత్కు ఉగ్ర ముప్పుగా పరిణమించిన వారిని అంతే వేగంగా హతమార్చాం.
ఉగ్రవాదంపై పోరుకు సిందూరమే మా విధానం
ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, బీఎ్సఎఫ్ వంటి సైనిక దళాలు, పారా మిలటరీ యూనిట్లు ఇప్పటికీ అప్రమత్తంగానే ఉన్నాయి. అన్ని వేళలా దేశ భద్రతకు హామీ ఇస్తున్నాయి. ఉగ్రవాదంపై పోరులో ఆపరేషన్ సిందూర్ ఇక నుంచి భారత సువ్యవస్థిత విధానం. భారత వ్యూహాత్మక వైఖరిలో నిర్ణయాత్మక మార్పు. ఉగ్రవాద వ్యతిరేక పోరాటాలకు ఈ ఆపరేషన్ సరికొత్త ప్రమాణాన్ని నిర్దేశించింది. మన భద్రతా సిద్ధాంతానికి మూడు మూల స్తంభాలున్నాయి. ఒకటి.. నిర్ణయాత్మక ప్రతి దాడి. భారత్పై ఉగ్రవాద దాడి జరిగితే.. బలంగా, తిరుగులేని విధంగా జవాబు ఇవ్వడం. భారత్ తన సొంత విధానాలతోనే ప్రతి దాడి చేస్తుంది. ఉగ్రవాద స్థావరాలను వాటి మూలాల్లోనే గురి పెడుతుంది. రెండోది.. అణు బ్లాక్ మెయిలింగ్ను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. అణ్వస్త్ర బెదిరింపులకు భయపడేది లేదు. అణు బూచి చూపించి ఉగ్ర స్థావరాలను నిర్వహిస్తే.. కచ్చితమైన, నిర్ణయాత్మక దాడులు చేస్తాం. మూడోది.. ఉగ్రవాదులు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేవారి మధ్య ఎటువంటి తేడా చూడం. ఉగ్రవాద నాయకులు, వారికి ఆశ్రయమిచ్చే ప్రభుత్వాలను వేర్వేరుగా చూడం. మనం హతమార్చిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాక్ సీనియర్ సైనికాధికారులు హాజరయ్యారు. అంటే, ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంలో పాక్ ఏ స్థాయిలో కూరుకుపోయిందో సుస్పష్టమైంది. ఈ వికల వాస్తవాన్ని ప్రపంచమంతా మరోసారి కళ్లారా చూసింది. ముప్పు నుంచి తన పౌరులను కాపాడుకోవడానికి భారత్ నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటూనే ఉంటుంది.
ఉగ్రవాద శకం కాదు
యుద్ధాల్లో పాకిస్థాన్ను భారత్ ఎప్పటికప్పుడు ఓడిస్తూనే ఉంది. దేశ సైనిక శక్తికి సంబంధించి ఆపరేషన్ సిందూర్ సరికొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఎడారుల్లోనే కాదు.. పర్వత ప్రాంతాల్లో యుద్ధాల్లో భారత్కు తిరుగులేని సామర్థ్యం ఉంది. తాజాగా అత్యాధునిక యుద్ధంలోనూ భారత్ పైచేయి చాటింది. ఈ ఆపరేషన్లో.. మేడిన్ ఇండియా రక్షణ పరికరాల సత్తా సుస్పష్టంగా రుజువైంది. 21వ శతాబ్దపు యుద్ధంలో బలీయమైన శక్తిగా మేడిన్ ఇండియా రక్షణ వ్యవస్థలు రావడాన్ని ప్రపంచం ఇప్పుడు కళ్లారా చూసింది. అన్ని రూపాల్లో ఉగ్రవాదంపై పోరాటానికి ఐకమత్యమే భారత్ అతి పెద్ద బలమని ఇప్పుడు రుజువైంది. ఇది యుద్ధాల యుగం కాదు. అలాగే, ఉగ్రవాద శకమూ కారాదు. సురక్షిత, అత్యుత్తమ ప్రపంచం కావాలంటే ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించరాదు.
ఉగ్రవాదం పాకిస్థాన్నే మింగేస్తుంది
పాకిస్థాన్ ప్రభుత్వం, సైన్యం ఎప్పటికప్పుడు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూనే ఉన్నాయి. పాకిస్థాన్ పతనానికి కూడా ఇటువంటి చర్యలే కారణమవుతాయి. ఉగ్రవాదానికి ఇలాగే చేయూత ఇస్తే ఏదో ఒక రోజు పాకిస్థాన్నే మింగేస్తుంది. పాకిస్థాన్ బయటపడాలంటే ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయాల్సిందే. శాంతికి ఇది తప్ప మరో మార్గం లేదు. ఉగ్రవాదం, చర్చలు సహజీవనం సాగించలేవు. ఉగ్రవాదం, వ్యాపారం ఒకే బాటలో పయనించలేవు. రక్తం, నీళ్లు కలిసి ప్రవహించలేవు. పాకిస్థాన్తో ఎప్పుడైనా చర్చలంటూ జరిగితే అది కేవలం ఉగ్రవాదంపైనే. పాక్తో సంప్రదింపులంటూ జరిగితే అది పాక్ ఆక్రమిత కశ్మీర్పైనే. సుదీర్ఘ కాలంగా మా విధానం ఇదే. ఈ రోజు బుద్ధ పూర్ణిమ. శాంతి మార్గాన్ని శక్తి నిర్దేశించాలని బుద్ధుడు ప్రవచించాడు. శాంతి, సౌభాగ్యాల దిశగా మానవత్వం ముందుకు అడుగులు వేయాలి. శాంతిని నిలబెట్టుకోవాలంటే భారత్ బలంగా ఉండాలి. అంతేనా.. అవసరం వచ్చినప్పుడు ఆ శక్తిని ప్రదర్శించాలి కూడా. తన సిద్ధాంతాలను కాపాడుకోవడానికి భారత్ సంకల్పాన్ని ఇటీవలి ఘటనలు ప్రదర్శించాయి. భారత భద్రతా దళాల తెగువకు మరోసారి వందనం. భారతీయుల ఐక్యత, ధైర్యానికి అభివందనం.
పాకిస్థాన్ పరుగెత్తుకుంటూ వచ్చింది
భారత్ బలంగా, కచ్చితంగా దాడులు చేయడంతో పాకిస్థాన్ తీవ్ర నిరాశానిస్పృహల్లో కూరుకుపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదంపై పోరుకు చేతులు కలపడానికి బదులుగా.. ప్రమాదకర ఆటకు తెరలేపింది. మన పాఠశాలలు, కాలేజీలు, గురుద్వారాలు, మందిరాలు, పౌర ఆవాసాలపై దాడులు చేసింది. అంతటితో ఆగలేదు. సైనిక స్థావరాలపైనా గురిపెట్టింది. కానీ, ఈ దాడి పాకిస్థాన్ దుర్భలత్వాన్ని బయటపెట్టింది. భారతదేశ అడ్వాన్స్డ్ వాయు రక్షణ వ్యవస్థల ముందు దాని క్షిపణులు, డ్రోన్లు కట్టె పుల్లల్లా తేలిపోయాయి. వాటిని గగనతలంలోనే నిర్వీర్యం చేశాయి. భారత సరిహద్దుల్లో దాడులు చేయాలని సిద్ధపడితే.. పాకిస్థాన్ నట్టింట్లోకి వెళ్లి గుండెలపైనే భారత్ గట్టిగా మోదింది. భారత క్షిపణులు, డ్రోన్లు అత్యంత కచ్చితత్వంతో దాడులు చేశాయి. పాక్ ఎప్పటినుంచో ఎంతో గొప్పగా చెప్పుకొనే దాని వైమానిక స్థావరాలను ఎందుకు పనికి రాకుండా ధ్వంసం చేశాయి. కేవలం 3రోజుల్లోనే పాకిస్థాన్ ఊహకు కూడా అందనంత విధ్వంసం జరిగింది. భారత్ ప్రతి దాడులతో పాకిస్థాన్ ఉద్రిక్తతలు చల్లారేందుకు దారులు వెతుక్కుంది. తమకు ఊరట కల్పించాలంటూ ప్రపంచ దేశాలను వేడుకుంది. మే 10న మధ్యాహ్నం పాక్ మిలటరీ అధికారులు మన డీజీఎంవో వద్దకు పరుగెత్తుకు వచ్చారు. ఉగ్రవాద కార్యకలాపాలన్నీ పూర్తిగా నిలిపివేస్తామని, భారత్పై సైనిక దాడిని కూడా ఆపేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే, పరిస్థితిని భారత్ సమీక్షించింది. పాక్ సైనిక, ఉగ్రవాద స్థావరాలపై ప్రతి దాడులను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. ఇది తాత్కాలికంగా నిలిపివేతే. కానీ ముగింపు కాదు. రాబోయే రోజుల్లో పాకిస్థాన్ ప్రతి అడుగునూ భారత్ నిరంతరం గమనిస్తుంది.
సైనిక దళాలకు, శాస్త్రవేత్తలకు సెల్యూట్
ఇటీవల భారత్ సహనం, సమర్థతను దేశమంతా చూసింది. ఇందుకు ప్రతి భారతీయుడి తరఫున సైనిక దళాలు, నిఘా సంస్థలు, శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేస్తున్నాను. ఆపరేషన్ సిందూర్ లక్ష్యాలను సాధించడంలో మన సైనికులు తిరుగులేని ధైర్యాన్ని ప్రదర్శించారు. వారి తిరుగులేని పరాక్రమాన్ని దేశంలోని ప్రతి తల్లి, సోదరి, కుమార్తెకు అంకితం ఇస్తున్నాను. పహల్గాం ఉగ్ర దాడి మొత్తం ప్రపంచాన్నే కుదిపేసింది. అమాయక పౌరులు సెలవులకు వెళితే.. కుటుంబ సభ్యులు, పిల్లల కళ్లెదుటే వారిని మతం అడిగి మరీ అతి కిరాతకంగా చంపేశారు. దేశ సామరస్యాన్ని ముక్కలు చేయడానికి చేసిన నీచ ప్రయత్నం ఇది. అందుకే, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రతి పౌరుడు, ప్రతి రాజకీయ పార్టీ.. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఏకతాటిపై నిలిచారు. అందుకే, ఉగ్రవాదులను ఏరివేయడానికి సైనిక దళాలకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. భారత మహిళల గౌరవానికి భంగం కలిగిస్తే ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయో ఇప్పుడు ఉగ్రవాద సంస్థలకు సుస్పష్టంగా అర్థమైంది.