Chinna Swamy Stadium Stampede: క్యాట్ ఆదేశాలను హైకోర్టులో సవాలు చేసిన కర్ణాటక సర్కార్
ABN , Publish Date - Jul 02 , 2025 | 05:49 PM
తొక్కిసలాట ఘటన అనంతరం బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ దయానంద్తో పటు పలువురు ఐపీఎస్ అధికారులపై కర్ణాటక ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. అయితే తన సస్పెన్షన్పై వికాస్ కుమార్ 'క్యాట్'ను ఆశ్రయించారు.

బెంగళూరు: చిన్నస్వామి స్టేడియంలో జూన్ 4న జరిగిన తొక్కిసలాట ఘటన మలుపులు తిరుగుతోంది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందడం, పలువురు గాయపడటంతో ఐపీఎస్ అధికారి వికాస్ కుమార్పై కర్ణాటక ప్రభుత్వం సస్పెన్సన్ వేటు వేసింది. అయితే ఆ సస్సెన్షన్ను సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT) మంగళవారంనాడు రద్దు చేయడం మరింత ఆసక్తిని రేపింది. తాజాగా 'క్యాట్' తీసుకున్న ఈ నిర్ణయాన్ని కర్ణాటక ప్రభుత్వం హైకోర్టు (High Court) లో బుధవారంనాడు సవాలు చేసింది. ఈ విషయాన్ని జస్టిస్ ఎస్జీ పండిట్ సారథ్యంలోని ధర్మాసనం దృష్టికి అడ్వకేట్ జనరల్ శశికిరణ్ షెట్టి తీసుకువెళ్లారు. తక్షణం విచారణ జరిపాలని కోరారు. దీంతో జూలై 3న విచారణ చేపట్టేందుకు ధర్మాసనం సమ్మతి తెలిపింది.
తొక్కిసలాట ఘటన అనంతరం బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ దయానంద్తో పటు పలువురు ఐపీఎస్ అధికారులపై కర్ణాటక ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. అయితే తన సస్పెన్షన్పై వికాస్ కుమార్ 'క్యాట్'ను ఆశ్రయించారు. ఈ క్రమంలో వికాస్ కుమార్పై వేసిన సస్పెన్షన్ను 'క్యాట్' మంగళవారంనాడు రద్దు చేసింది. ఆయనకు రావలసిన సర్వీసు బెనిఫెట్స్ అన్నీ యథాప్రకారం వర్తింపజేయాలని ఆదేశించింది.
ప్రభుత్వం నిర్దిష్ట ఆధారాలు, కారణాలతో కాకుండా యాంత్రిక పద్ధతిలోనే సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినట్టు ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. ప్రాథమిక సాక్ష్యాధారాల ప్రకారం స్టేడియం వద్ద 3 నుంచి 5 లక్షల మంది ప్రజలు గుమిగూడడానికి రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు (ఆర్సీబీ)దే భాద్యతని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. పోలీసుల నుంచి ఆర్సీబీ ఎలాంటి అనుమతి తీసుకోలేదని కూడా పేర్కొంది. పోలీసులపై బాధ్యత నెట్టేయడాన్ని 'క్యాట్' విభేదించింది. పోలీసులు కూడా అందరిలాంటి మనుషులేనని, మెజీషియన్లో, దేవుళ్లో కాదని, వారి చేతిలో అల్లావుద్దీన్ అద్భుతదీపం ఉండదని వ్యాఖ్యానించింది.
ఇవి కూడా చదవండి..
నాకు మరో దారి లేదు.. డీకే ఆసక్తికర వ్యాఖ్యలు
పార్లమెంటులో భద్రతా వైఫల్యం.. నిందితులకు బెయిల్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి