Share News

President Murmu: ఆ న్యాయమూర్తిని అభిశంసించండి

ABN , Publish Date - May 09 , 2025 | 04:33 AM

జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ ఇంట్లో డబ్బు కట్టలు కనిపించిన విషయం సుప్రీంకోర్టు కమిటీకి నిర్ధారణైంది. ఆయనపై అభిశంసన జరపాలని సీజే జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

 President Murmu: ఆ న్యాయమూర్తిని అభిశంసించండి

  • జస్టిస్‌ యశ్వంత్‌ వర్మపై ఇన్‌హౌస్‌ ప్రొసీజర్‌!

  • రాష్ట్రపతి, ప్రధానికి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి లేఖ

  • జడ్జి ఇంట్లో డబ్బు కట్టలు నిజమేనన్న కమిటీ

  • కమిటీ నివేదికను లేఖకు జతచేసిన చీఫ్‌ జస్టిస్‌ ఖన్నా

న్యూఢిల్లీ, మే 8 : న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ నివాసంలో భారీగా నగదు బయటపడిన వ్యవహారంలో ఆయనపై చర్యలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సిద్ధమవుతున్నారు. జస్టిస్‌ వర్మను అభిశంసించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరినట్టు సమాచారం. ఢిల్లీలోని న్యాయమూర్తి నివాసంలో డబ్బు కట్టలు కనిపించడం నిజమేనంటూ సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఇప్పటికే తేల్చింది. సీజేకు తన నివేదికను అందించింది. ఆ నివేదికను జస్టిస్‌ వర్మకు పంపి, దానిపై వివరణను ఆయన కోరారు. వైదొలగడమే మంచిదని ఆయనకు సూచించినట్టు కూడా వార్తలు వచ్చాయి. అందుకు జస్టిస్‌ వర్మ నిరాకరించినట్టు సమాచారం. ఇలాంటి సందర్భంలో సదరు జడ్జిపై ఇన్‌హౌస్‌ ప్రొసీజర్‌ను నడిపి అభిశంసించడంలో అతి ముఖ్య ఘట్టానికి సీజే శ్రీకారం చుట్టారని తెలిసింది. ఇందులోభాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీకి సీజే లేఖ రాశారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ఒక ప్రకటనలో ధ్రువీకరించింది. ఆరోపణలు ఎదుర్కొన్న న్యాయమూర్తి తప్పిదం తీవ్రమైనది కాదని కమిటీ నిర్ధారిస్తే ఇన్‌ హౌస్‌ ప్రొసీజర్‌లో సీజే మందలిస్తారు. అదేగనుక న్యాయమూర్తి చర్యను కమిటీ తీవ్రంగా పరిగణిస్తే అప్పుడు చీఫ్‌జస్టిస్‌ ఎదుట రెండు దారులు ఉంటాయి. న్యాయమూర్తిగా వైదొలగాలని లేక స్వచ్ఛందంగా పదవీవిరమణ చేయాలని సదరు జడ్జికి సూచిస్తారు. అందుకు ఆ న్యాయమూర్తి నిరాకరిస్తే ఆయనకు న్యాయబాధ్యతలేవీ ఇవ్వొద్దంటూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆదేశాలు జారీచేస్తారు. కమిటీ నివేదికలోని అంశాల తీవ్రతను రాష్ట్రపతి, ప్రధాని దృష్టికి తీసుకెళ్లి అభిశంసించాల్సిందిగా కోరతారు.

Updated Date - May 09 , 2025 | 04:35 AM