IRCTC Tatkal Booking : ఉదయం 10 తర్వాత తత్కాల్ బుకింగ్ పనిచేయదు..'ఎమర్జెన్సీ టిక్కెట్' సిస్టమ్పై వివాదం..
ABN , Publish Date - Jan 28 , 2025 | 02:27 PM
ఐఆర్సీటీసీ తత్కాల్ బుకింగ్ సేవల్లో అంతరాయంపై ఓ ప్యాసెంజర్ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వివాదం చెలరేగింది. ఐఆర్సీటీసీ తత్కాల్ సిస్టమ్లో అసలు ఏం జరుగుతోందంటూ పలువురు ప్యాసింజర్లు సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు..

ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)కు చెందిన ఈ- టికెట్ సేవల్లో మళ్లీ అంతరాయం తలెత్తింది. అత్యవసర సమయంలో తత్కాల్ సేవలపై ఆధారపడే ప్రయాణీకులు తరచూ బుకింగ్ సేవలు నిలిచిపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టిక్కెట్లను బుక్ చేయడంలో రోజువారీ సవాళ్లతో పాటు, IRCTC వెబ్సైట్ నిర్వహణ పనితీరు పేలవంగా ఉందని విమర్శలు చేస్తున్నారు. దీని ఫలితంగా వేలాది మంది ప్రయాణికుల బుకింగ్లకు అంతరాయం కలిగి ఇబ్బందులు పడుతున్నారని.. ఏజెంట్లను ప్రోత్సహిస్తూ రైల్వే వ్యవస్థ మరో స్కామ్కు ప్లాట్ఫారమ్గా మారిందని ఐఆర్సీటీసీ సేవలతో విసుగు చెందిన కస్టమర్లు ఆరోపిస్తున్నారు.
ఓ ప్యాసెంజర్ ఎమర్జెన్సీ టిక్కెట్' విధానంపై ఎక్స్ వేదికగా రైల్వే మంత్రిని ఉద్దేశిస్తూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. దేశవ్యాప్తంగా ఈ విషయమై అనేక మంది ఎక్స్ సోషల్ మీడియా వేదికగా ఐఆర్సీటీసీకి ఫిర్యాదు చేస్తున్నారు."మాటిమాటికీ సర్వర్ డౌన్ అవుతోంది. వెబ్సైట్ పనిచేయడం లేదు. ఆన్లైన్లో తత్కాల్ టికెట్ బుకింగ్ చేసుకోవడం వీలుకావడం లేదు. ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు" అంటూ పలువురు ప్యాసింజర్లు కామెంట్ చేస్తున్నారు.
ఆన్లైన్లో తత్కాల్ బుకింగ్ సేవలు కష్టతరంగా మారాయని దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది ఐఆర్సీటీసీ. తత్కాల్ బుకింగ్ల సమయంలో ఉపయోగించే వెబ్సైట్లో తలెత్తుతున్న అవాంతరాలపై రవిసుతంజని అనే వ్యక్తి ఎక్స్లో రైల్వే మంత్రిని ఉద్దేశిస్తూ "“తత్కాల్ రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి రైల్వే మంత్రి ఒకసారి IRCTC వెబ్సైట్ని ఉపయోగించాలి. ఆ వెబ్సైట్/యాప్ ఉదయం 10 గంటలకు పని చేయదు. మీరు లాగిన్ అయ్యే సమయానికి అన్ని టిక్కెట్లు దాదాపు అయిపోతాయి. ఒక దశాబ్దం గడిచినా వారు దీన్ని సరిదిద్దలేరు." అని ఘాటుగా ట్వీట్ చేయడంతో సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.
ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా కనీసం ఒక్కసారైనా తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు ప్రయత్నించాలని రైల్వే మంత్రిని కోరుతూ ఎక్స్లో ఓ యూజర్ చేసిన ట్వీట్ వైరల్గా మారింది. ఈ విషయమై పలువురు నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఐఆర్సీటీసీ అత్యవసర టిక్కెట్ బుకింగ్ ప్రక్రియలో తాము ఎదుర్కొంటున్న సవాళ్లు, ఇబ్బందులను పలువురు ప్యాసింజర్లు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. సరిగ్గా ఉదయం 10 తర్వాత వెబ్సైట్ పనిచేయకపోవడం, తత్కాల్ టికెట్ దొరకడం ఎంత కష్టమో ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తేగానీ పరిస్థితి అర్థం కాదని కామెంట్లు చేస్తున్నారు. ఇందుకు భిన్నంగా కొందరు ఐఆర్సీటీసీని సమర్థించారు. అధిక డిమాండ్ కారణంగానే తత్కాల్ బుకింగ్ చేసుకునేటప్పుడు సర్వర్ డౌన్ అవుతుందని సూచించారు. మరి,జొమాటో, స్విగ్గీ, ఓలా లేదా ఉబెర్లు ఎక్కువ డిమాండ్ ఉన్న సమయంలో కూడా కచ్చితత్వంతో సిస్టమ్ ఎలా హ్యాండిల్ చేస్తుంటాయనే రవిసుతంజని ప్రశ్నను కొందరు నెటిజన్లు సమర్థిస్తున్నారు.
బ్లాక్మార్కెటింగ్ ఏజెంట్లు..
ఐఆర్సీటీసీ తత్కాల్ సిస్టమ్ బ్లాక్మార్కెటింగ్ ఏజెంట్లకు అనుకూలంగా ఉందని పలువురు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. టిక్కెట్లను చాలా వరకూ వారే బుక్ చేసుకోవడం వల్లే ప్రయాణీకులకు బుకింగ్ హామీ ఇవ్వగలుగుతున్నారని, ఇందుకు బదులుగా ఒక్కో టికెట్పై అదనంగా రూ. 400-500 వసూలు చేస్తున్నారని కామెంట్ చేశారు. ఈ విధానంతో రోజువారీ ప్రయాణీకులు టిక్కెట్లు పొందడం కష్టతరంగా మారడమే కాకుండా బ్లాక్ మార్కెట్ ఆర్థిక వ్యవస్థకు ఆజ్యం పోస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.